వెండితెరపై విలక్షణ హాస్యంతో ఆయన సృష్టించిన ట్రెండ్ నభూతో నభవిష్యతి. యాక్షన్కు కామెడీని జోడిస్తూ.. సరికొత్త పాత్రలను సృష్టిస్తూ క్రిస్పీ స్క్రీన్ప్లేతో ఆయన తీసిన సినిమాలు కామెడీకి కేరాఫ్ అడ్రస్లుగా మారాయి. చిన్న హీరో అయినా.. స్టార్ హీరో అయినా.. తన మార్క్ ఎంటర్టైన్మెంట్తో ఎన్నో సంచలన హిట్స్ను అందుకున్న స్టార్ డైరెక్టర్.. శ్రీను వైట్ల. ఆయన ఆలీ వ్యాఖ్యాతగా 'ఈటీవీ'లో ప్రసారమయ్యే 'ఆలీతో సరదాగా' కార్యక్రమానికి విచ్చేసి తన జీవితంలో జరిగిన ఎన్నో విషయాలను పంచుకున్నారు.
వ్యక్తిగతంగా.. వృత్తిపరంగా మీ లైఫ్ ఎలా ఉంది?
శ్రీను వైట్ల: రెండు విధాలా ఫర్వాలేదు. ప్యాషన్తో సినిమాల్లోకి వచ్చినా.. అల్టిమేట్గా డబ్బు సంపాదనే ముఖ్యం. ప్రస్తుతం అనుకున్న దానికన్నా చాలా సౌకర్యవంతంగానే ఉన్నా. నా వాళ్లను చూసుకోవడం వంటి బాధ్యతలన్నీ నెరవేర్చాను. చేయాల్సినవన్నీ చేశా. ఇక నేను ఎవరికీ జవాబుదారీ కాను. వృత్తిపరంగా మూడు స్క్రిప్ట్లు సిద్ధం చేశాను. ఒక దాని తర్వాత మరొకటి తీసే ప్రయత్నం చేస్తున్నా.
మీ 'డి అండ్ డి' ఎప్పుడు స్టార్ట్ అవుతుంది?
శ్రీను వైట్ల: ఈ నెలలో షూటింగ్ ప్రారంభమవుతుంది. విష్ణు హీరో.. ఫరియా అబ్దుల్లా హీరోయిన్. మిగతా ఆర్టిస్టులు కూడా ఎక్కువ మందే ఉన్నారు.
'ఢీ' ఏ రేంజ్ ఉందో 'డి అండ్ డి' కూడా అదే రేంజ్లో ఉంటుందా?
శ్రీను వైట్ల: అదే ప్రయత్నం చేస్తున్నాం. నా నుంచి కామెడీ ఎక్కువగా కోరుకుంటారు. ఆద్యంతం నవ్వించడమే ఈ సినిమా ఉద్దేశం. ఆ విధంగానే స్క్రిప్ట్ను సిద్ధం చేశాం.
కందులపాలెం నుంచి ఏం అవుదామని వచ్చారు?
శ్రీను వైట్ల: చిన్నప్పట్నుంచి డైరెక్టర్ అవ్వాలనేదే గోల్. మా ఊరి పక్కనే కాలేజీ ఉన్నా.. కాకినాడలో అయితే ఎక్కువ థియేటర్లు ఉంటాయి.. రూమ్లో ఉంటూ సినిమాలు చూడొచ్చని అక్కడ ఇంటర్మీడియట్లో చేరా. ఆ సమయంలో డైరెక్టర్ మణిరత్నం, వంశీ సినిమాలంటే చాలా ఇష్టం. వారిని చూసి డైరెక్టర్ అవ్వాలనుకున్నాను. చిన్న వయసులోనే ఆ ఆలోచన వచ్చింది. ఇంట్లో చెప్తే ఒప్పుకోరని.. ఫీజు పేరుతో డబ్బులు తీసుకొని సామర్లకోటలో బొకారో ఎక్స్ప్రెస్ ఎక్కాను.
తమిళ భాష రాదు.. చెన్నైలో దిగగానే ఎక్కడికి వెళ్లారు? ఎవరిని కలిశారు?
