తెలంగాణ

telangana

మార్స్​ యాత్రకు కౌంట్​డౌన్​- రోవర్​ విశేషాలు తెలుసా?

By

Published : Jul 13, 2020, 12:38 PM IST

Updated : Feb 16, 2021, 7:51 PM IST

భూమికి దగ్గరగా ఉన్న గ్రహాల్లో అంగారకుడు ఒకటి. అందుకే ఈ అరుణగ్రహంపై జీవజాతి మనుగడను అన్వేషించేందుకు మానవుడు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాడు. 1964లో తొలిసారి నాసాకు చెందిన మరినెర్​ 4 స్పేస్​క్రాఫ్ట్​ అరుణగ్రహం చిత్రాలను భూమికి పంపింది. అప్పట్నుంచి పలు పరిశోధనలు చేస్తున్న నాసా.. మానవరహిత రోవర్లను అక్కడికి పంపి ఆ గ్రహంపై పరిస్థితులను పరిశీలిస్తోంది. ఈ ప్రయోగాలకు సాంకేతికత జోడిస్తూ.. ఈ నెలలో మార్స్​ మిషన్​కు సిద్ధమౌతోంది. ఆ విశేషాలు తెలుసుకుందాం...

mars perseverance rover
మార్స్​ యాత్రకు కౌంట్​డౌన్​... రోవర్​ గురించి తెలుసా?

పుడమిని దాటి చంద్రుడిపై అడుగుపెట్టిన మానవుడు విశ్వం అంతు తేల్చేందుకు ఒక్కో అడుగు ముందుకేస్తున్నాడు. ఇందులో భాగంగా ఇప్పటికే అంగారక గ్రహంపైకి రోవర్​లను పంపిన శాస్త్రవేత్తలు.. మరో ప్రయోగానికి సన్నద్ధమయ్యారు. అధునాతన సాంకేతిక వ్యవస్థలతో కూడిన 'పెర్​సీవరెన్స్​ రోవర్​'ను సిద్ధం చేశారు. ఇదే ఇప్పటివరకు అరుణ గ్రహంపైకి పంపుతోన్న అతిపెద్ద, అత్యంత అధునాతన వాహనం. ఇది పంపే సమాచారం, విశ్లేషణల ఆధారంగా భవిష్యత్తులో అంగారకునిపై మానవ సహిత యాత్ర చేయాలని నాసా శాస్త్రవేత్తలు భావిస్తున్నారు.

ప్రయోగానికి నాసా సిద్ధం​( credit: NASA)

" మార్స్​ గురించి లోతైన అధ్యయనం చేయాలన్న మా ఆశయాలకు పట్టుదలే కొలమానం. ఎన్నో ఏళ్లుగా శాస్త్రవేత్తలకు అరుణగ్రహం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ఉంది. ఆ ఆసక్తి నుంచి వచ్చిన పలు ప్రశ్నలకు సమాధానాలు రాబట్టేందుకు చాలా దగ్గరగా ఉన్నాం. అక్కడ జీవం గురించి కచ్చితంగా తెలుసుకుంటాం."

- లోరీ గ్లేజ్​, సైన్స్​ డైరెక్టర్​-నాసా

రోవర్​ ప్రయాణం...

ఈ మిషన్​లో భాగస్వామ్యం పొందిన పర్​సీవరెన్స్ రోవర్​ తయారీ చాలా క్లిష్టమైనది. ఇది అక్కడి నేలపై దిగడమే కాకుండా శాస్త్రవేత్తలు నిర్దేశించిన లక్ష్యాలను అందుకోవాల్సి ఉంటుంది. దీన్నీ లాస్‌ఏంజిల్స్‌ సమీపంలోని పాసడేనా 'జెట్‌ ప్రొపల్షన్‌ లేబోరేటరీ'లో తయారు చేశారు. జీవజాతి ఆనవాళ్లతో పాటు గ్రహానికి సంబంధించిన భౌగోళిక, రసాయనిక స్వరూపాన్ని కూడా అధ్యయనం చేసేలా ఇందులో పరికరాలను పొందుపరిచారు. ఇప్పటికే దీనిలోని అన్ని పరికరాలను విజయవంతంగా పరీక్షించారు.

