తెలంగాణ

telangana

ETV Bharat / opinion

ధర నిర్ణయించే స్వేచ్ఛ రైతుకేదీ?

ఆరుగాలం ఎంతో కష్టించి పండించిన పంటను అమ్ముకోవటం రైతన్నకు ఎంతో కష్టంగా మారింది. సరైన గిట్టుబాటు ధర లేక దళారుల చేతిలో మోసపోతూనే ఉన్నాడు. అయితే ఇటీవలే రైతే తన పంటను తనకు నచ్చిన రేటుకు అమ్ముకునేలా ఆర్డినెన్సును తీసుకువచ్చింది కేంద్ర ప్రభుత్వం. ఈ ఆర్డినెస్సు.. కర్షకుడికి మేలు చేస్తుందో లేదో తెలియదు కానీ.. కార్పొరేట్‌ సంస్థలు, బడా వ్యాపారులకు ఉపకరించేలా ఉంది. ఒకే దేశం ఒకే మార్కెట్​ అంటూ కేంద్రం ప్రవచించిన కొత్త విధానంలో రైతన్నలు లబ్ధి పొందాలంటే దేశంలో వ్యవసాయ పరంగా మరెన్నో మార్పులు రావాల్సిన అవసరం ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

By

Published : Jun 17, 2020, 9:07 AM IST

Agriculture: How do farmers price their crops?
ధర నిర్ణయించే స్వేచ్ఛ రైతుకేదీ?

చిన్న, సన్నకారు రైతులు అధికంగా ఉన్న భారతదేశంలో ఉత్పత్తిని లాభసాటి ధరకు అమ్ముకోవడం అన్నదాతకు నిజంగా ఒక కల. మార్కెట్‌ శక్తుల దోపిడికి గురి కాకుండా మెరుగైన ధరకోసం పంటను జిల్లాలు దాటించి అమ్ముకునే శక్తి నేటి రైతులకు లేదన్నది నిష్ఠుర సత్యం. ఈ తరుణంలో ఉత్పత్తి, నిల్వ, రవాణా, పంపిణీ, సరఫరా వ్యవస్థలను సంస్కరిస్తూ కేంద్రం తీసుకొచ్చిన తాజా ఆర్డినెన్సులతో అన్నదాతల దశ తిరుగుతుందని చెప్పడం వారిని మభ్యపెట్టడమే. కేంద్ర మంత్రిమండలి నిర్ణయాలు కార్పొరేట్‌ సంస్థలు, బడా వ్యాపారులకు ఉపకరించేలా ఉన్నాయే తప్ప రైతుశ్రేయం కాంక్షించేలా లేవు. ఒకే దేశం ఒకే మార్కెట్‌ అంటూ కేంద్రం ప్రవచించిన కొత్త విధానంలో రైతులు లబ్ధి పొందాలంటే దేశంలో వ్యావసాయికంగా మరెన్నో మార్పులు రావాల్సిన అవసరముంది.

వ్యాపారులకే ప్రయోజనం

రైతులు తమ ఉత్పత్తిని దేశంలో ఎక్కడైనా విక్రయించుకునేలా మోదీ ప్రభుత్వం ‘ఒకే దేశం ఒకే మార్కెట్‌’ విధానం తీసుకొచ్చింది. నిత్యావసర వస్తువుల చట్టం సవరణకు మంత్రిమండలి ఆమోదించింది. నిత్యావసర వస్తువుల చట్టం నుంచి ఉల్లి, నూనెలు, పప్పుధాన్యాలు తదితరాలను తొలగించడంవల్ల రైతులకు ఎలాంటి మేలూ జరగబోదని ప్రభుత్వం గుర్తించాలి. నిజానికి దేశంలో అధిక శాతం పేదలకు వీటిని అందించేందుకు గతంలో వీటిని నిత్యావసర వస్తువుల చట్టం పరిధిలోకి తెచ్చారు. ఆహారోత్పత్తుల కృత్రిమ కొరతను సృష్టించకుండా, వ్యాపారులు ధరలను ఇష్టానుసారం పెంచేయకుండా వీటిని నిల్వ చేయడంపై ఆంక్షలు ఉండేవి. అయితే, వ్యవసాయోత్పత్తుల నిల్వకు సంబంధించి రైతులకు ఎలాంటి పరిమితులూ లేవు. ఇప్పుడు కొత్తగా కేంద్రం వీటిపై ఆంక్షలు తొలగించడంవల్ల- నల్లబజారు విక్రేతలు, వ్యాపార వర్గాలు, కార్పొరేట్‌ కంపెనీలు గరిష్ఠంగా లాభపడతాయి. ప్రైవేటు పెట్టుబడిదారుల వ్యాపార వ్యవహారాల్లో ప్రభుత్వ జోక్యం ఉండకపోవచ్చు. దీనివల్ల ధరలు అదుపులో ఉండకపోగా వినియోగదారులు తీవ్ర ఇబ్బందులు పడే ప్రమాదం ఉంది. ఉత్పత్తి, నిల్వ, రవాణా, పంపిణీ, సరఫరాల్లో రైతులకు స్వేచ్ఛ కల్పిస్తే- గ్రామీణ ఆర్థిక వ్యవస్థ కొత్తరూపు సంతరించుకుని ఈ రంగంలో ప్రైవేటు పెట్టుబడులు మరింత పెరుగుతాయని ప్రభుత్వం తెలిపింది. ఈ పరిస్థితిని రైతుల కంటే వ్యాపారులు, పెట్టుబడిదారులు బాగా ఉపయోగించుకుంటారనేది దీన్నిబట్టి స్పష్టమవుతోంది.

