తెలంగాణ

telangana

ETV Bharat / city

ఫ్లోరోసిస్‌ను మించిన వ్యాధి.. దయనీయ స్థితిలో వందలాది మంది

లేడిలా గంతులేసే పిల్లలు అకస్మాత్తుగా కూలబడి, లేచేందుకు శక్తి లేకుండా మారిపోతే... కిలోమీటర్ల దూరం సైకిల్‌ తొక్కుకుంటూ కాలేజీకి వెళ్లిన యువకుడు తరగతి గదిలోకి వెళ్లడానికి మెట్లెక్కేందుకు కాళ్లు కదలకపోతే... ఆకలి తీర్చుకునేందుకు పళ్లెంలోని అన్నం ముద్దను నోట్లో పెట్టుకునేందుకు చేతులు సహకరించకపోతే... ఇవన్నీ వినడానికి వింతగా ఉన్నాయా? ఇలాంటి దయనీయ స్థితిలో ఉన్నవారు ఉమ్మడి నల్గొండ జిల్లాలో వందల సంఖ్యలో ఉన్నారు. ఒకప్పుడు ఫ్లోరోసిస్‌ సమస్య ఈ ప్రాంతాన్ని పీడించింది. ఇప్పుడు ఈ సమస్య ప్రజల్ని వెంటాడుతోంది.

By

Published : Oct 4, 2020, 1:47 PM IST

Updated : Oct 4, 2020, 9:07 PM IST

large number of people suffering with Muscle atrophy in Nalgonda district
ఫ్లోరోసిస్‌ను మించిన వ్యాధి.. దయనీయ స్థితిలో వందల మంది

ఫ్లోరోసిస్‌ను మించిన వ్యాధి.. దయనీయ స్థితిలో వందలాది మంది

శరీరం కండరాలతో నిర్మితమై ఉంటుంది. ఈ కండరాలు బలిష్ఠంగా తయారైతేనే మనం ఆరోగ్యవంతులుగా ఉంటాం. ఆహారం తింటున్నా కూడా జిల్లాలోని వందల మంది కండలు రోజురోజుకూ కరిగిపోతున్నాయి! మనుషులు ఎముకల గూడులా మారుతున్నారు. శరీరంలో దుర్భలత్వం ఆవహిస్తుంది. అవయవాల కదలికలు నిలిచిపోతున్నాయి. సొంతగా కదలలేకపోతున్నారు. కూర్చోలేకపోతున్నారు. నడవలేకపోతున్నారు. తమ పని తాము చేసుకోలేకపోతున్నారు. జీవచ్ఛవాల్లా మారుతున్నారు. వీరు కదలాలంటే ఒకరు సాయం పట్టాల్సిందే. ఆరోగ్యంగా ఉన్నవాళ్లలో అకస్మాత్తుగా ఇలాంటి స్థితి ఏర్పడడానికి కారణమేమిటని పరిశోధించిన వైద్య నిపుణులు దీన్ని ‘కండరాల క్షీణత వ్యాధి’గా గుర్తించారు. కండర కణ జాలానికి రక్షణగా నిలిచే ప్రోటీన్లు తయారు చేసే జన్యువు వీరిలో లోపిస్తున్నదని తేల్చారు. ఈ వ్యాధి జన్యుపరంగా, అనువంశికంగా వస్తుందని కనిపెట్టారు. నలభై వేల మందిలో ఒకరికి కండరాల క్షీణత వ్యాధి సంక్రమిస్తుందని విశ్లేషించారు.

‘కారుణ్య మరణం’ ప్రసాదించాలని..