శ్రీను వైట్ల:అప్పుడు నా వయసు 18 ఏళ్లు. చెన్నైలో దిగే సమయానికి మధ్యాహ్నమైంది. ఆ రోజు చెన్నైలో బస్సులు స్ట్రైక్. నాకేమో తమిళ్ రాదు. పాండి బజార్ వెళ్లాలనేది మాత్రమే తెలుసు. ఎలా వెళ్లాలో తెలియక బ్యాగ్ పట్టుకొని అదే మాట అడుగుతూ.. నడిచి వెళ్లాను. అయితే, రైలులో ఒక సంఘటన జరిగింది. కాకినాడలో తెలిసిన వ్యక్తి నాతోపాటు విజయవాడ వరకు వచ్చాడు. నేను మద్రాసు వెళ్తున్నానని చెప్పడం వల్ల తన సోదరుడు చెన్నైలో ఉంటాడని చెప్పాడు. దీంతో అతని అడ్రస్ తీసుకున్నా. పాండి బజార్లోని మలార్కుడి మ్యాన్షన్లో ఉంటాడని తెలుసుకొని నేరుగా అతడి వద్దకు వెళ్లా. అతడి దగ్గర రెండ్రోజులుండి.. ఆ తర్వాత అక్కడే మరో వ్యక్తి రూమ్లోకి చేరా. అవకాశాల కోసం ప్రయత్నం చేస్తుండగా.. వైజాగ్లో ఉండే డిస్ట్రిబ్యూటర్ ఎన్వీ రెడ్డి పరిచయమయ్యారు. ఆయన ద్వారా డైరెక్టర్ చలసాని రామారావు పరిచయమయ్యారు. ఆయన 1989లో బాలకృష్ణతో 'ప్రాణానికి ప్రాణం' అనే సినిమా చేశారు. ఆ సినిమాకు నేను అప్రెంటిస్గా చేరా. అలా నా కెరీర్ మొదలైంది. ఆ సినిమా సరిగా ఆడలేదు. ఆ తర్వాత సాగర్, ఈవీవీ సత్యనారాయణ వద్ద పనిచేశా. అక్కడితో అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేయడం ఆపేసి డైరెక్టర్ అయ్యాను.
డైరెక్టర్గా నిరూపించుకోవాలని చెన్నైకి వచ్చిన మీకు.. ఒక మెస్లో తింటుండగా మీ అన్న ఎదురుపడ్డారట. అప్పుడు మీ స్పందనేంటి?
శ్రీను వైట్ల: షాక్.. ఊహించలేదసలు. ప్రాణానికి ప్రాణం సినిమా కోసం తలకోన వెళ్లాం. నేను ఇంట్లో చెప్పకుండా వచ్చేసే సరికి మా నాన్న.. మా అన్న(పెద్దనాన్న కుమారుడు)ని పంపించాడు. ఆ విషయం నాకు తెలియదు. మేనకా మెస్లో అన్న భోజనం చేస్తుంటే.. అనిల్ సుంకర కలిసి విషయం తెలుసుకున్నాడు. అప్పటికి అతనితో నాకు పరిచయం లేదు. అనిల్ సుంకరకు హెల్పింగ్ నేచర్ ఎక్కువ. ఆయన కూడా నా కోసం వెతకడం మొదలుపెట్టాడు. నేను అవుట్డోర్ షూటింగ్ వెళ్లానని తెలుసుకొని.. నేను వచ్చే వరకు మా అన్నని తన రూమ్లో పెట్టుకున్నాడు. నేను షూటింగ్ నుంచి తిరిగొచ్చి.. మెస్లో భోజనం చేస్తుంటే ఎదురుగా.. అన్న, అనిల్ నిల్చున్నారు. అనిల్కు నా ప్యాషన్ అర్థమై.. అన్నకి సర్దిచెప్పాడు. ఆ తర్వాత నన్ను ఆయనుండే సుగంధి మ్యాన్షన్లోని రూమ్కు రమ్మనడం వల్ల అక్కడికి షిఫ్ట్ అయ్యా. (మధ్యలో ఆలీ అందుకుని..నిజానికి మలార్కుడి, సుగంధి మ్యాన్షన్ కట్టింది.. సినిమావాళ్ల కోసమే. ఆ రోజుల్లో అక్కడికి వెళ్లి నిల్చుంటే.. అసిస్టెంట్ డైరెక్టర్లు, కెమెరా అసిస్టెంట్లు, అప్కమింగ్ ఆర్టిస్టులు 70-80 మంది కనిపించేవారట)
శ్రీను వైట్ల: అవును. అదో అందమైన అనుభవం. నేను ఎప్పుడైనా చెన్నైకి వెళ్తే అక్కడికి వెళ్తుంటా.
