తెలంగాణ

telangana

By

Published : Aug 25, 2019, 9:35 PM IST

Updated : Sep 28, 2019, 6:21 AM IST

ETV Bharat / sports

ఈ పతకం అమ్మకు పుట్టినరోజు కానుక: పీవీ సింధు

ప్రపంచ ఛాంపియన్​షిప్​లో స్వర్ణం గెలిచిన పీవీ సింధు.. ఈ పతకాన్ని తన తల్లి విజయలక్ష్మికి పుట్టినరోజు బహుమతిగా ఇస్తున్నానని చెప్పింది. అదే విధంగా ఈ టోర్నీలో బంగారు పతకం సాధించిన తొలి భారత బ్యాడ్మింటన్​ ప్లేయర్​గా​ నిలిచిందీ తెలుగు తేజం.

పీవీ సింధు

భారత బ్యాడ్మింటన్​ క్రీడాకారిణి పీవీ.సింధుప్రపంచ ఛాంపియన్​షిప్​లో చరిత్ర లిఖించింది. స్విట్జర్లాండ్​ వేదికగా జరిగిన ఈ టోర్నీలో వరుసగా మూడోసారి ఫైనల్​కు చేరిన తెలుగు తేజం.. స్వర్ణం సాధించిన తొలి భారత ప్లేయర్​గా నిలిచింది. తుదిపోరులో విజయంతో తనకు మాటలు రావట్లేదని, ఎన్నో రోజుల నుంచి ఎదురుచూస్తున్న కల నెరవేరిందని చెప్పుకొచ్చింది సింధు.

"నేను చాలా ఆనందంగా ఉన్నాను. ఈ టోర్నీలో విజేతగా నిలిచేందుకు చాలా కాలం నుంచి ఎదురుచూశాను. చివరికి సాధించాను. చెప్పేందుకు మాటలు రావట్లేదు. ఎంతో కాలం నుంచి కంటున్న కల నెరవేరింది. ఇప్పుడు ఈ విజయాన్ని ఆస్వాదిస్తున్నాను." -పీవీ సింధు, భారత బ్యాడ్మింటన్​ క్రీడాకారిణి

ప్రపంచ ఛాంపియన్​షిప్​లో సింధుకిది ఐదో పతకం. మహిళల సింగిల్స్​ విభాగంలో అత్యధిక పతకాలు సాధించిన ప్లేయర్​ జంగ్ నింగ్(చైనా)​ సరసన నిలిచింది సింధు. ఇప్పటికే ఆమె ఖాతాలో రెండు కాంస్యాలు, రెండు రజతాలు ఉన్నాయి.

ప్రపంచ ఛాంపియన్​షిప్​ గెలిచిన పీవీ సింధు

అయితే ఈ విజయాన్ని తన తల్లికి అంకితమిస్తున్నానని చెప్పింది పూసర్ల వెంకట సింధు.

"నాపై నమ్మకముంచిన నా కోచ్​లు(గోపీచంద్, కిమ్), తల్లి తండ్రులు, సిబ్బంది అందరికి ఈ గెలుపులో భాగముంది. ఈ విజయాన్ని మా అమ్మకు అంకితమిస్తున్నా. ఈ రోజు ఆమె పుట్టినరోజు. అందుకోసం ఏదో ఒక బహుమతి ఇవ్వాలనుకున్నా. ఇప్పుడు ఈ బంగారు పతకాన్నిస్తున్నాను. ఈ రోజు ఇలా ఉన్నానంటే కారణం వారే." -పీవీ సింధు, భారత బ్యాడ్మింటన్​ క్రీడాకారిణి

పీవీ సింధు తల్లి విజయలక్ష్మి- పీవీ సింధు

మ్యాచ్​ గెలిచిన అనంతరం పతకం తీసుకునేందుకు పోడియంపై నిల్చున్న సింధు.. భారత జాతీయ గీతం వస్తున్న సమయంలో భావోద్వేగం నిండిన కళ్లతో కనిపించింది.

"జాతీయ జెండాతో పాటు జాతీయ గీతం వినిపిస్తున్నప్పుడు రోమాలు నిక్కబొడుచుకున్నాయి. మాటలు రావట్లేదు. ఎందుకంటే దేశం తరఫున ప్రాతినిధ్యం వహించి విజేతగా నిలవడం నిజంగా గర్వకారణం" -పీవీ సింధు, భారత బ్యాడ్మింటన్​ క్రీడాకారిణి

2016 ఒలింపిక్స్​లో రజతం, గోల్డ్​కోస్ట్​ కామన్వెల్త్​ గేమ్స్​, ఆసియా క్రీడల్లో వెండి పతకం​ గెలుచుకుంది ప్రపంచ ఛాంపియన్​​ సింధు. అయితే గెలుపోటములతో తనకు సంబంధం లేదని, మ్యాచ్​ ఏదైనా అత్యుత్తమంగా ఆట కనబరుస్తానని చెప్పింది.

ఇది చదవండి: ఈ గెలుపు నాకు పుట్టిన రోజు బహుమతి: తల్లి విజయలక్ష్మి

Last Updated : Sep 28, 2019, 6:21 AM IST

ABOUT THE AUTHOR

...view details