తెలంగాణ

telangana

By

Published : Oct 13, 2020, 7:14 PM IST

ETV Bharat / city

శీతాఫలాల శుద్ధికేంద్రం... ఆదాయం ఆశాజనకం

దక్షిణాది రాష్ట్రాల్లో ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా శీతాఫలాల ఉత్పత్తికి ప్రసిద్ధి. శీతాఫలాలు సేకరించి, పట్టణాల్లో అమ్మి ఉపాధి పొందేవాళ్లు జిల్లాలో వేలసంఖ్యలో ఉంటారు. ఆదాయం ఉన్నా.. దూరభారం, ఖర్చుతో కూడుకున్నపని. ఈ సీజన్​లోనే నాలుగు డబ్బులు సంపాదించునే అవకాశం ఉంటుంది.

Custard Apple Processing unit in Navabpet Mandal Mahabubnagar District
ఉపాధి కల్పిస్తున్న ఫుడ్​ ప్రాసెసింగ్​ యూనిట్లు.. నవాబుపేటలో సక్సెస్

ఉమ్మడి మహబూబ్​నగర్ జిల్లాలో శీతాఫలాల శుద్ధి కేంద్రాల ఏర్పాటు మంచి ఫలితాలనిస్తోంది. ఇప్పటికే ఉమ్మడి జిల్లాలోని నారాయణపేట, దామరగిద్ద, మద్దూరు లాంటి ప్రాంతాల్లో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు మంచి ఫలితాలు సాధించగా.. తాజాగా డీఆర్​డీఏ ఆధ్వర్యంలో మహబూబ్​నగర్ జిల్లా నవాబుపేటలో శీతాఫలాల ప్రాసెసింగ్ యూనిట్ ఆ దిశగా అడుగులు వేస్తోంది. ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ ఏర్పాటు వల్ల పళ్లు సేకరించే వాళ్లు, కొనుగోలు చేసే మహిళ సంఘాలు, మహిళలకు ఉపాధి, ఆదాయం లభిస్తోంది.

ఉపాధి కల్పిస్తున్న ఫుడ్​ ప్రాసెసింగ్​ యూనిట్లు.. నవాబుపేటలో సక్సెస్

ఖర్చు తగ్గింది.. ఆదాయం పెరిగింది

నవాబుపేట శీతాఫలాల శుద్ధి కేంద్రానికి.. శీతాఫలాలను తీసుకురావడానికి మండల కేంద్రంతో పాటు.. చుట్టుపక్కల ప్రాంతాలైన పోమాల్, కామారం, జంగమాయపల్లి, మరికల్, రేకుల చౌడాపూర్ గ్రామాల్లో కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశారు. గతంలో ఆయా ప్రాంతాల్లోని రైతులు, కూలీలు సీతాఫలాలను సేకరించి మధ్య దళారులకు, లేదంటే పట్టణాలకెళ్లి అమ్ముకునే వాళ్లు. దీనికి ఒక రోజు మొత్తం పట్టేది. దీనికి తోడు.. పట్టణాలకు వెళ్తే రవాణా ఖర్చులు భారమయ్యేవి. ఇప్పుడు ఊళ్లోనే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయడం వల్ల సేకరించిన పళ్లను ఊళ్లోనే అమ్మి మిగతా సమయంలో రోజువారీ పనులు చేసుకుంటున్నారు. రవాణ ఖర్చులు కూడా మిగులుతున్నాయి. కొనుగోలు కేంద్రాల్లో ఏ గ్రేడ్ కాయకు రు.12, బీ గ్రేడ్ కాయకు రూ.10, మామూలు కాయలకు రూ.6 నుంచి రూ8 వరకు చెల్లిస్తున్నారు. మునుపటి కంటే ఎక్కువ ఆదాయాన్ని రావమడే గాక.. శ్రమ, సమయం కూడా తగ్గుతోంది. ఇక ఫలాల్ని సేకరించిన మహిళా సంఘాలకు కిలోకు 50 పైసల వరకూ కమిషన్ చెల్లిస్తున్నారు.

50 మందికి ఉపాధి..

