తెలంగాణ

telangana

ETV Bharat / opinion

Sanitation workers: అమానవీయ వృత్తిలో ఇంకెన్నాళ్లు?

దేశవ్యాప్తంగా అధిక శాతం ఒకే సామాజిక వర్గానికి చెందిన ప్రజలు పారిశుద్ధ్య వృత్తిలో(sanitation workers) మగ్గిపోతున్నారు. సామాజిక అంతరాలు, పేదరికం తదితరాలతో అణగారిన వర్గాల వారు మెరుగైన అవకాశాలను అందిపుచ్చుకోలేకపోతున్నారు. కేంద్ర సామాజిక న్యాయ, సాధికారతా మంత్రిత్వ శాఖ 18 రాష్ట్రాల్లో మూడేళ్ల క్రితం చేపట్టిన ఓ సర్వేలో 42 వేల మందికి పైగా పారిశుద్ధ్య పనుల్లో ఉన్నట్లు గుర్తించారు.

By

Published : Aug 26, 2021, 7:22 AM IST

manholes
పారిశుద్ధ్య కార్మికులు

విషవాయువులకు నెలవులైన మ్యాన్‌హోళ్లలోకి దిగుతున్న పారిశుద్ధ్య కార్మికుల(sanitation workers) వెతలు ఆందోళన కలిగిస్తున్నాయి. దుర్భర పరిస్థితుల్లో పనిచేస్తూ దేశంలో ప్రతి అయిదు రోజులకు ఒక పారిశుద్ధ్య కార్మికుడు మృతి చెందుతున్నట్లు గతంలోనే వెలుగుచూసింది. దాదాపు 90శాతం కార్మికులకు ఆరోగ్య బీమా(Health insurance) లేదు. చాలా మంది కార్మికులకు అసలు ఉద్యోగ భద్రతే లేదు. ఒప్పంద కార్మికులుగా రోజువారీ వేతనాలకు పనిచేస్తున్న వారే అధికంగా ఉన్నారు. పని ప్రదేశాల్లో ప్రమాదాలకు లోనైన సందర్భాల్లో అత్యవసర వైద్యసౌకర్యాలూ అంతగా అందడం లేదు.

తరచుగా..

సెప్టిక్‌ ట్యాంకులను శుభ్రం చేస్తూ ఊపిరి ఆడక చనిపోయిన, మ్యాన్‌హోల్‌లో ఇరుక్కొని ప్రాణాలు కోల్పోయిన కార్మికుల కుటుంబాల పరిస్థితి దయనీయంగా మారుతోంది. దేశవ్యాప్తంగా ఇటువంటి ఘటనలు తరచూ చోటుచేసుకొంటున్నాయి. హైదరాబాద్‌ వనస్థలిపురం పరిధిలో ఇటీవల మ్యాన్‌హోల్‌ను శుభ్రం చేసే క్రమంలో ఇద్దరు దళిత పారిశుద్ధ్య కార్మికులు మరణించారు. హైదరాబాద్‌లో మ్యాన్‌హోళ్లను శుభ్రపరచడానికి అత్యాధునిక రోబోటిక్‌ పరికరాలు అందుబాటులోకి వచ్చాయని అధికార యంత్రాంగం రెండేళ్ల క్రితమే ప్రకటించింది.

శేరిలింగంపల్లి జోన్‌లో అప్పట్లో ఈ పరికరాలను జీహెచ్‌ఎమ్‌సీ అధికారులు వినియోగంలోకి తెచ్చారు. మ్యాన్‌హోల్‌లో 30 అడుగుల లోతు వరకు ఈ పరికరం వెళ్ళి శుభ్రం చేస్తుందని ప్రకటించారు. హైదరాబాద్‌ మహానగరంలో 30 వేలకు పైగా మ్యాన్‌హోల్స్‌ ఉన్నాయి. మనుషుల ప్రమేయం లేకుండానే వాటిని శుభ్రం చేసేందుకు ఈ ఆధునిక పరికరాలు అక్కరకొస్తాయని అధికారులు పేర్కొన్నారు. కానీ, కార్మికుల వినియోగం ఆగలేదు. దేశవ్యాప్తంగానూ ఇదే పరిస్థితి నెలకొంది. దాంతో నిత్యం ఏదో ఒక చోట కార్మికులు ప్రమాదాల బారిన పడుతూనే ఉన్నారు. సఫాయీ కార్మికుల సంరక్షణ, పునరావాసం కోసం 2013లో ప్రత్యేక చట్టం అమలులోకి వచ్చింది. అయినా క్షేత్రస్థాయిలో ఎలాంటి మార్పులు చోటుచేసుకోవడం లేదనడానికి హైదరాబాద్‌లో తాజా దుర్ఘటనే నిదర్శనం!

ఒకే సామాజిక వర్గం వారు..