కండర క్షీణత వ్యాధి బాధితులు ఇళ్లలోనే నరకాన్ని చూస్తున్నారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో వేల మంది ఎముకలను పెలుసుగా మార్చి, కాళ్లు, చేతులు, దంతాలను క్షయం చేసే ‘ఫ్లోరోసిస్‌’ పీడ ఉండేది. దానికన్నా భయంకరమైనదీ కండర క్షీణత (మస్క్యులర్‌ డిస్ట్రోఫీ) వ్యాధి. యాభయ్యేళ్ల పాటు జిల్లాలోని వేల మంది ఫ్లోరోసిస్‌ వ్యాధితో బాధలు పడ్డారు. శుద్ధి జలాలతో, పోషకాహారంతో ఫ్లోరోసిస్‌ను అధిగమించారు. తమకు ‘కారుణ్య మరణం’ ప్రసాదించాలని నాలుగేళ్ల క్రితం నల్గొండకు చెందిన వ్యాధిగ్రస్తుడు వేణుగోపాల్‌ న్యాయస్థానాన్ని ఆశ్రయించాడంటే వాళ్లు ఎంతటి బాధను అనుభవిస్తున్నారో అర్థమవుతుంది.

ఫ్లోరోసిస్‌ను మించిన వ్యాధి

  • కండరాల క్షీణత వ్యాధిగ్రస్తులది విభిన్నమైన పరిస్థితిగా గుర్తించి ఆసరా పింఛను నెలకు రూ.10వేలు మంజూరు చేయాలి.
  • రోగగ్రస్తులను కుటుంబంలో ఒకరు నిరంతరం కనిపెట్టుకుని ఉండాల్సి ఉన్నందున వారికి ‘కేర్‌టేకర్‌ అలవెన్సు’ కింద నెలకు రూ.15వేలు ఇవ్వాలి.
  • ఆరోగ్య కార్డు ద్వారా కార్పొరేట్‌ స్థాయి వైద్యం అందించాలి.
  • బ్యాటరీతో నడిచే వీల్‌చైర్లు ఇవ్వాలి.
  • కండరాల క్షీణతను అధిగమించేలా ప్రతి రోజూ పోషకాహారం ఇవ్వాలి.
  • కండరాల క్షీణత వ్యాధిగ్రస్తులకు అన్ని ప్రభుత్వ పథకాల్లో 5శాతం రిజర్వేషన్లు కల్పించాలి.
  • రెండు పడక గదుల ఇళ్లు మంజూరు చేయాలి.
  • గర్భస్త పిండానికి జన్యులోపం ఉందేమో కనుక్కునే పరీక్ష నిర్వహించాలి.

బాధితులం.. బాధితుల కోసం సంఘం
కత్తుల బాలకృష్ణకు సపర్యలు చేస్తున్న తల్లి

నేను చౌటుప్పల్‌లో ఇంటర్మీడియట్‌ చదివే రోజుల్లో ఓరోజు నడుస్తూ నడుస్తూ పడిపోయాను. వైద్యులను సంప్రదిస్తే ఔషధాలు ఇచ్చారు. వాటిని వాడినా తగ్గలేదు. డిగ్రీ కళాశాలలో తరగతి గదిలోకి పోవడానికి భవనం మెట్లు ఎక్కలేని పరిస్థితి వచ్చింది. హైదరాబాద్‌లో వైద్య నిపుణులు బయాప్సీ పరీక్ష నిర్వహించారు. కండర క్షీణత వ్యాధి అని నిర్ధరించారు. అప్పటిదాకా నాకా వ్యాధి గురించి తెలియదు. మాది లింగమోనిగూడెంలోని నిరుపేద కుటుంబం. నా తల్లిదండ్రులు అప్పు చేసి రూ.అయిదు లక్షల వరకు వైద్యానికి ఖర్చు చేశారు. ఫలితం శూన్యం. నాన్న కూలికి పోతే అమ్మ నాదగ్గర ఉండి సేవ చేస్తుంది. ఏడాది క్రితం వరకు అమ్మను పట్టుకుని నడిచేవాడ్ని. ఇప్పుడు నడవలేకపోతున్నా. ఇలాంటి బాధితులం ఉమ్మడి నల్గొండ జిల్లాలో 500 మందికి పైగా, తెలంగాణలో 3500 మందికి పైగా ఉన్నాం. మేం ఒకరికొకరం తోడుగా ఉండాలని, ప్రభుత్వానికి, సేవా సంస్థలకు వారధిలా ఉండాలని 2015లో ఏడుగురం బాధితులం కలిసి అసోసియేషన్‌ ఏర్పాటు చేశార. ప్రభుత్వానికి మా సమస్యలను వివిధ సందర్భాల్లో వివరించాం. సహాయాన్ని కోరుతున్నాం. - కత్తుల బాలకృష్ణ, రాష్ట్ర ఉపాధ్యక్షుడు, తెలంగాణ మస్క్యులర్‌ డిస్ట్రోఫీ బాధితుల అసోసియేషన్‌

