తెలంగాణ

telangana

By

Published : Aug 29, 2020, 10:19 AM IST

ETV Bharat / opinion

కరోనాపై పోరులో ముందు వరస యోధులకు రక్షణేదీ?

దేశంలో కరోనా తీవ్రత ఎక్కువ అవుతూనే ఉంది. అక్టోబరు, నవంబరు వరకు కొవిడ్‌ కేసులు మరింత పెరిగే అవకాశం ఉంటుందని అంచనా. వ్యాక్సిన్‌ సామాన్య జనానికి చేరే వరకు.. అంటే కనీసం ఇంకో పదినెలలు పరిస్థితులు ఇలాగే కొనసాగవచ్చని చెబుతున్నారు. పరీక్షలు పెరిగి, పాజిటివ్‌ కేసులు ఎక్కువవుతున్నా కొద్దీ ఆరోగ్య సిబ్బంది కొరత అధికమవుతోంది. సరైన సదుపాయాలు లేకపోవడంతో వారి ప్రాణాలకూ ముప్పు వాటిల్లుతోంది. దీనిపై దేశవ్యాప్తంగా తరచూ ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.

Is there protection for front line fighters?
కరోనాపై పోరులో ముందు వరస యోధులకు రక్షణేదీ?

ప్రాణాలను కాపాడాల్సినవారే ప్రాణాపాయంలో పడితే ప్రజలకు ఏర్పడే ప్రమాదస్థాయిని ఊహించడం కష్టం. దేశంలో కరోనా తీవ్రత ఎక్కువవుతూనే ఉంది. అక్టోబరు, నవంబరు వరకు కొవిడ్‌ కేసులు పెరుగుతూనే ఉంటాయని అంచనా. వ్యాక్సిన్‌ సామాన్య జనానికి చేరేవరకు.. అంటే కనీసం ఇంకో పదినెలలు పరిస్థితులు ఇలాగే కొనసాగవచ్చని చెబుతున్నారు. పరీక్షలు పెరిగి, పాజిటివ్‌ కేసులు ఎక్కువవుతున్న కొద్దీ ఆరోగ్య సిబ్బంది కొరత అధికమవుతోంది. సరైన సదుపాయాలు లేకపోవడంతో వారి ప్రాణాలకూ ముప్పు వాటిల్లుతోంది. దీనిపై దేశవ్యాప్తంగా తరచూ ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లోనూ డాక్టర్లు తమ ఇబ్బందులను బహిరంగంగా ప్రభుత్వాలకు విన్నవించడం, మౌన ప్రదర్శనలు నిర్వహించడం వంటివి చేస్తున్నారు. ఆరు లక్షల మంది ఆశా వర్కర్లు రెండు రోజుల సమ్మెకు దిగారు. తగిన వేతనాలు, పీపీఈ కిట్లు, ఇతర రక్షణ సామగ్రి కోరుతూ దేశరాజధానిలో ప్రదర్శన చేయడంతో వీరిపై ఎఫ్‌ఐఆర్‌లూ నమోదయ్యాయి.

మోగుతున్న ప్రమాద ఘంటికలు

ఇండియన్‌ మెడికల్‌ అసోసియేషన్‌ లెక్కల ప్రకారం భారత్‌లో కొవిడ్‌వల్ల మరణిస్తున్నవారిలో 0.5శాతం వైద్యులే. బిహార్‌లో పరిస్థితి దారుణంగా ఉంది. అక్కడ డాక్టర్ల మరణాల రేటు తొమ్మిదిరెట్లు ఎక్కువగా (4.75శాతం దాకా) ఉంది. ఆంధ్రప్రదేశ్‌లో ఇది దేశ సగటును మించి 0.7 శాతంగా నమోదైంది. ఆగస్టు మొదటి వారానికి దేశవ్యాప్తంగా 196 మంది వైద్యులు కరోనాకు బలైనట్లు ఐఎంఏ ప్రకటించింది. మూడో వారానికి ఈ సంఖ్య 273కి చేరింది. వీరిలో ఎక్కువమంది జనరల్‌ ప్రాక్టీషనర్లు, యాభైకి పైబడిన వయసు కలిగినవారు ఉన్నారు. మన దేశంలో సుమారు 3.5 లక్షల మంది వైద్యులు కొవిడ్‌ వ్యాధిగ్రస్తులకు సేవలందిస్తున్నారు. ఒకరి మరణం వల్ల వేలమందికి సేవలు నిలిచిపోతాయి. చనిపోయిన వారి కుటుంబాలు రోడ్డున పడతాయి. వైద్యులతోపాటు పారామెడికల్‌, మున్సిపల్‌, రెవిన్యూ, పోలీసు, ఆశా వర్కర్లు ఇంకా ఇతర విభాగాల సిబ్బందీ ప్రమాదం అంచున నిలబడి మహమ్మారిపై పోరాటం చేస్తున్నారు. దేశంలోనే అత్యధికంగా కేసులు నమోదవుతున్న మహారాష్ట్రలో ఇటీవల 12 వేలమందికి పైగా పోలీసులకు కరోనా సోకడం పెద్దయెత్తున ఆందోళనకు కారణమైంది. తెలుగు రాష్ట్రాల్లోనూ పదుల సంఖ్యలో పోలీసులకు కరోనా సోకుతోంది. దిల్లీలోని ఒక్క ఎయిమ్స్‌లో జూన్‌ మొదటి వారానికే 480 మంది సిబ్బందికి వైరస్‌ సోకినట్లు తేలింది. పీపీఈ కిట్లు, నాణ్యమైన మాస్కులు, శానిటైజర్లు వంటి వ్యక్తిగత రక్షణ సామగ్రి అందుబాటులో ఉండటం లేదు. కేంద్ర ఆరోగ్యశాఖ లెక్కల ప్రకారం ఆగస్టు రెండోవారానికి 3.04 కోట్ల మాస్కులు, 1.28 కోట్లకు పైగా పీపీఈ కిట్లు, 10.83 కోట్ల హైడ్రాక్సీ క్లోరోక్విన్‌ మాత్రలు సరఫరా అయ్యాయి. వీటితోపాటు దేశీయంగా తయారైన 22,533 వెంటిలేటర్లనూ రాష్ట్రాలకు కేంద్రం పంపింది. చికిత్సలకు అవసరమైన సదుపాయాలను కల్పించేందుకు, పెంచేందుకు సంపూర్ణంగా సహకరిస్తున్నట్లు కేంద్రం వెల్లడించింది. దేశంలో పీపీఈ కిట్ల తయారీకి దాదాపు 600 సంస్థలను ఎంపిక చేశారు.

