తెలంగాణ

telangana

ETV Bharat / opinion

కోర సాచిన నేరస్వామ్యం- పార్లమెంటు ప్రతిష్ఠకు భంగం

చట్టసభల ప్రతిష్ఠ నేలమట్టమైతే ప్రజాస్వామ్యమే పెనుసంక్షోభంలో పడుతుందన్న దూరదృష్టితో తప్పు చేసిన ఏ వ్యక్తినైనా తప్పించేందుకు గతంలో పార్టీలన్నీ ఒక్కటై నిలిచేవి. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో ఈ స్ఫూర్తి కొరవడింది. పార్లమెంటు మొదలు అసెంబ్లీలన్నీ నేరచరితులతో నిండిపోతున్నాయి. ప్రభుత్వాలే నేరగాళ్లకు వీరగంధాలు పూస్తున్నాయి.

By

Published : May 13, 2021, 6:59 AM IST

criminal record candidates
నేరగాళ్లు

గణతంత్ర భారతంలో మొట్టమొదటి సార్వత్రిక ఎన్నికల దరిమిలా అత్యున్నత శాసన నిర్మాణ వేదికగా కొలువుతీరిన పార్లమెంటు నేడు డెబ్భయ్యో పడిలోకి అడుగిడుతోంది. 'ప్రజాప్రతినిధులుగా మీ కృషి ప్రజలకు సత్ఫలితాలనిస్తుందని, సమర్థమైన పనితీరుతో ఈ పార్లమెంటు స్ఫూర్తిదాయక ఉదాహరణగా నిలుస్తుందని ఆశిస్తున్నా'నంటూ తొలి రాష్ట్రపతి బాబూ రాజేంద్రప్రసాద్‌ పసిడి పలుకులతో భారత ప్రజాతంత్ర ఏరువాక మొదలైంది. ప్రపంచంలో ఏడోవంతు మానవాళి చరిత్రను నిర్మిస్తున్న ఉత్కృష్ట వ్యవస్థగా పండిత నెహ్రూ సన్నతులందుకొన్న పార్లమెంటులో సచ్ఛీల విలువలు, సంప్రదాయాలు బలంగా పాదుకొనేలా తొలి సభాపతి మవులంకర్‌ విశేషంగా పరిశ్రమించారు. 'దిల్లీలో పార్లమెంటు తన అత్యద్భుత పనితీరుతో ఆకట్టుకొంటోంది.. ఆసియాకు దీన్ని ఓ పాఠశాలగా నెహ్రూ చెప్పుకోవచ్చు'నంటూ 1954లో విఖ్యాత గార్డియన్‌ పత్రిక శ్లాఘించిందంటేనే తెలుస్తుంది- ప్రజా సేవానిరతి నాటి మాన్య సభ్యుల గుండెల్లో నిండు గోదారిలా మారిందన్న సంగతి!

చట్టసభల ప్రతిష్ఠ నేలమట్టమైతే ప్రజాస్వామ్యమే పెనుసంక్షోభంలో పడుతుందన్న దూరదృష్టితో- తప్పు చేసిన వ్యక్తి ఏ రాజకీయ గోత్రీకుడైనా తక్షణం తప్పించడానికి నేతలంతా ఒక్కతాటి పైకి వచ్చిన నాటి ఆదర్శం అపురూపం! పార్లమెంటులో ప్రశ్నలు అడగడానికి రెండువేల రూపాయలు తీసుకొన్న ముద్గల్‌ వ్యవహారాన్ని బయటపెట్టింది నాటి కాంగ్రెస్‌ ఎంపీ ఫిరోజ్‌గాంధీ. ముద్గల్‌ సైతం తమ పార్టీవాడే అయినా తులసి వనంలో గంజాయి మొక్కను పెరికి పారేయాల్సిందేనంటూ 1951 సెప్టెంబరులోనే అతగాణ్ని బహిష్కరించిన నెహ్రూ- పార్లమెంటు ఔన్నత్యంతో రాజీపడేది లేదని చాటారు. నాటి త్యాగధనులు లక్షించిన సచ్ఛీల విలువలు 17 సార్వత్రిక ఎన్నికల దరిమిలా ఏ గంగలో కలిసినట్లు? పార్లమెంటు మొదలు అసెంబ్లీల దాకా నేరచరితులతో లుకలుకలాడుతున్న శాసన నిర్మాణ వ్యవస్థ దేశాన్ని ఏ పాతాళపు లోతులకు దిగజార్చినట్లు?