ఎత్తుకుని తిప్పాల్సిందే
కుమార్తె శృతికి అన్నం తినిపిస్తున్న తల్లి గౌరమ్మ

నా కుమార్తె శృతి. చిన్నతనంలో బాగానే ఉండేది. లేడిపిల్లలా గంతులేసేది. ఏమైందో తెలియదు. అయిదారేళ్ల క్రితం నడుస్తూ నడుస్తూ కింద పడిపోయింది. డాక్టర్లకు చూపిస్తే మందులిస్తున్నారు. తక్కువ కావడం లేదు. బడికి పోవాలంటే కష్టమవుతుంది. చేతులపై ఎత్తుకుని తిప్పాల్సి వస్తుంది. ఇప్పుడు నిలబడలేని పరిస్థితి వచ్చింది. కూలి చేస్తేనే మా కుటుంబం నడుస్తుంది. ఇప్పుడు నా కుమార్తెను చూసుకునేందుకు ఇంటి దగ్గరే ఉండాల్సి వస్తుంది. -గౌరమ్మ, లింగోజీగూడెం

ఈ కుటుంబాన్ని ఎవరు పోషిస్తారు?

ఊదరి లింగస్వామిది లింగోజీగూడెం. సొంత భూమిలేదు. చదువుకుంటే బాగుపడతాడని ఇతని తల్లిదండ్రులు కూలి పని చేస్తూ చౌటుప్పల్‌లోని కళాశాలకు పంపారు. సైకిల్‌ తొక్కుకుంటూ హుషారుగా వచ్చే లింగస్వామి ఓ రోజు కాలేజీ మెట్లెక్కుతూ కింద పడ్డాడు. పైకి లేచి మళ్లీ మెట్లెక్కేందుకు ప్రయత్నిస్తే కాళ్లు కదల్లేదు. తండ్రి హైదరాబాద్‌లోని పెద్ద ఆసుపత్రిలో పరీక్షలు చేయించాడు. కండర క్షీణత వ్యాధి అని దీనికి ఔషధం లేదని తేల్చేశారు. పోషకాహారం తినాలని, వ్యాయామం చేయాలని ఇంటికి తిప్పి పంపారు. తోడుగా ఉంటుందని పన్నెండేళ్ల క్రితం వివాహం చేశారు. వారికి ఇద్దరు పిల్లలు. అయిదేళ్ల క్రితం తండ్రి మరణించాడు. ఇతనికి కండరాలు క్రమక్రమంగా క్షీణిస్తున్నాయి. ఒకరి ఆసరా లేనిదే కదలలేడు. మెదలలేడు. అన్నం తినాలన్నా, నీళ్లు తాగాలన్నా చేతులు నోటిదాకా రావు. భార్య దగ్గరుండి సేవలందిస్తుంది. ఔషధాలు కొనుక్కోవడానికి డబ్బులు లేవని, తమను ఆదుకోవాలని ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు.

ఇవీ చూడండి:'కూతుళ్లకు విలువలు నేర్పితే అత్యాచారాలు ఆగుతాయ్'

Last Updated : Oct 4, 2020, 9:07 PM IST

ABOUT THE AUTHOR

...view details