స్వాతంత్య్రానంతరం దేశంలో విద్యుత్ రంగం ఎన్నో మార్పులకు లోనైంది. సమృద్ధిగా, నాణ్యమైన విద్యుత్తు అందుబాటులో ఉంటేనే దేశాభివృద్ధి సుసాధ్యమవుతుంది. జాతి మౌలిక రంగాన్ని అంచనా వేయడంలో విద్యుత్తు లభ్యతే కీలకం. అందరికీ నాణ్యమైన విద్యుత్తు చేరువ చేయడం ఒక్క రోజులో సాధ్యమయ్యే పనికాదు. అందుకు నిర్దిష్ట ప్రణాళికతోపాటు అమలులో చిత్తశుద్ధీ ఎంతో ముఖ్యం. పెద్దయెత్తున విద్యుత్తును దేశంలోని అత్యధిక ప్రాంతాలకు, ప్రజలకు అందుబాటులోకి తీసుకురాగలిగినప్పటికీ- విద్యుత్తు రంగంలో ఇంకా చేయాల్సిన సంస్కరణలు మరీ ముఖ్యంగా పంపిణీ రంగంలో తీసుకురావాల్సిన మార్పులు ఎన్నో ఉన్నాయి.
నూతన పరిష్కారాలు
రాష్ట్రాల విద్యుత్తు బోర్డుల నిర్మాణంతోనే దేశంలో సంస్కరణలు మొదలయ్యాయి. స్వతంత్రంగా నిలదొక్కుకొనేందుకు వీటిలో వాణిజ్య దృక్పథాన్ని చొప్పించాల్సి వచ్చింది. క్రమానుగతంగా ప్రభుత్వ రంగంతో పాటు ప్రైవేటునూ ఇందుకు జతపరిచారు. తొలుత ఉత్పత్తి రంగానికి, ఆ తరవాత సరఫరా, అనంతరం పంపిణీ రంగాలకు దీన్ని విస్తరించారు. ప్రస్తుతం ఉత్పత్తి రంగంలో దాదాపు సగభాగం ప్రైవేటు అజమాయిషీలోనే ఉంది. సంస్కరణల్లో భాగంగా విద్యుత్తు నియంత్రణ సంస్థల ఏర్పాటు, ఛార్జీలను ప్రభుత్వం కాకుండా ఈ సంస్థలే నిర్ణయించడం; మొత్తం విద్యుత్తు రంగాన్ని ఉత్పత్తి, సరఫరా, పంపిణీ సంస్థలుగా విభజించి, వేటికవే స్వతంత్రంగా పనిచేసే విధంగా వర్గీకరించడం; విద్యుత్తు చౌర్యాన్ని అరికట్టడం; అధునాతన సాంకేతికతను జోడించి వ్యవస్థలను మెరుగుపరచటం; ఆర్థిక స్వావలంబన దిశగా ఈ సంస్థలను సిద్ధం చేయటం వంటి అనేక చర్యలను ప్రభుత్వాలు చేపట్టాయి. ఇందుకు అవసరమైన చట్టాలను క్రమంగా రూపొందించుకుంటూ వచ్చారు. 1948 చట్టం, 1998 నియంత్రణ కమిషన్ చట్టం, 2003 సమగ్ర విద్యుత్తు చట్టం ఇందులో ముఖ్యమైనవి. అలాగే 2005లో రూపొందించిన జాతీయ విద్యుత్తు విధానం, 2006లో రూపొందించిన టారిఫ్ విధానం, 2015లో ప్రవేశపెట్టిన ఉదయ్ పథకం, 2019లో తీసుకొచ్చిన ‘లెటర్ అఫ్ క్రెడిట్’ విధానం ఇందులో కీలకమైనవి. ఇంత చేసినా కొత్త సమస్యలు వస్తూనే ఉన్నాయి. విద్యుత్తు కొనుగోలు ఒప్పందాల్లో తలెత్తుతున్న సమస్యలు, విద్యుత్తు పునరుత్పాదక విధానం లేకపోవటం, పంపిణీ సంస్థలు ఉత్పాదక సంస్థలకు చెల్లింపులు సకాలంలో చేయకపోవడం, విద్యుత్తు చార్జీల నిర్ణయంలో సమన్యాయం లేకపోవడం, రాష్ట్ర ప్రభుత్వాలు సకాలంలో సబ్సిడీ మొత్తాన్ని పంపిణీ సంస్థలకు చెల్లించకపోవడం, ‘క్రాస్ సబ్సిడీ’లు కొనసాగడం లాంటి అనేక సమస్యలు తలెత్తుతూనే ఉన్నాయి. ఇటీవల ఆంధ్రప్రదేశ్లో విద్యుత్తు కొనుగోలు ఒప్పందాల్ని తిరగదోడటం కేంద్రానికి పెద్ద తలనొప్పిగా మారింది. దానితో ఒక దశలో అంతర్జాతీయ సంస్థలు తమ పెట్టుబడులను పునఃసమీక్షించుకుంటామనీ కేంద్రాన్ని బెదిరించాయి. కొత్త పెట్టుబడులను ఆహ్వానించడంలోనూ ఇబ్బందికర పరిస్థితులు తలెత్తాయి. వీటన్నింటిని దృష్టిలో ఉంచుకొని కేంద్రం 2003నాటి విద్యుత్తు చట్టానికి సవరణలు ప్రతిపాదించింది. ఈ నెల 17న ఈ ముసాయిదా సవరణలను విద్యుత్తు శాఖ ‘వెబ్సైట్’లో ఉంచారు. దీనిపై జూన్ అయిదో తేదీవరకు సలహాలు, సూచనలు స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నట్లూ తెలిపారు. అనంతరం తుది ముసాయిదాను రూపొందించి వచ్చే వర్షకాల పార్లమెంటు సమావేశాల్లో ప్రవేశపెట్టాలని ప్రభుత్వం భావిస్తోంది. విద్యుత్తు ఒప్పందాల అమలు అథారిటీ ఏర్పాటు అన్నది ఇందులో కీలకమైన సంస్కరణ. ఇకనుంచి విద్యుత్తు ఒప్పందాలపై వచ్చే వివాదాలను ఈ అథారిటీయే పరిష్కరిస్తుంది. దానికోసం సివిల్ కోర్టుకి సమాన హోదాలో అప్పిలేట్ ట్రైబ్యునల్ ఏర్పాటు చేస్తారు. అథారిటీ తీర్పు నచ్చనివారు ఈ ట్రైబ్యునల్కు వెళ్ళొచ్చు. దీనివల్ల సమస్యలు సత్వరమే పరిష్కారమవుతాయి. ఇప్పుడున్న అనేక ఎంపిక కమిటీల స్థానే ఒకే ఎంపిక కమిటీ ఉండనుంది. అదే అన్ని అథారిటీలకు సంబంధించిన నియామకాలు చేపడుతుంది. ఆ రకంగా నియామకాల హేతుబద్ధీకరణ జరుగుతుంది. అలాగే ఇంతవరకు ఉన్న జాతీయ విద్యుత్తు విధానానికి అదనంగా జాతీయ పునరుత్పాదక విద్యుత్తు విధానాన్ని ప్రవేశపెట్టేందుకూ ఈ బిల్లు అవకాశం కల్పిస్తోంది.
విస్తృత చర్చ అవసరం