  • జులై 30న మార్స్​ మిషన్​ లాంచ్​ కానుంది. వచ్చే ఏడాది ఫిబ్రవరి 18న అంగారక గ్రహంపై ఉన్న జేజీరో క్రేటర్​ వద్ద ఇది ల్యాండ్​ అవుతుంది. మిషన్​ మొత్తానికి పట్టే రోజులు 687.
  • ఈ రోవర్​ను యునైటెడ్​ లాంచ్​ అలియన్స్​(యూఎల్​ఏ) అట్లాస్​-వీ రాకెట్​లో పెట్టి పంపనున్నారు. ఇప్పటికే సిద్ధమైన దీన్ని ఫ్లోరిడాలోని కేప్​ కనరెవల్​ ఎయిర్​ఫోర్స్​ స్టేషన్​లో ఉంచారు.
  • "నేమ్ ద రోవర్" పోటీ ద్వారా వచ్చిన 28,000 వ్యాసాలను పరిశీలించి, పర్​సీవరెన్స్​(పట్టుదల) అనే పేరును ఎంచుకుంది నాసా. కరోనా వైరస్ మహమ్మారి తెచ్చిన సవాళ్లను అధిగమించి ప్రయోగం విషయంలో ముందడుగు వేసిన సాంకేతిక బృంద స్ఫూర్తి, సంకల్పాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ పేరు పెట్టారు.

ముచ్చటగా మూడోది..?

  1. నాసా పంపిన తొలి రోవర్​ సోజర్నర్​. 1997లోనే ఇది ప్రయోగించాల్సి ఉన్నా కొన్ని కారణాలతో ఆలస్యమైంది. ఫలితంగా 2004లో ఎట్టకేలకు ప్రయోగించగా అరుణ గ్రహంపై దిగిందీ రోవర్​. ఇదే ఈ గ్రహంపై నీటి నిల్వలు ఉండేవని చెప్పింది.
  2. 2012లో మార్స్​పైకి వెళ్లింది క్యూరియాసిటీ రోవర్​. గాలే క్రేటర్​ ప్రాంతంలో దిగింది. కొన్ని లక్షల సంవత్సరాల క్రితం ఇక్కడ జీవరాశి మనుగడ ఉన్నట్లు భావించారు శాస్త్రవేత్తలు. ఇప్పటికీ ఆ విషయాన్ని నిర్ధరించే పనిలో ఉంది క్యూరియాసిటీ.
  3. పర్​సీవరెన్స్ రోవర్​ మరింత ఎక్కువ సమచారం, లోతైన అధ్యయనం కోసం వెళ్తోంది. మార్స్​పైన మనిషి జీవించే అవకాశం ఉందా? అనే ప్రశ్నకు సమాధానం కోసం వెతకనుంది. అక్కడి వాతావరణం, భూగర్భశాస్త్రం గురించి పలు విషయాలు తెలుసుకోనుంది.

రోవర్ వింతలు-​విశేషాలు...

మార్స్​-2020 మిషన్​ రోవర్​
  • చెవులు, చేతులు...

రోవర్‌లో 23 కెమెరాలు, రెండు 'చెవి' లాంటి భాగాలు, ఆరు చక్రాలతో పాటు పలు ఇతర సెన్సార్లు, పరికరాలు అమర్చారు. ఏడు అడుగుల పొడవున్న చేతి లాంటి భాగాలుంటాయి. గ్రహంపై రాళ్లను పగలగొట్టేలా డ్రిల్లర్‌ను కూడా పొందుపరిచారు. సేకరించిన మట్టి నమూనాల్ని గాలి చొరబడకుండా ప్రత్యేక గొట్టాల్లో భద్రపరిచి వాటిని అదే గ్రహంపై వదిలేసేలా రోవర్‌లో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. తిరిగి 2026లో చేపట్టనున్న మరో ప్రయోగంలో వాటిని సేకరించి.. రాకెట్‌ ద్వారా వాటిని అంగారక గ్రహం చుట్టూ ఉన్న కక్ష్యలోకి ప్రవేశపెట్టేలా ప్రణాళికలు రూపొందించామని శాస్త్రవేత్తలు తెలిపారు.

  • జేజీరో సరస్సులో ల్యాండింగ్​...