రుణాల ఊబిలో...

కేవలం ఎకరా రెండెకరాల భూమి ఉన్న రైతులు దేశంలో సుమారు 85శాతం ఉన్నారు. పండించిన పంటను వీరంతా స్థానికంగానే విక్రయించుకుంటారు. విపణులు వ్యవస్థీకృతం కాకపోవడంతో ఒక్కోసారి పంటను సమీప పట్టణాలకు తరలించి అమ్ముకునే శక్తి సైతం వీరికి ఉండదు. తెచ్చిన అప్పులకు వడ్డీల భారం ఉరుముతుంటే పంటను వెంటనే అమ్ముకోవడం తప్ప వీరికి మరో గత్యంతరం లేదు. సంస్థాగత రుణాలు దేశంలో 29శాతానికీ అందడంలేదు. రైతులు వడ్డీ వ్యాపారులు, మిల్లర్లు, ఎరువుల డీలర్ల నుంచి పంటను తిరిగి వారికే విక్రయించే ప్రాతిపదికన రుణాలు పొందుతారు. పంట రాగానే అప్పులు తీర్చాల్సిన పేద రైతులు దూరప్రాంతాలకు వెళ్లి అమ్ముకోవడం కష్టసాధ్యం. ఒక్కమాటలో- తమ పంటకు ధరను తామే నిర్ణయించుకునే స్వేచ్ఛ వారికి లేదన్నది వాస్తవం. మద్దతు ధరల నిర్ణయంలో కేంద్ర వ్యయాలు, ధరల కమిషన్‌(సీఏసీపీ)కి స్వతంత్ర ప్రతిపత్తి లేదు. వారి సిఫార్సులు ప్రభుత్వాలు పట్టించుకోలేదు. దానివల్ల రైతులు లాభసాటి ధరలు పొందలేకపోతున్నారు.

చట్టబద్ధత కల్పిస్తేనే రైతుకు మేలు...

ద్రవ్యోల్బణం ఎగబాకుతుందన్న భయాలను దృష్టిలో ఉంచుకుని రైతులు పండిస్తున్న పంటలకు వాస్తవ ఖర్చుల ఆధారంగా మద్దతు ధరలు పెంచకుండా దశాబ్దాలుగా ప్రభుత్వాలు రైతుల్ని వంచిస్తున్నాయి. ప్రభుత్వరంగ కొనుగోలు సంస్థలు సైతం మద్దతు ధరలు చెల్లించి పంటను కొంటున్న దాఖలాలు లేవు. కేవలం అయిదుశాతం రైతులకు వంద శాతం వ్యాపారులకు ఉపయోగపడే ఇలాంటి నిర్ణయాలు తీసుకునేటప్పుడు వాస్తవ మార్కెట్‌ స్థితిగతులను అధ్యయనం చేసి ఉంటే బాగుండేది. పంటల విక్రయానికి కంపెనీలతో కుదుర్చుకునే ఒప్పందాలకు చట్టబద్ధత లేని కారణంగానే కాంట్రాక్టు వ్యవసాయం అంటే రైతులు భయపడే పరిస్థితి వస్తోంది. కేవలం విత్తనోత్పత్తి చేసే విషయంలోనే ముందస్తు ఒప్పందాలను ఉల్లంఘించి కొన్ని కంపెనీలు హామీ ఇచ్చిన ధరలను అందించకుండా రైతుల్ని మోసగించిన ఉదంతాలెన్నో మనం చూశాం. చట్టబద్ధత కల్పిస్తే రైతులకు కొంత వరకు మేలు జరుగుతుంది. తాజా ఆర్డినెన్సులతో కార్పొరేట్‌ సంస్థలు, బడా వ్యాపారులకు ఊతమిచ్చేలా కేంద్రం వ్యవహరిస్తోందని రైతు సంఘాలు మండిపడుతున్నాయి. గ్రామాల్లో ఉత్పత్తి దారుల సంఘాలను ఏర్పరచుకోమని చెప్పి వాటికే నేరుగా ఉత్పాదకాలను అందించాలి. ఆహారశుద్ధిని కుటీర పరిశ్రమల స్థాయిలో నిరుద్యోగ యువతతో ఏర్పాటు చేసి వాటిని అనుసంధానిస్తే రైతులే స్వయం పోషకంగా ఎదుగుతారు. స్వయం నిర్ణయాధికారంతో దేశ విదేశీ మార్కెట్లను స్వయంగా అన్వేషించుకోగలుగుతారు. ఉత్పత్తిదారుకు స్థానికంగా మనగలిగే పరిస్థితులు కల్పించడమే ప్రభుత్వం చేయాల్సిన పని.