డైరెక్టర్గా తొలి అవకాశం ఏ సినిమాకి వచ్చింది?
శ్రీను వైట్ల: 1997లోనే రాజశేఖర్ గారితో 'అపరిచితుడు'(srinu vaitla first movie) మొదలుపెట్టాం. సాంబిరెడ్డి అనే వ్యక్తి నా మిత్రుడి మిత్రుడు. అతడే నా ప్యాషన్ చూసి దర్శకుడిని చేద్దామనుకున్నారు. కథ చెప్పగానే నచ్చడం వల్ల సినిమా స్టార్ట్ చేశాం. కానీ, అతడికి ఆర్థిక కష్టాలు రావడం వల్ల సినిమా ఆగిపోయింది. చాలా బాధపడ్డా. మళ్లీ ఆ చిత్రం పట్టాలెక్కినా అనేక కారణాలతో పూర్తి అవట్లేదని వదిలేశాం. ఆ తర్వాత నేను సినిమా బాగా తీస్తున్నానని తెలిసి.. కొందరు నిర్మాతలు తక్కువ బడ్జెట్లో సినిమా చేద్దామని నా వద్దకు వచ్చారు. అప్పుడు రవితేజ హీరోగా 'నీ కోసం' తీశా. దాని బడ్జెట్ రూ. 38లక్షలు.. 28 రోజుల్లో సినిమా పూర్తి చేశాం. ఆ సినిమా నాగార్జున గారికి నచ్చి నాకు డైరెక్షన్ ఆఫర్ చేశారు. కథ కూడా చెప్పమన్నారు. ఈ విషయం తెలిసి మయూరి సుధాకర్ గారు కూడా నా సినిమా చూశారట. ఆయనకూ నచ్చడం వల్ల రామోజీరావు గారికి చూపించారు. అప్పుడు రామోజీరావు గారు ఆ సినిమా కొని విడుదల చేశారు. అలా ఆ సినిమా బయటకొచ్చింది.. దానికి ఏడు నంది అవార్డులు వచ్చాయి.
అది అయిన తర్వాతే 'ఆనందం'కు అవకాశం ఇచ్చారా?
శ్రీను వైట్ల: ఆ సినిమా చూసిన రామోజీరావు గారు 'సినిమా బాగా తీశారు. మన బ్యానర్లో కచ్చితంగా అవకాశం ఇస్తాం' అన్నారు. మాట ప్రకారం 'ఆనందం' సినిమా ఇచ్చారు. అయితే, ఉషాకిరణ్ మూవీస్ నుంచి నాకు వేరే కథ వచ్చింది. దానిపై చింతపల్లి మురళి గారితో కలిసి వర్క్ చేశాం. కానీ, అది వర్కవుట్ అవలేదు. అప్పుడు నా సొంత కథ 'ఆనందం'(anandam movie director) చెబితే రామోజీరావు గారు సింగిల్ సిట్టింగ్లో ఓకే చెప్పారు. 'ఇక మీరు సినిమా స్టార్ట్ చేసుకోవచ్చు' అన్నారు. 'మంచి రోజు చూసి మొదలుపెడతాం సర్' అని రామోజీరావు గారితో అన్నాను. అలా అనగానే 'మీరు చెడ్డ రోజు చూసి మొదలుపెట్టండి. ఎందుకు ఆడదో చూద్దాం' అన్నారాయన. నిజంగా ఇదే మాట అన్నారు. ఆయన ఇలాంటి వాటిని నమ్మరు. ఆయన అన్న మాట ప్రకారం ఆ సినిమా పెద్ద హిట్ అయింది.