సేకరించిన శీతాకాయల్ని ప్రాసెసింగ్ యూనిట్​కు తీసుకువచ్చి పళ్లుగా మార్చుతారు. పళ్లలోంచి గుజ్జును, గింజల్నివేరు చేస్తారు. ఇందుకోసం మహిళలను నియమించుకున్నారు. తద్వారా ఆ ప్రాంతంలో దాదాపు 50 మంది ఉపాధి పొందుతున్నారు. చేత్తో గుజ్జుని, గింజను వేరు చేస్తే దాన్ని మ్యాన్ మేడ్ పల్పీ అంటారు. దీనికి మార్కెట్లో డిమాండ్, ధర ఎక్కువ. అలా కాకుండా యంత్రాలతో గుజ్జు, గింజల్ని వేరు చేస్తే ఆ గుజ్జుకు డిమాండ్, ధర తక్కువ. కాని నవాబుపేటలో అత్యాధునిక యంత్రాలను వాడటంతో రెండు రకాలుగా వేరు చేసిన గుజ్జుకు దాదాపుగా ఒకే ధర పలుకుతోంది. అలా తీసిన గుజ్జును మైనస్ 40 డిగ్రీల వద్ధ శీతలీకరించి.. ఆ తర్వాత ఫ్రీజర్లలో భద్రపరచుతారు. ఈ ప్రక్రియనంతా పూర్తి చేయడానికి షిఫ్టుకు 15మంది చొప్పున రెండు షిఫ్టుల్లో 30 మంది మహిళలు పనిచేస్తున్నారు. కొద్ది రోజుల్లో మూడో షిఫ్టు సైతం మొదలు కానుంది. ఒక్కొక్కరి రోజుకు రూ.250 వేతనం చెల్లిస్తున్నారు.

లక్ష్యం నెరవేరుతోంది..

శీతలీకరించిన గుజ్జును మండల మహిళా సమాఖ్య ఎఫ్​పీవో ద్వారా ముందుగా ఒప్పందం చేసుకున్న ఐస్​క్రీం కంపెనీకి కిలో గుజ్జుకు రూ.225 చొప్పున విక్రయిస్తున్నారు. సేకరణ, రవాణా, ప్రాసెసింగ్, రోజూవారీ వేతనాలు అన్ని పోను మండల మహిళా సమాఖ్యకు 30 నుంచి 40శాతం వరకు లాభం మిగులుతోంది. అలా వచ్చిన లాభంలోనూ కొంతవాటాను ముందుగా శీతాఫలాలు సేకరించిన రైతులకు బోనస్​గా చెల్లిస్తున్నారు మహిళా సమాఖ్య సభ్యులు. ఇలా రైతులు, మహిళలు, సంఘాలకు ఉపాధి చూపాలన్న ప్రాసెసింగ్ యూనిట్ల ప్రధాన ఉద్దేశం దిగ్విజయంగా అమలవుతోంది.

లాభమే తప్ప.. నష్టం లేదు

ఈ ఏడాది సుమారు 90 టన్నుల శీతాఫలాలు కొనుగోలు చేయాలని, పది టన్నుల గుజ్జును ఉత్పత్తి చేయాలని మహిళా సమాఖ్య భావిస్తోంది. 10టన్నులకు రూ.22 లక్షల ఆదాయం వస్తుండగా.. ఖర్చులన్నీ పోను ఐదారు లక్షలైనా లాభం వచ్చే అవకాశాలున్నాయి. ఇప్పటికే నారాయణపేట, దామరగిద్ద, మద్దూరులో ఏర్పాటు చేసిన యూనిట్లు మంచి ఫలితాలిచ్చాయి. నవాబుపేటలోనూ అలాంటి ఫలితాలే పునరావృతం అవుతాయని అంచనా వేస్తున్నారు. సీతాఫల్ ప్రాసెసింగ్ యూనిట్ అంటే కేవలం రెండు నెలలు మాత్రమే ఉపాధి కల్పించనుంది. అలా కాకుండా యూనిట్​పై ఆధారపడే మహిళలకు ఇతర ప్రాసెసింగ్ యూనిట్లు సైతం ఏర్పాటు చేసి ఏడాది పొడవునా.. ఉపాధి కల్పించేందుకు డీఆర్డీఏ ప్రణాళికలు రచిస్తోంది.

ఇదీ చూడండి:వర్షం సమస్యలపై బల్దియాకు భారీ ఎత్తున ఫిర్యాదులు

ABOUT THE AUTHOR

...view details