దేశవ్యాప్తంగా అధిక శాతం ఒకే సామాజిక వర్గానికి చెందిన ప్రజలు పారిశుద్ధ్య వృత్తిలో మగ్గిపోతున్నారు. సామాజిక అంతరాలు, పేదరికం తదితరాలతో అణగారిన వర్గాల వారు మెరుగైన అవకాశాలను అందిపుచ్చుకోలేకపోతున్నారు. కేంద్ర సామాజిక న్యాయ, సాధికారతా మంత్రిత్వ శాఖ 18 రాష్ట్రాల్లో మూడేళ్ల క్రితం చేపట్టిన ఓ సర్వేలో 42 వేల మందికి పైగా పారిశుద్ధ్య పనుల్లో ఉన్నట్లు గుర్తించారు. అయితే, దేశంలోని 718 జిల్లాల్లో కేవలం 178 జిల్లాల్లోనే ఈ పరిశోధన చేపట్టారు. విస్తృత స్థాయిలో సర్వే చేస్తేనే ఈ అమానవీయ వృత్తిలో ఎందరు కునారిల్లుతున్నారో వెలుగులోకి వస్తుంది.

మరోవైపు, దేశవ్యాప్తంగా 12 లక్షల మందికి పైగా ఈ పనిలో కొనసాగుతున్నట్లు సఫాయీ కర్మచారి ఆందోళన్‌(ఎస్‌కేఏ) సంస్థ లోగడ వెల్లడించింది జాతీయ సఫాయి కర్మచారీ కమిషన్‌ లెక్కల ప్రకారం దేశవ్యాప్తంగా మురుగునీటి కాల్వలను శుభ్రం చేస్తూ గడచిన 27 ఏళ్లలో 928 మంది మృతి చెందారు. తమిళనాడులో అత్యధికంగా 201 మంది మృత్యువాత పడ్డారు. తెలుగు రాష్ట్రాల్లో 29 మంది చనిపోయినట్లు అధికారిక గణాంకాలు వెల్లడిస్తున్నాయి. వెలుగులోకి రాని దుర్ఘటనలు ఇంకెన్నో ఉంటాయి. 'గడచిన అయిదేళ్లలోనే దేశవ్యాప్తంగా 472 మరణాలు మా దృష్టికి వచ్చాయి. మ్యాన్‌హోళ్లు, సెప్టిక్‌ట్యాంకులను శుభ్రం చేస్తూ ఈ ఏడాదిలోనే 26 మంది బలయ్యారు' అని ఎస్‌కేఏ నేత బెజవాడ విల్సన్‌ ఇటీవల ఆవేదన వ్యక్తంచేశారు.

కనీస రక్షణ కరవు..

పారిశుద్ధ్య కార్మికులకు ప్రమాదకర పనులను పురమాయిస్తున్న గుత్తేదారులు- కనీస రక్షణ ఉపకరణాలనూ అందించడం లేదు. సఫాయి కర్మచారీ కమిషన్‌ ఆమధ్య విజయవాడ, గుంటూరుల్లో నిర్వహించిన సమీక్షా సమావేశాల్లో కార్మికులకు ఈ పరికరాలపై కనీస అవగాహన లేదని వెల్లడైంది. పారిశుద్ధ్య కార్మికుల్లో చాలా మంది దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నారు. పని ప్రదేశాల్లోని దుర్భర పరిస్థితులతో కార్మికులు మొత్తం 19 రకాల వ్యాధుల బారిన పడుతున్నారని వైద్య నిపుణులు చెబుతున్నారు. వారి సంక్షేమంపై ప్రభుత్వాలు పెద్దగా దృష్టిపెట్టడం లేదని సామాజికవేత్తలు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. పారిశుద్ధ్య కార్మికుల స్థితిగతులపై రెండేళ్ల క్రితం సుప్రీంకోర్టు ఘాటుగా స్పందించింది.

ప్రపంచంలోని ఏ దేశమూ ప్రాణాలను బలితీసుకొనే గ్యాస్‌ ఛాంబర్లలోకి మనుషులను పంపదని ఆవేదన వ్యక్తంచేసింది. కార్మికులకు ఆక్సిజన్‌ సిలిండర్లు, అవసరమైన భద్రతా పరికరాలను ఎందుకు సమకూర్చడం లేదని ప్రశ్నించింది. శాస్త్ర, సాంకేతిక రంగాల్లో ఎంత పురోగతి సాధించినా, పారిశుద్ధ్య పనులకు మనుషులను వినియోగించే దుస్థితి దేశానికే అవమానకరం! ఆయా పనులను యంత్రాలతో చేపడుతూ.. కార్మికులకు నైపుణ్య శిక్షణ ఇచ్చి మెరుగైన జీవనోపాధిని కల్పించాలి. అప్పుడే పారిశుద్ధ్య కార్మికుల వ్యధాభరిత జీవితాల్లో మార్పు వస్తుంది.

- నాదెళ్ల తిరుపతయ్య

ఇదీ చదవండి:నిపుణ శక్తుల సృజన వ్యూహం.. స్థాయీ ప్రమాణాలేవి?

ABOUT THE AUTHOR

...view details