భరోసా కల్పించాలి...

ఎవరి లెక్కలు ఎలా ఉన్నా ఆరోగ్య సిబ్బంది ఆందోళనలను, భయాలను వెంటనే తొలగించడం తక్షణ కర్తవ్యం. కొవిడ్‌ పోరాటంలో మరణించిన 196 మంది డాక్టర్లకు కేంద్ర ప్రభుత్వ సాయమేదీ అందలేదని ఐఎంఏ ఆగస్టు మొదటివారంలో ప్రధానికి లేఖ రాసింది. నాలుగో వారానికీ పరిస్థితిలో ఎలాంటి మార్పూ లేదని ఆ సంస్థ జనరల్‌ సెక్రటరీ ఆర్‌.వి.అశోకన్‌ చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఆరోగ్య సిబ్బంది సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందనే భరోసా కల్పించాలి. రక్షణ పరికరాల సరఫరాకు, అందుబాటుకు మధ్య ఉన్న సమన్వయ లోపాలను సరిదిద్దాలి. విధి నిర్వహణలో వైరస్‌ దాడికి గురైనప్పటికీ సంరక్షణకు సకల సదుపాయాలు ఉన్నాయన్న ధీమాను కరోనా యోధులకు కలిగించాలి. వైద్య సిబ్బందికి, వారి కుటుంబాల చికిత్సలకు ప్రత్యేక వార్డులను, ఐసొలేషన్‌ కేంద్రాలను సిద్ధంగా ఉంచాలి. పదిహేను రోజులు పనిచేస్తే, మరో పదిహేను రోజులు క్వారంటైన్‌లో ఉండే సౌకర్యాలు, విశ్రాంతికి తగిన ఏర్పాట్లు ఉండాలి. రోగులకు సేవలందించడంలో దురదృష్టవశాత్తు ప్రమాదానికి గురై మరణాలు సంభవిస్తే అందించే నష్టపరిహారం, ఇతర ప్రయోజనాల గురించి స్పష్టంగా తెలియజేయాలి. కేంద్రం ఇప్పటికే రూ.50లక్షల బీమా సదుపాయాన్ని సెప్టెంబరు వరకు కల్పించింది. దానివల్ల దాదాపు 22 లక్షల మంది హెల్త్‌ వర్కర్లకు లబ్ధి చేకూరుతుందని అంచనా. భారత్‌లో మూడున్నర కోట్లకు పైగా పరీక్షలు జరిగాయి. ఈ దశలో ప్రజల ప్రాణాలను కాపాడాల్సిన ఆరోగ్య సిబ్బంది ప్రమాదంలో పడకుండా చూసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ప్రస్తుత పరిణామాలను చూసి వాళ్లు మానసికంగా భయాందోళనలకు గురికాకుండా జాగ్రత్తవహించాలి. సరిహద్దుల్లోని సైనికులతో సమానంగా పరిగణిస్తున్న ఆరోగ్య వీరులను ఆయుధాలు లేకుండా, సరైన అభయాన్ని అందించకుండా సమరానికి పంపడం ఆపదను కోరి ఆహ్వానించడమే అవుతుందనే వాస్తవాన్ని అందరూ గ్రహించాలి!

- ఎమ్మెస్‌

ఇదీ చూడండి: గడ్డు పరిస్థితుల్లో పరీక్షల నిర్వహణ సాధ్యమేనా?

ABOUT THE AUTHOR

...view details