కొవిడ్ మహమ్మారిపై పోరాటంలో 2021 అక్టోబర్ 21వ తేదీ (గురువారం) ఓ మైలురాయి. మన దేశం 100 కోట్ల టీకా డోసుల పంపిణీ పూర్తి చేసిన ఘనతను అద్వితీయంగా చాటింది. టీకా పంపిణీ చేపట్టిన తొమ్మిది నెలల వ్యవధిలోనే ఈ రికార్డును సాధించడం విశేషం. 2020 ప్రారంభ దశలో ఎలాంటి పరిస్థితులు నెలకొన్నాయో గుర్తుచేసుకున్నప్పుడు- కొవిడ్పై పోరాటంలో ఇదొక అద్భుత ప్రస్థానం. వందేళ్ల తరవాత మానవాళి ఈ స్థాయి మహమ్మారిని ఎదుర్కొంది. మనకు ఏ మాత్రం తెలియని, అదృశ్య శత్రువు అంతకంతకు వేగంగా పెరిగిపోతున్న పరిస్థితులు అప్పట్లో ఎంత అనిశ్చితిగా మన ముందు కదలాడాయో గుర్తుంది. ఆందోళనకరమైన వాతావరణం నుంచి భరోసాతో కూడిన పరిస్థితులు నెలకొనడం దాకా సాగిన ప్రయాణంలో ప్రపంచంలోనే అతిపెద్ద టీకా కార్యక్రమం ద్వారా మన దేశం మరింత శక్తిమంతంగా అవతరించింది. సమాజంలోని విభిన్న వర్గాలు తమవంతు తోడ్పాటు అందించిన ఈ కార్యక్రమం నిజంగా భగీరథ యత్నమే.
ఒక్కో వ్యాక్సిన్ వేసేందుకు ఆరోగ్య కార్యకర్తకు రెండు నిమిషాల సమయం పట్టింది. ఈ లెక్కన ప్రస్తుత మైలురాయిని చేరుకొనేందుకు 41 లక్షల మానవ పని దినాలు, సుమారుగా 11 వేల మానవ పని సంవత్సరాల శ్రమ అవసరమైంది. ఏదైనా ఒక కార్యాన్ని సమర్థంగా, వేగంగా పూర్తి చేసేందుకు సంబంధిత భాగస్వామ్య వర్గాలందరి విశ్వాసం కీలకం. రకరకాల భయాందోళనలు, అనుమానాలు రేకెత్తించే యత్నాలెన్నో జరిగినా- టీకాలపై ప్రజలు పెట్టుకొన్న నమ్మకమే ఈ కార్యక్రమం భారీ విజయం సాధించడానికి కారణమైంది. మనలో కొంతమందికి సాధారణ నిత్యావసరాలకు సైతం విదేశీ బ్రాండ్లనే విశ్వసించడం అలవాటు. కొవిడ్-19 టీకా వంటి కీలక విషయంలో మాత్రం భారతీయులు ఏకగ్రీవంగా 'భారత్లో తయారీ' టీకాలకే మొగ్గు చూపారు. ఇదొక గణనీయమైన, వినూత్న మార్పు.
అద్భుత ఫలితం..
జన భాగస్వామ్య స్ఫూర్తితో ఉమ్మడి లక్ష్యం దిశగా ప్రభుత్వం, ప్రజలు ఏకతాటిపై ముందడుగు వేస్తే దేశం ఎంతటి ఘన విజయాన్ని సొంతం చేసుకోగలదో భారత టీకాల కార్యక్రమం నిక్కచ్చిగా రుజువు చేసింది. భారతదేశం టీకాల కార్యక్రమానికి శ్రీకారం చుట్టినప్పుడు మన 130 కోట్ల జనబాహుళ్యం సామర్థ్యాన్ని చాలామంది తక్కువగా అంచనా వేశారు. పౌరులందరికీ టీకా ఇవ్వాలంటే కనీసం మూణ్నాలుగేళ్లు పడుతుందని కొంతమంది అనుమానాలు వ్యక్తం చేశారు. మరికొందరైతే, టీకాలు వేసుకోవడానికి జనం ముందుకు రాబోరని జోస్యం చెప్పారు. ఇంకా కొందరు టీకాల సమర్థ సరఫరా అసాధ్యమని తేల్చిచెప్పారు. కానీ, ప్రజలంతా నమ్మకమైన భాగస్వాములుగా జతకూడితే ఫలితాలు ఎంత అద్భుతంగా ఉంటాయో- జనతా కర్ఫ్యూ, తదనంతర లాక్డౌన్లు వంటివి చాటిచెప్పాయి.
