తెలంగాణ

telangana

ETV Bharat / sports

ఈరోజు: టీమ్​ఇండియా బోల్తా.. సచిన్ అరుదైన రికార్డు

కరోనా వైరస్‌ నేపథ్యంలో క్రీడా టోర్నీలన్నీ నిలిచిపోయాయి. ఈ సందర్భంలో గత స్మృతులను నెమరువేసుకుంటే టీమ్​ఇండియాకు ఈరోజుకు సంబంధించి రెండు ప్రత్యేక విశేషాలున్నాయి. సరిగ్గా నాలుగేళ్ల క్రితం 2016 టీ20 ప్రపంచకప్‌ సెమీఫైనల్లో ఓటమిపాలై మనోవేదనకు గురైంది భారత్. వెస్టిండీస్‌తో అద్భుతంగా తలపడినా.. అనూహ్య రీతిలో పరాజయం చెందింది. క్రికెట్‌ దిగ్గజం సచిన్‌ తెందూల్కర్‌ 2001లో ఇదే రోజు ప్రత్యేక రికార్డు నెలకొల్పడం విశేషం.

By

Published : Mar 31, 2020, 4:00 PM IST

Four years back on this day Team India lost semifinals against West Indies in T20 World-Cup
సచిన్​, కోహ్లీ బ్యాట్​తో మ్యాజిక్​ చేసిన రోజు

2016 టీ20 ప్రపంచకప్‌ స్వదేశంలో జరగడం వల్ల టీమ్​ఇండియా కచ్చితంగా రెండోసారి ఈ ఫార్మాట్‌లో విశ్వవిజేతగా నిలుస్తుందని అంతా భావించారు. లీగ్‌ స్టేజ్‌లో అదరగొట్టిన ధోనీసేన సెమీస్‌లో విండీస్‌తో అద్భుతంగా తలపడినా చివరి క్షణాల్లో బోల్తాపడింది. విరాట్‌ కోహ్లీ(89; 47 బంతుల్లో 11x4, 1x6) మెరుపు బ్యాటింగ్‌కు తోడు.. రోహిత్‌శర్మ (43), అజింక్య రహానె(40) శుభారంభం ఇవ్వడం వల్ల తొలుత బ్యాటింగ్‌ చేసిన భారత్​ రెండు వికెట్ల నష్టానికి 192 పరుగులు చేసింది. రోహిత్‌, రహానె తొలి వికెట్‌కు 7.2 ఓవర్లలోనే 62 పరుగులు జోడించారు. రోహిత్ ఔటయ్యాక.. రహానెతో జోడీకట్టిన విరాట్‌ రెండో వికెట్‌కు 66 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు. 128 పరుగుల వద్ద రహానె పెవిలియన్ చేరాక.. కోహ్లీ, నాటి కెప్టెన్‌ ధోనీ(15)తో కలిసి మరో అద్భుత ఇన్నింగ్స్‌ ఆడాడు.

భారత్‌ గెలుస్తుందనుకుంటే..!

భారీ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో విండీస్‌ ఆదిలోనే రెండు వికెట్లు కోల్పోయింది. ప్రమాదకర క్రిస్‌గేల్‌(5), శామ్యూల్స్‌(8) తొలి మూడు ఓవర్లలోనే పెవిలియన్‌ చేరడం వల్ల టీమ్​ఇండియా విజయం ఖాయమనుకున్నారు. తర్వాత జాన్సన్‌ (52), లెండిల్‌ సిమ్మన్స్‌(82) నిలకడగా ఆడి జట్టు స్కోరును ముందుకు తీసుకెళ్లారు. 116 పరుగుల వద్ద జాన్సన్‌ ఔటయ్యాక.. విండీస్‌ విజయానికి 6 ఓవర్లలో 73 పరుగులు అవసరమయ్యాయి. అప్పుడు బ్యాటింగ్‌కు వచ్చిన ఆండ్రూ రసెల్‌(43; 20 బంతుల్లో 3x4, 4x6) విధ్వంసకరంగా బ్యాటింగ్‌ చేసి విండీస్‌ను గెలిపించాడు. తర్వాత ఆ జట్టు ఫైనల్లో ఇంగ్లాండ్‌ను ఓడించి టీ20 ప్రపంచకప్‌ సాధించింది.

2016 టీ20 ప్రపంచకప్ సెమీస్​లో భారత్​, వెస్టీండీస్​

ఆ రికార్డు సాధించిన తొలి క్రికెటర్‌ సచిన్‌

2001 మార్చి 31న క్రికెట్‌ దిగ్గజం సచిన్‌ తెందూల్కర్‌ వన్డేల్లో అరుదైన రికార్డు సాధించిన బ్యాట్స్‌మన్‌గా చరిత్ర సృష్టించాడు. ఈ ఫార్మాట్‌లో పదివేల పరుగుల మైలురాయి చేరుకున్న తొలి క్రికెటర్‌గా రికార్డు నెలకొల్పాడు. ద్వైపాక్షిక సిరీస్‌లో భాగంగా ఆస్ట్రేలియాతో ఇండోర్‌లో జరిగిన మూడో వన్డేలో లిటిల్‌ మాస్టర్‌ ఈ ఘనత సాధించాడు. ఆ తర్వాత వన్డేల్లో 13 మంది ఈ మైలురాయిని చేరుకున్నారు. టీమ్​ఇండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ(205 ఇన్నింగ్స్‌లో) 2018 అక్టోబర్‌ 24న అత్యంత వేగంగా ఈ రికార్డు సాధించి సచిన్‌ (259 ఇన్నింగ్స్‌) రికార్డును అధిగమించాడు.

సచిన్​ తెందుల్కర్​

ఇదీ చూడండి.. కరోనాపై పోరుకు మద్దతుగా కోహ్లీ గుండు!

ABOUT THE AUTHOR

...view details