తెలంగాణ

telangana

By

Published : Aug 19, 2020, 5:00 AM IST

Updated : Aug 19, 2020, 5:07 AM IST

ETV Bharat / international

సైన్యం తిరుగుబాటు- దేశాధ్యక్షుడు, ప్రధాని నిర్బంధం!

పశ్చిమ ఆఫ్రికాలోని మాలిలో అధ్యక్షుడు, ప్రధాని సహా ప్రభుత్వ నేతలను తిరుగుబాటు సైనికులు నిర్బంధించారు. కొద్ది రోజులుగా దేశంలో నెలకొన్న అస్థిర పరిస్థితులే ఇందుకు కారణంగా తెలుస్తోంది. ఈ విషయంపై స్పందించిన ఐరాస.. దేశ ప్రజలు సంయమనం పాటించాలని కోరింది. తక్షణమే ప్రభుత్వ అధినేతలను విడుదల చేయాలని డిమాండ్ చేసింది.

MALI-MUTINY-PRESIDENT
సైన్యం తిరుగుబాటు

పశ్చిమ ఆఫ్రికా దేశం మాలిలో సైనికులు ప్రభుత్వంపై తిరుగుబాటు చేశారు. దేశాధ్యక్షుడు ఇబ్రహీం బూబకర్​ కీతా, ప్రధాని బూబౌ సిస్సేలను నిర్బంధించారు. సైనికుల దుశ్చర్యను ఆఫ్రికా సమాఖ్య ఛైర్మన్​ మౌస్సా ఫకీ మహమత్​ ఖండించారు.

"అధ్యక్షుడు బూబకర్, ప్రధాని సహా మాలి ప్రభుత్వ నేతల అరెస్టును ఖండిస్తున్నా. తక్షణమే వారిని విడుదల చేయాలని డిమాండ్​ చేస్తున్నా." అని మహమత్ పేర్కొన్నారు.

ఐరాస హామీ..

మాలి పరిణామాలను నిశితంగా పరిశీలిస్తున్నట్లు ఐరాస ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెర్రస్ తెలిపారు. అధ్యక్షుడిని బేషరతుగా తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. దేశ సమగ్రతను కాపాడేందుకు ప్రజాస్వామ్య సంస్థలను మాలి పౌరులు గౌరవించాలని కోరారు. దేశంలో శాంతి, ప్రజాస్వామ్యం నెలకొల్పేందుకు భాగస్వామ్య పక్షాలతో ఐరాస కృషి చేస్తుందని హామీ ఇచ్చారు.

నలుగురి నేతృత్వంలో..

మాలియన్ సైనిక విభాగాలు మంగళవారం తిరుగుబాటు చేస్తున్నట్లు ప్రకటించాయి. దేశంలోని అనేక మంది మంత్రులు, ఉన్నత స్థాయి అధికారులను అరెస్టు చేసినట్లు రష్యా పత్రిక స్పుత్నిక్ వెల్లడించింది. సైనికుల ఆర్థిక సమస్యలకు సంబంధించి తిరుగుబాటు మొదలైనట్లు తెలుస్తోంది. దీనికి నలుగురు సైన్యాధికారులు నేతృత్వం వహిస్తున్నట్లు స్థానిక మీడియా పేర్కొంది.

మాలి రాజధాని బమాకోకు 15 కిలోమీటర్ల దూరంలో ఉన్న సైనిక పట్టణమైన కతిలో సోమవారం అశాంతి రగులుకుంది. అక్కడి ఆయుధాగారం నుంచి ఆయుధాలను తీసుకున్న సైనికులు తొలుత తమ అధికారులను నిర్బంధించారు. ఆ తర్వాత అధ్యక్షుడి నివాస భవనం వద్దకు వెళ్లి దాన్ని చుట్టుముట్టారు. సైనికుల చర్యను ప్రభుత్వ వ్యతిరేక నిరసనకారులు స్వాగతించారు.

వీధుల్లో నిరసనలు..

భద్రత చర్యల పట్ల ప్రభుత్వ నిర్లక్ష్య ధోరణికి వ్యతిరేకంగా కొన్నిరోజులుగా పౌరులు ఆందోళన చేస్తున్నారు. బూబకర్​ రాజీనామా చేయాలంటూ రాజధాని బామాకో వీధుల్లో పౌరులు నిరసనలు చేపడుతున్నారు. వీరికి సంఘీభావంగా అధ్యక్షుడి నివాసంపైపు కాల్పులు జరుపుతూ తిరుగుబాటు సైనికులు వెళ్లినట్లు ప్రత్యక్ష సాక్ష్యులు వెల్లడించారు.

ప్రజల్లో అసంతృప్తి..

ఈ ఏడాది మే నెల నుంచి అధ్యక్షుడు బూబకర్​పై ప్రజల్లో అసంతృప్తి పెరుగుతూ వస్తోంది. పార్లమెంటు ఎన్నికల ఫలితాలను దేశ అత్యున్నత న్యాయస్థానం రద్దు చేయటమే ఇందుకు కారణమని తెలుస్తోంది.

ఇదీ చూడండి:ఇజ్రాయెల్​-యూఏఈ డీల్​తో ఎవరికి లాభం?

Last Updated : Aug 19, 2020, 5:07 AM IST

ABOUT THE AUTHOR

...view details