తెలంగాణ

telangana

ETV Bharat / international

నాసా "చంద్రయాన్​"కు నిధుల కష్టం..!

చంద్రునిపై తిరిగి కాలుమోపేందుకు అమెరికా కొంతకాలంగా గట్టి ప్రయత్నాలు చేస్తోంది. అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ చేస్తున్న ఈ ప్రయోగానికి అర్తెమిస్​ అని పేరుపెట్టారు. 2024లోగా జాబిలిని చేరేందుకు నిర్వహించదలచిన ఈ ప్రయోగాన్ని నిధుల సమస్య వెంటాడుతోంది.

By

Published : May 14, 2019, 11:44 AM IST

నాసా "చంద్రయాన్​"కు నిధుల కష్టం..!

అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ... నాసా చంద్రునిపై మరోమారు కాలుమోపే అత్యంత ప్రతిష్టాత్మక ప్రయోగాన్ని చేపట్టేందుకు సిద్ధమైంది. 2024ను తుదిగడువుగా నిర్దేశించుకుంది. అయితే.. ఇందుకు భారీ మొత్తంలో నిధులు అవసరమవుతాయని లెక్కగట్టింది నాసా.

ఈ ప్రయోగం ద్వారా తొలిసారి మహిళా వ్యోమగామితో చంద్రునిపై అడుగుపెట్టించే ప్రయత్నాలు చేస్తోంది అమెరికా. నిర్దేశించుకున్న లక్ష్యానికి చంద్రుడ్ని చేరాలంటే.. ప్రయోగ నిర్వహణకు స్థలం, అంతరిక్ష నౌకలకోసం అదనంగా 1.6 బిలియన్​ డాలర్లు అవసరమని తెలిపారు నాసా కార్యనిర్వాహకుడు జిమ్​ బ్రిడెన్​స్టయిన్.​ అయితే... మొత్తం ప్రయోగ వ్యయం ఎంత అన్న ప్రశ్నను దాటవేశారు.

'ఇది అదనపు పెట్టుబడి. 2024 నాటికి జాబిలిపై మానవులు కాలుమోపే ఈ ప్రయోగానికి పెట్టుబడి సరిపోయే విధంగా లేదు. ఇదే నేను స్పష్టంగా చెప్పాలనుకుంటున్నా.'

- జిమ్​ బ్రిడెన్​స్టయిన్​, నాసా కార్యనిర్వాహకుడు

నాసా వార్షిక బడ్జెట్​ దాదాపు 21.5 బిలియన్​ డాలర్లు. 2019 ఆర్థిక సంవత్సరంలో ఇప్పటికే 4.5 బిలియన్​ డాలర్లు ఖర్చయ్యాయి. అయితే.. నాసా నిర్దేశిత గడువులోగా లక్ష్యాన్ని సాధించదనే ఆందోళనలో ఉన్నారు అమెరికా చట్టసభ్యులు, నిపుణులు. స్పేస్​ లాంఛ్​ సిస్టమ్​ను అభివృద్ధి చేయడంలో ఆలస్యం చేయడాన్ని ఇందుకు కారణంగా పేర్కొంటున్నారు.

1969లో నాసా అపోలో 11 మిషన్‌ ద్వారా చంద్రునిపై అమెరికా తొలిసారిగా వ్యోమగాములను పంపించింది. గ్రీకు పౌరాణిక దేవత అపోలోకు కవల సోదరి అర్తెమిస్​. కొత్త ప్రయోగానికి అదే పేరు పెట్టారు.

అగ్రరాజ్యం తొందర....

తొలుత 2028 నాటికి చంద్రునిపై చేరుకునేందుకు నాసా ప్రణాళికలు చేసుకుంది. కానీ... ట్రంప్​ ప్రభుత్వం 2024 లోగా ఆ లక్ష్యాన్ని చేరుకోవాలని నిర్దేశించి నాసాపై ఒత్తిడి పెంచింది. ప్రయోగంలో తలమునకలైన నాసా.. ఇందుకోసం బిలియన్​ డాలర్ల నిధులు అవసరమని స్పష్టం చేసింది.

ఇటీవలి కాలంలో అంతరిక్ష రంగంలో పలు దేశాలు గొప్ప ఘనతలు సాధిస్తున్నాయి. తన ఆధిపత్య ధోరణికి గండిపడుతుందన్న భావనతోనే మూన్​ మిషన్​ను తొందరగా చేపట్టాలని అమెరికా ఆలోచిస్తున్నట్లు అభిప్రాయపడుతున్నారు నిపుణులు.

2024 నాటికి చంద్రునిపై వ్యోమగాములను దింపి.. 2030 నాటికి మార్స్‌పైకి మానవ సహిత యాత్ర చేపట్టాలనే ప్రణాళికల్లో నాసా ఉంది.

ఇదీ చూడండి:'పూరం' వేడుకతో జనసంద్రంగా కేరళ త్రిస్సూర్​

ABOUT THE AUTHOR

...view details