డైరెక్టర్గా మీ డైరెక్షన్లో ఎన్ని సినిమాలు అయ్యాయి?వాటిలో ఎన్ని హిట్ అయ్యాయి?
శ్రీను వైట్ల: 17 సినిమాలు. హిట్లు నేను లెక్కపెట్టలేదు. కానీ, మ్యాగ్జిమమ్ హిట్ అయ్యాయి. కొన్ని యావరేజ్ ఉన్నాయి. కొన్ని ఫ్లాప్ అయ్యాయి.
ఈ సినిమా కచ్చితంగా ప్రజలకు నచ్చుతుంది. నా కెరీర్లోనే పెద్ద హిట్ అవుతుందనుకున్న సినిమా విడుదలయ్యాక నిరాశపర్చిన సినిమా ఏది?
శ్రీను వైట్ల: అలా ఏ సినిమాకీ జరగలేదు. ఇది పెద్ద హిట్ అవుతుంది అనుకున్నవి అలాగే అయ్యాయి. కానీ, ప్లాప్ అవలేదు. నాకు కాస్త డౌటు కొట్టి లేదా అనేక కారణాల వల్ల సినిమాని పూర్తి చేయాల్సి వస్తే నేను మానసికంగా ముందుగానే సిద్ధమై ఉంటా. అమర్ అక్బర్ ఆంథోనీ చిత్రం ఒక ప్రయోగం. దాన్ని పరిమిత బడ్జెట్లో తీశాను. ఆ సినిమాను ఎలా చేయాలో అలాగే చేశాం. దాని ఫలితానికి నేను షాక్ అవ్వలేదు.
అమర్ అక్బర్ ఆంథోనీ విషయంలో శ్రీను వైట్ల ప్రొడక్షన్ కూడా చూసుకోవడం వల్ల డైరెక్షన్ మీద దృష్టి పెట్టలేకపోయాడు అనే టాక్ ఉంది?
శ్రీను వైట్ల: అది నిజం కాదు. ఎందుకంటే.. 'ఢీ' సినిమా మొత్తం నా భుజాన మీద వేసుకొని తీశాను. నిర్మాతతో సహా అన్ని నేనే. మరి అది సూపర్ డూపర్ హిట్ అయింది కదా!. 'అమర్ అక్బర్ ఆంథోనీ'(srinu vaitla and ravi teja movies) సినిమా విషయంలో జరిగింది అది కాదు. ఏ సినిమా ఆడటానికైనా మూల కారణం కథ. ఆ కథ బాగా లేకపోతే ఎంత పెద్ద ప్రొడక్షన్ అయినా నష్టం పెరుగుతుంది తప్ప.. ఫలితం మారదు. నేను ఆ సినిమాను ఎంతలో చేశానో నాకు తెలుసు. అందుకే నిర్మాతలకు నన్ను నిందించే ఆస్కారం రాలేదు. మేమంతా పరిస్థితిని అర్థం చేసుకొని తీసిన సినిమా. అంతేగానీ.. ప్రొడక్షన్ నెత్తిన వేసుకోవడం వల్ల కాదు. ఆ మాటకొస్తే.. 'దూకుడు', 'నమో వెంకటేశ' సినిమా నిర్మాతలను నేనే పరిచయం చేశా. అప్పుడు ప్రొడక్షన్ అంతా నేనే చూసుకున్నా. అవన్నీ హిట్ అయ్యాయి కదా.