అంగారక గ్రహంపై ఒకప్పుడు జీవం ఉండడానికి అత్యధిక ఆస్కారం ఉన్న ప్రాంతాన్ని రోవర్‌ దిగేందుకు ఎంపిక చేశారు. 'జేజీరో' అనే ఈ ప్రాంతంలో 400 కోట్ల సంవత్సరాల క్రితం 500 గజాల లోతున్న సరస్సు ఉన్నట్లు భావిస్తున్నారు. ఇది అమెరికాలోని తాహో సరస్సు అంత ఉంటుందట. సంవత్సరాల పాటు జరిగిన సుదీర్ఘ చర్చల అనంతరం ఈ ప్రదేశాన్ని ఎంపిక చేసినట్లు శాస్త్రవేత్తలు వెల్లడించారు. ఈ ప్రాంతం 28 మైళ్ల వెడల్పుతో... ఇసిడిస్​ ప్లానీషియాకు అనే ప్రాంతానికి పశ్చిమంగా ఉంటుంది. ప్రస్తుతం వెళ్తున్న రోవర్ నేలపై దిగకముందే​ 322 కి.మీ నుంచి ఫొటోలు పంపిస్తుంది. మార్స్​ మీద వాతావరణ మార్పులు, కొండలు, పర్వతాలు, భూమితో పోల్చి పరిశీలించనున్నారు.

  • సొంతంగా ఆక్సిజన్‌ తయారీ...

గ్రహంపై వనరుల్ని ఉపయోగించుకొని ఆక్సిజన్‌ తయారుచేసేలా రూపొందించిన మోగ్జి(మార్స్ ఆక్సిజన్ ఇన్-సిటు రిసోర్స్ యుటిలైజేషన్ ఎక్స్‌పెరిమెంట్‌) అనే పరికరాన్ని కూడా ఈ రోవర్లో అమర్చినట్లు నాసా శాస్త్రవేత్తలు తెలిపారు. తొలిసారి చేస్తున్న ఈ ప్రయోగం భవిష్యత్తు మానవసహిత అంతరిక్ష యాత్రలకు ఎంతగానో దోహదం చేయనుంది. ఈ ఆక్సిజన్‌ వ్యోమగాముల శ్వాస, తిరిగి భూమి పైకి చేరుకునేందుకు ఇంధనంలా ఉపయోగపడనుంది.

  • పరికరాలు-సాంకేతికత

మెడా: 'మార్స్‌ ఎన్విరాన్‌మెంటల్‌ డైనమిక్స్‌ అనలైజర్‌' అనేది కొన్ని సెన్సార్ల సమూహం. ఇది గ్రహంపై వాతావరణాన్ని అధ్యయనం చేయనుంది. అలాగే ఏళ్లుగా వాతావరణ పరిస్థితులు ఎలా రూపాంతరం చెందాయో ఇది గుర్తించనుంది. దుమ్ము, రేడియేషన్‌ను అధ్యయనం చేయనుంది.

రిమ్‌ఫ్యాక్స్‌: కేవలం ఉపరితలాన్నే కాకుండా గ్రహం బయటి పొర లోపలికి చొచ్చుకుపోయేలా 'రాడార్‌ ఇమేజర్‌ ఫర్‌ మార్స్‌ సబ్‌సర్ఫేస్‌ ఎక్స్‌పెరిమెంట్‌ (రిమ్‌ఫ్యాక్స్‌)' అనే పరికరాన్ని రూపొందించారు. ఇది మార్స్‌ భూగర్భాన్ని అధ్యయనం చేయడానికి ఉపయోగపడనుంది.

టెర్రెయిన్‌ రిలేటివ్‌ నావిగేషన్‌: తాజా అంతరిక్ష ప్రయోగాల్లో ల్యాండింగ్‌ ఓ పెద్ద అవరోధంగా మారింది. ఈ నేపథ్యంలో రోవర్‌ ల్యాండ్‌ అయ్యే ప్రదేశంలో ఎలాంటి అవాంతరాలు ఉన్నా ముందే గుర్తించి ప్రమాదాన్ని అడ్డుకునేందుకు దోహదం చేయనుంది.

2012లో నాసా పంపిన క్యూరియాసిటీ రోవర్‌ నిర్దేశిత సమయం కంటే ఎక్కువ కాలం పనిచేసింది. ఇప్పటికీ గ్రహంపై అది చక్కర్లు కొడుతోంది. తాజా రోవర్‌ అంగారక గ్రహంపై ఏడాది పాటు మనుగడ సాగించేలా రూపొందించారు. మార్స్​ మిషన్​లో భాగంగా ప్రజల నుంచి రిజిస్ట్రేషన్లు తీసుకున్న నాసా... పేర్లు నమోదు చేసుకున్న 1కోటి 10 లక్షల మంది జాబితాను మూడు సిలికాన్​ చిప్​లలో పెట్టి అక్కడకు పంపిస్తోంది.

Last Updated : Feb 16, 2021, 7:51 PM IST

ABOUT THE AUTHOR

...view details