రాబడి వసూళ్ల కోసమే ఏడాదికోమారు చట్టసభను కొలువుతీర్చే బ్రిటిషర్ల ఆనవాయితీకి చెల్లుకొట్టి, సమావేశాల మధ్య ఆర్నెల్లకు మించి వ్యవధి ఉండరాదన్న నిబంధనను రాజ్యాంగం విధించింది. ప్రజాప్రతినిధుల సభకు ప్రభుత్వాన్ని జవాబుదారీ చేసే ఆ సమున్నతాదర్శానికి అంబేడ్కర్‌ గొడుగు పట్టినా- తీర్మానాల ద్వారా పార్లమెంటు జాతి జనులకిచ్చిన హామీలకే దిక్కులేని దురవస్థ నేడు రాజ్యమేలుతోంది. స్వాతంత్య్ర స్వర్ణోత్సవాల సందర్భంగా పద్నాలుగు సూత్రాల 'అజెండా ఫర్‌ ఇండియా'ను పార్లమెంటు గొప్పగా ఆవిష్కరించినా- అందులో ఏ ఒక్కటీ అమలుకు నోచుకొన్న పాపాన పోలేదు. బాధ్యత జవాబుదారీతనాల నాగరిక జీవన సంస్కృతిగా పరిమళించాల్సిన ప్రజాస్వామ్యం- ఎన్నికల్లో నోట్లు, కుల మత వర్గ ప్రాంత మనోభావాల ఓట్లు, నేరగాళ్లకు సీట్లుగా భ్రష్టుపట్టిందిప్పుడు. ఎలాగైనా గెలవాలనుకొనే పార్టీల దివాలాకోరుతనమే నిచ్చెనగా పద్నాలుగో లోక్‌సభకు నెగ్గుకొచ్చిన నేరచరితులు 24 శాతం, మరుసటి సభలో 30 శాతం, క్రితంసారి 34 శాతం, తాజాసభలో 43 శాతం.

నేరాభియోగాలు ఎన్ని ఉన్నా అమాత్యపదవుల వడ్డనకు అవి అడ్డేమీ కావని మన్మోహన్‌ సర్కారు సుప్రీంకోర్టుకు ప్రమాణ పత్రమే సమర్పించింది. ఐపీసీతోపాటు ఇతర చట్టాల కింద శిక్షకు గురైన ప్రభుత్వోద్యోగుల్ని జీవిత కాలం విధుల నుంచి బహిష్కరిస్తున్నప్పుడు ప్రజాప్రతినిధుల్ని నిర్దిష్ట కాలమే వెలివేయడం రాజ్యాంగంలోని సమానత్వ సూత్రాలకు విరుద్ధమంటూ వ్యాజ్యం దాఖలైంది. నిర్దిష్ట సర్వీసు నిబంధనలకు లోబడి కాకుండా శాసనకర్తలు దేశానికి, ప్రజలకు సేవ చేస్తామన్న ప్రమాణానికి కట్టుబడతారంటూ- మొన్న డిసెంబరులో యథాతథ స్థితికే కేంద్రం ఓటేసింది. ఇలా ప్రభుత్వాలన్నీ నేరగాళ్లకు వీరగంధాలు పూస్తున్నాయి. చేను మేస్తున్న కంచెలకు శక్తివంచన లేకుండా సహకరిస్తూ, పార్లమెంటు ప్రతిష్ఠను పలుచన చేస్తున్నాయి!

ABOUT THE AUTHOR

...view details