సినిమా ప్రొడక్షన్ భూజాన వేసుకోవడం విషయంలో ఒక సమాధానం చెప్తా. ఆ పని ఎందుకు చేస్తానంటే.. సినిమా ఫలితం మన చేతుల్లో ఉండదు. సినిమా ఫలితం ఎలా ఉన్నా నిర్మాతలు సేఫ్గా ఉండాలని ఆలోచిస్తా. తక్కువలో తీశాను.. నిర్మాతలు సంతోషమే కదా అని అనిపించుకోవాలని కోరుకుంటా. మనం ఏది కోరుకుంటామో అది ఈ ప్రపంచం ఇవ్వదు. నా సినిమాలు ఫ్లాప్ అయితే ఆ ప్రభావం నాపై పడింది కానీ.. నిర్మాతలపై పడనివ్వలేదు. కానీ, అది ఎవరూ ఒప్పుకోరు. అందుకే దేనిపైనా నేను వివరణ ఇవ్వను. వారి గురించి ఆలోచిస్తే మన ఆరోగ్యం పాడవుతుంది. ప్రస్తుతం నా పని నేను చేసుకుంటూ సంతోషంగా ఉన్నా. సినిమాపై ప్యాషన్ నాకు ఎప్పటికీ ఉంటుంది.
శ్రీను వైట్ల ద్వారా పరిచయమై.. పెద్ద పేరు సంపాదించిన వాళ్లే.. శ్రీనువైట్ల గురించి మీడియాలో ఎక్కువ మాట్లాడారు. ఆ టైంలో మీకు ఏం అనిపించింది?
శ్రీను వైట్ల: అవన్నీ నేను పట్టించుకోను. నా ప్యాషన్ సినిమా. సినిమాతోనే నా కనెక్షన్. ఎవరు ఏం అనుకున్నా నేను పట్టించుకోను. ఒకప్పుడు స్పందించేవాడిని. కానీ, ఇప్పుడు అవి నన్ను ప్రభావితం చేయవు.
మీ తప్పు లేనప్పుడు మీ గురించి మాట్లాడుతుంటే.. మీరెందుకు వచ్చి మాట్లాడలేదు?
శ్రీను వైట్ల: మాట్లాడటం వల్ల అభిప్రాయాలు మారుతాయని మొదట నేను నమ్మను. నాపై ఎన్ని ఆరోపణలు చేసినా నేను స్పందించను. ప్రకాశ్రాజ్తో జరిగిన ఓ సంఘటనలో నా టీం బలవంతం మేరకు స్పందించానంతే.
మీ సినిమాల్లో మందు కొట్టే సీన్ తప్పనిసరిగా ఒకటి ఉంటుంది. అది సెంటిమెంటా? ఆ సీన్ చేసేటప్పుడు సరదా ఉంటుందా?
శ్రీను వైట్ల: ఆనందం సినిమాతో స్టార్ట్ చేశాం. అది ఎలా స్టార్ట్ అయిందంటే.. అప్పుడు మేం ఉండే ఇంటి ఓనర్ మంచోడే కానీ.. మమల్ని ఇబ్బంది పెట్టేవాడు. ఎక్కువ జనాలు వస్తే పెనాల్టీ వేసేవాడు. నాకు కోపం ఉండేది. ఎప్పుడో అతడిని సెంటర్లో కూర్చోబెట్టాలని అనుకునేవాళ్లం. ఆ ఆలోచన నుంచి ఆ సీన్ చేశాం. అది బాగా వర్కవుట్ అయింది. ఆ సెంటిమెంట్తో అలా స్టార్ట్ అయింది. ఏ మందు సీన్ ఫెయిల్ అవలేదు. ‘వెంకీ’ సినిమాకి వచ్చే సరికి పీక్లోకి వెళ్లింది. ‘దూకుడు’లో అయితే మందు సీన్ లేదు. కచ్చితంగా మందుసీన్ కావాలని మహేశ్ బాబు అడిగారు. నేనేమో ‘బాబు మీరేమో నిజాయితీగల పోలీసు, తండ్రికోసం కష్టపడుతుంటారు ఇలాంటి క్యారెక్టర్తో మందుసీన్ కుదరదు’ అన్నాను. లేదండీ మీరేం చేస్తారో తెలియదు మందుసీన్ పెట్టాలి అని మహేశ్ బాబు అన్నారు. ఆయన ఏం అడగలేదు.. అదొక్కటే అడిగారు. దీంతో మందు స్మెల్ చూస్తే ఎక్కేస్తది అనే కాన్సెప్ట్తో ఆ సీన్ తీశాం.
ఎప్పుడైనా ఆ ఓనర్ ఆ క్యారెక్టర్ నాదిలా ఉందే అని అన్నారా?