కర్తవ్య నిర్వహణలో ప్రతి ఒక్కరూ తమవంతు బాధ్యతను తలకెత్తుకుంటే అసాధ్యమన్నదే ఉండదు. ఈ క్రమంలో ప్రజలందరికీ టీకాలు అందించేందుకు మన ఆరోగ్య కార్యకర్తలు కొండలెక్కారు, నదులు దాటారు. అత్యంత దుర్లభమైన మారుమూల ప్రదేశాలకు వెళ్ళి మరీ టీకాలు వేశారు. ప్రపంచంలోని అగ్రదేశాల్లో సైతం టీకాలపై సంశయాలు వ్యక్తంకాగా, మన దేశంలో ఆ ప్రభావం చాలా తక్కువగా ఉండటం గమనార్హం. ఈ ఘనతకు కారణం మన యువత, సామాజిక, ఆరోగ్య కార్యకర్తలు, సామాజిక-ఆధ్యాత్మికవేత్తలందరి తోడ్పాటే. టీకాల పంపిణీలో ప్రాధాన్యం కల్పించాలంటూ పలువర్గాల నుంచి తీవ్ర ఒత్తిడి ఎదురైంది. అయినప్పటికీ ఇతర పథకాల్లో అనుసరిస్తున్న పద్ధతి మాదిరిగానే టీకాల పంపిణీలో ప్రముఖులకు పెద్దపీట వేసే సంస్కృతికి తావే లేదని ప్రభుత్వం నిర్ద్వంద్వంగా చాటింది.
సొంతంగా వ్యాక్సిన్..
ప్రపంచవ్యాప్తంగా కొవిడ్ విజృంభించినప్పుడు, మహమ్మారిపై పోరులో టీకాలే కీలక ఆయుధంగా మారతాయని తేటతెల్లమైంది. తదనుగుణంగా మొదటి నుంచే సంసిద్ధత కనబరచాం. 2020 ఏప్రిల్ నుంచే నిపుణుల బృందాలను ఏర్పాటు చేసి, మార్గదర్శక ప్రణాళిక రూపకల్పనకు శ్రీకారం చుట్టాం. నేటికీ ప్రపంచంలోని కొన్ని దేశాలు మాత్రమే సొంతంగా టీకాలు తయారు చేసుకొన్నాయి. 180కిపైగా దేశాలు ఇప్పటికీ పరిమితంగా ఉన్న ఉత్పత్తిదారులపై ఆధారపడ్డాయి. భారతదేశం 100 కోట్ల టీకా డోసుల మైలురాయిని అధిగమించినా- పలు దేశాలు ఇంకా వ్యాక్సిన్ల సరఫరా కోసం ఎదురుచూస్తున్నాయి. భారత్కు సొంత టీకా లేకపోతే పరిస్థితి ఎలా ఉండేదో ఒక్కసారి ఊహించుకోండి!
ఇంతటి భారీ జనాభా కోసం టీకాలు ఎక్కడి నుంచి తెచ్చుకోగలం? అందుకు ఎన్నేళ్లు పట్టేది? పరిస్థితులకు తగినట్లుగా ముందుకొచ్చిన భారతీయ శాస్త్రవేత్తలు, పారిశ్రామికవేత్తలకే ఈ ఘనత చెందుతుంది. వారి ప్రతిభాపాటవాలు, కఠోర శ్రమతోనే మనదేశం టీకాల విషయంలో నిజమైన ‘ఆత్మనిర్భరత’ను సాధించగలిగింది. భారీ డిమాండుకు తగినట్లుగా ఉత్పత్తిని సాధించడం ద్వారా మన టీకా తయారీదారులు తామెవ్వరికీ తీసిపోమని చాటారు.