సంఘటితమైతే లాభాల పంట

ధర నిర్ణయించే స్వేచ్ఛ రైతుకేదీ?

ఓ బడుగు రైతు కార్పొరేట్‌ కంపెనీలతో బేరమాడలేడు. ఆర్ధికంగా నిస్సహాయ పరిస్థితుల్లో ఉండే రైతులకు ఇచ్చిన ధర తీసుకోవడం తప్ప మరో గత్యంతరం లేదు. ఒకవేళ ఉత్పత్తిని దూర ప్రాంతానికి తీసుకువెళ్లినా వ్యాపారుల సిండికేట్‌ మాయాజాలంలో చిక్కుకునే అవకాశాలే ఎక్కువ. దేశంలో వ్యవసాయోత్పత్తుల మద్దతు ధరలకు చట్టబద్దత లేకపోవడంతో మార్కెట్లలో రైతులు వాటిని సాధించుకోలేకపోతున్నారు. ఈ పరిస్థితుల్ని అధిగమించేందుకు తీసుకొచ్చిన ఈ-నామ్‌ మార్కెట్‌ వ్యవస్థ ఆచరణలో విఫలమైంది. పారదర్శకంగా ఎలెక్ట్రానిక్‌ వేలం నిర్వహించే ఈ-నామ్‌ విధానంవల్ల మోసాలకు పాల్పడే అవకాశం ఉండబోదని కేంద్రం ప్రకటించి నాలుగేళ్లు గడిచినా- రైతుకు వీసమెత్తు ప్రయోజనం కలగలేదు. క్షేత్ర స్థాయి పరిస్థితులను అధ్యయనం చేయకుండా తీసుకొచ్చే ఎటువంటి పథకాలూ ఫలితాలనివ్వబోవని ఈ-నామ్‌ రుజువు చేసింది. నాలుగేళ్లుగా వీటి లోపాలను సవరించలేని పాలకులు, తాజా ఆర్డినెన్సులతో అలాంటి పొరపాట్లనే పునరావృతం చేయడం విడ్డూరం. ఉత్పత్తులకు మంచి మార్కెట్లను అన్వేషించాలంటే ఇతర రాష్ట్రాలకు పోనవసరం లేదు. రైతులు పంటలవారీగా ఉత్పత్తిదారుల సంఘాలుగా ఏర్పడితే మంచి ధర పొందేందుకు చక్కటి అవకాశాలున్నాయి.

గిరాకీ సరఫరా పరిస్థితులను సమీక్షిస్తూ ధర నిర్ణయంలో తమ పాత్రను స్పష్టం చేసుకోవచ్చు. రైతులు అసంఘటితంగా ఉన్నంత కాలం మంచి ఫలితాలను ఆశించే పరిస్థితులు లేవు. మార్కెట్‌ నైపుణ్యం, గిరాకీ ఉన్న పంటల ఎంపిక, సూపర్‌బజార్లు, గృహసముదాయాలతో నేరుగా సంబంధాలు నెరపి ఉత్పత్తిని సరఫరా చేసే ఒప్పందాలు అన్నదాతలకు ఎంతో మేలు చేస్తాయి. ఉత్పత్తి వ్యయం పెరుగుతున్న కొద్దీ లాభసాటి సేద్యానికి సావకాశం ఉండదు. దీన్ని తగ్గించుకుంటూ రైతులు ఒక్కరుగా కంటే సమష్టిగా ముందుకు సాగితే లాభాల పంట పండుతుంది. మార్కెట్‌ శక్తుల్ని సైతం సంఘటితంగా ఎదుర్కోగలుగుతారు. రైతు బృందాలిలా మార్కెట్‌ నైపుణ్యాలపై అవగాహన పెంచుకుంటే అవసరాన్ని బట్టి విదేశాలకూ ఎగుమతి చేసే శక్తిని పొందగలుగుతారు. అందుకు తగ్గ చేయూతను ప్రభుత్వాలు అందించాలి.

- అమిర్నేని హరికృష్ణ

ఇదీ చూడండి:డ్రాగన్‌ దొంగ దెబ్బతో 'మంచుకొండల్లో నెత్తుటేర్లు'

ABOUT THE AUTHOR

...view details