శ్రీను వైట్ల: అన్నారు. కానీ, ఇప్పుడు ఆయన లేరు. ఆయనంటే నాకు చాలా ఇష్టం. సేమ్ గెటప్ ఎమ్మెస్ నారాయణ గారికి వేశాం.
బ్రహ్మానందం ప్రతి సినిమాలో హీరో తర్వాత హీరోగా కనిపిస్తారు. ఏ సినిమా నుంచి మీ ఇద్దరి కాంబినేషన్ మొదలైంది.
శ్రీను వైట్ల: మొదటి సినిమా 'ఆనందం'లోనే చేశారు. ఆ తర్వాత వెంకీ నుంచి మొదలైంది. అందులో బాగా వర్కవుట్ అవటం వల్ల 'అందరివాడు'లోనూ చేశారు. 'ఢీ'లో ఆయన గతంలో చేసిన క్యారెక్టర్స్లా కాకుండా కొత్తగా డిజైన్ చేశాం. 'ఢీ'లో చారి, 'దుబాయ్ శీను'లో రామకృష్ణ, 'రెడీ'లో మెక్డొనాల్డ్ మూర్తి, 'కింగ్'లో మ్యూజిక్ డైరెక్టర్ క్యారెక్టర్, 'నమో వెంకటేశ'లో పారిస్ ప్రసాద్, 'దూకుడు'లో పద్మశ్రీ, 'బాద్షా'లో పద్మనాభ సింహ.. అలా కుదిరాయి.
ఓ మూవీలో బ్రహ్మనందంగారు మ్యూజిక్ డైరెక్టర్లా చేశారు కదా.. మ్యూజిక్ డైరెక్టర్లు ఎవరూ హర్ట్ అవలేదా?
శ్రీను వైట్ల: ఒకరిద్దరు అనుకున్నారు. చాలా మంది చక్రి అనుకునేవారు. అసలు ఆయనది ఆ క్యారెక్టర్ కాదు. మంచి వ్యక్తి. నా 'ఢీ' సినిమాకు కూడా చేశారు. అది చక్రిని ఉద్దేశించి చేసింది కాదు. నా మనసులో ఒక మ్యూజిక్ డైరెక్టర్ ఉంటే.. కనెక్ట్ అయింది మరొకరు. నేనొక మ్యూజిక్ డైరెక్టర్ వద్దకు రామజోగయ్యశాస్త్రిని తీసుకెళ్లి పరిచయం చేశా. 'ఒరేయ్ శాస్త్రి' అనేశాడు. అది నచ్చింది. మిగతావి ఆ మ్యూజిక్ డైరెక్టర్లో లేవు. రాము గారి ఓ సినిమాలో ఉంటుందా క్యారెక్టర్ దాన్ని నుంచి డిజైన్ చేశామంతే.
దూకుడు సినిమాలో ఎమ్మెస్ నారాయణ గారు చాలా క్యారెక్టర్లను అనుకరించారు. అది చూసి చాలా మంది హర్ట్ అయ్యారని విన్నాను. నిజమేనా?
శ్రీను వైట్ల: నాకైతే తెలియదు. నేను ఎవరినీ కించపర్చడానికి పెట్టింది కాదు. అవకాశాల కోసం డైరెక్టర్లకు షో రీల్స్ చూపిస్తుంటారు కదా. అలా ఇతనికి బ్లాక్ బాస్టర్ సినిమాల్లోని సీక్వెన్స్లు అయితే బాగుంటుదని చేశాం.
హీరోను ముందే అనుకొని కథ తయారు చేస్తారా? కథ తయారు చేసుకున్న తర్వాత హీరోను అనుకుంటారా?
శ్రీను వైట్ల: ఎక్కువగా హీరో అనుకున్న తర్వాతే కథ ఉంటుంది. ఆనందం వంటి తక్కువ సినిమాలకే కథ అనుకున్న తర్వాత హీరోను ఎంచుకున్నాం.
ఒక పెద్ద డైరెక్టర్ను క్లాప్ బోర్డు విషయంలో ఒకరు కంగారు పెట్టారట ఎవరాయన?