తెలంగాణ

telangana

By

Published : Dec 12, 2021, 8:39 AM IST

ETV Bharat / city

Cosmetic Charges : ఒకటి.. రెండు.. మూడు కాదు ఏకంగా 13 సంవత్సరాలు

Cosmetic Charges : గురుకులాలు, వసతి గృహాల్లోని విద్యార్థులకు ఇచ్చే సౌందర్య రుసుం(కాస్మొటిక్‌ ఛార్జీలు)లను పెంచకపోవడంతో వారు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రస్తుతం బాలికలు నెలకు రూ.75, బాలురు రూ.50తో సర్దుకోవాల్సి వస్తోంది. ఆఖరిసారిగా 2008లో ఉమ్మడి ఏపీ ప్రభుత్వం ఛార్జీలను పెంచింది.

Cosmetic Charges
Cosmetic Charges

Cosmetic Charges : ఒకటి..రెండు..మూడు ఏళ్లు కాదు ఏకంగా 13 సంవత్సరాల నుంచి గురుకులాలు, వసతి గృహాల్లోని విద్యార్థులకు ఇచ్చే సౌందర్య రుసుం(కాస్మొటిక్‌ ఛార్జీలు)లను పెంచకపోవడంతో వారు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కాస్మొటిక్‌ ఛార్జీలు పెంచాలంటూ చేసిన ప్రతిపాదనలు నాలుగేళ్లుగా కార్యరూపం దాల్చలేదు. ప్రస్తుతం బాలికలు నెలకు రూ.75, బాలురు రూ.50తో సర్దుకోవాల్సి వస్తోంది. విద్యార్థులు ప్రతిరోజూ స్నానం చేసి, జుట్టుకు నూనె రాసుకుని, తల దువ్వుకుని, ఉతికిన దుస్తులు వేసుకుని పరిశుభ్రంగా పాఠశాలకు రావాలని టీచర్లు సూచిస్తారు. అయితే ప్రభుత్వం అరకొరగా అందిస్తున్న నగదుతో స్నానం సబ్బులు, దుస్తుల సోపులు, టూత్‌ పేస్టు కొనలేని పరిస్థితి ఉంది. ఇక కొబ్బరి నూనె, టాల్కం పౌడరు, షాంపూ, శానిటరీ నాప్కిన్లు (ఆడపిల్లలకు), ప్రతి నెల క్షవరం(బాలురకు) వంటి వాటి ఖర్చులకు డబ్బులు సరిపోవడంలేదు. ఈ నేపథ్యంలో నెలసరి సమయంలో శానిటరీ నాప్కిన్లు కొనలేక బాలికలు ఆ మూడు రోజులు తరగతులకు హాజరుకాలేకపోతున్నారు.

కిట్లు ఇస్తామని చెప్పినా..

Cosmetic Charges in Gurukul :గురుకుల పాఠశాలలు, సంక్షేమ వసతి గృహాలకు విద్యాసంవత్సరం ప్రారంభంలోనే కాస్మొటిక్‌ ఛార్జీలకు బదులుగా కిట్లు అందించాలని గతంలో మంత్రివర్గ ఉపసంఘం నిర్ణయించింది. ఈ ప్రతిపాదనా అమల్లోకి రాలేదు. ప్రస్తుత ధరల మేరకు విద్యార్థినులకు నెలకు కనీసం రూ.350-400, బాలురకు నెలకు రూ.200-240 వరకు కనీస ఖర్చులు ఉంటాయని సంక్షేమ వర్గాలు భావిస్తున్నాయి.

చివరిగా 2008లో..

Gurukul Schools Problems : సౌందర్య ఛార్జీలను చివరగా ఉమ్మడి రాష్ట్రంలో 2008 మార్చిలో పెంచారు. ఓవైపు ధరలు పెరిగినా అప్పటి నుంచి వీటిని సవరించలేదు. నాలుగేళ్ల క్రితం పెరిగిన ధరలకు అనుగుణంగా గురుకులాలు, వసతిగృహాల్లో 5-7 తరగతుల బాలికలకు నెలకు రూ.125, 8-10 తరగతుల విద్యార్థినులకు రూ.200 ఇవ్వాలని, 5-7 తరగతుల బాలురకు నెలకు రూ.100, 8-10 తరగతుల విద్యార్థులకు నెలకు రూ.150 ఇవ్వాలని ఎస్సీ సంక్షేమశాఖ నాలుగేళ్ల క్రితం రెండుసార్లు ప్రతిపాదనలు పంపినా.. నేటికీ ఆమోదం లభించలేదు. కరోనా తరువాత పెరిగిన ధరల నేపథ్యంలో గత ప్రతిపాదిత ఛార్జీలూ పిల్లలకు సరిపోయేలా కనిపించడం లేదు.

ABOUT THE AUTHOR

...view details