తెలంగాణ

telangana

By

Published : Jan 27, 2021, 8:48 AM IST

ETV Bharat / city

బలవంతపు ఏకగ్రీవాలు జరగనివ్వొద్దు: చంద్రబాబు

ఏపీ పంచాయతీ ఎన్నికల్లో తొలిరోజే సాధ్యమైనన్ని ఎక్కువ నామినేషన్లు వేయాలని తెదేపా అధినేత చంద్రబాబు శ్రేణులకు పిలుపునిచ్చారు. పార్టీ నేతలతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించిన ఆయన..అన్ని గ్రామాల్లో ధైర్యంగా, స్వేచ్ఛగా నామినేషన్లు వేసి ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టాలన్నారు. రాజ్యాంగానికి తూట్లు పొడిచే వైకాపాకి బుద్ధిచెప్పాలని శ్రేణులకు దిశానిర్దేశం చేశారు.

AP panchayat elections.
బలవంతపు ఏకగ్రీవాలు జరగనివ్వొద్దు: చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్​లోని గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఎక్కడా బలవంతపు ఏకగ్రీవాలు జరగనివ్వొద్దని, అన్ని గ్రామాల్లోనూ ధైర్యంగా, స్వేచ్ఛగా నామినేషన్లు వేయాలని పార్టీ నేతలకు తెదేపా అధినేత చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. ‘ఏపీ ఎన్నికల సంఘం, న్యాయస్థానాలు చాలా నిక్కచ్చిగా ఉన్నాయి. ఎన్నికల్లో వైకాపా విధ్వంసకాండపై తీవ్ర ఆగ్రహంతో ఉన్నాయి. ఎవరూ అధైర్యపడాల్సిన అవసరం లేదు. వెనుకంజ వేయాల్సిన పరిస్థితి లేదు. వైకాపా విధ్వంసకాండపై వీరోచితంగా పోరాటం చేయాలి. రాజ్యాంగానికి తూట్లు పొడిచి హింసా దౌర్జన్యాలతో ఏకగ్రీవాలు చేయాలని చూస్తే వైకాపాకు బుద్ధి చెప్పాలి’ అని పేర్కొన్నారు.

తొలిరోజే ఎక్కువ నామినేషన్లు వేయాలి..

'నామినేషన్ల స్వీకరణ తొలిరోజే సాధ్యమైనంత ఎక్కువగా నామినేషన్లు వేయాలి. ఏవైనా సాంకేతిక అభ్యంతరాలున్నా తర్వాత వాటిని పరిష్కరించుకోవచ్చు. అభ్యర్థులంతా అవసరమైన ధ్రువీకరణ పత్రాలను సిద్ధం చేసుకోవాలి. ఆన్‌లైన్‌లో నోడ్యూస్‌ సర్టిఫికెట్‌ పొందేలా వీలు కల్పించాలని కోరుతూ ఎన్నికల సంఘానికి వినతి పంపాం. ఎక్కడ ఆటంకాలు ఎదురైనా, వైకాపా నాయకులు ఘర్షణలకు దిగినా ఫొటోలు, వీడియో సాక్ష్యాధారాలు సేకరించాలి. సామాజిక మాధ్యమాలను సద్వినియోగం చేసుకోవాలి. లిఖితపూర్వకంగా ఫిర్యాదుతోపాటు వాటిని ఎన్నికల రిటర్నింగ్‌ అధికారులకు అందించాలి. పార్టీకీ సైతం పంపాలి’ అని సూచించారు.

కంట్రోల్‌ రూం ఏర్పాటు..

'ఎన్నికల్లో ఎదురయ్యే ఇబ్బందులకు సంబంధించిన సమాచారాన్ని అందించేందుకు 24 గంటలూ పనిచేసేలా మంగళగిరిలోని కేంద్ర కార్యాలయంలో కంట్రోల్‌ రూం ఏర్పాటు చేశాం. లీగల్‌ సెల్‌ న్యాయవాదులంతా ఎన్నికలపై పూర్తి సమాచారం ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నారు. అభ్యర్థులంతా వారి సలహాలు, సూచనలను తీసుకోవాలి’ అని సూచించారు.

నామినేషన్‌ సమాచారం ఇవ్వాలి: అచ్చెన్నాయుడు

ప్రతి గ్రామ పంచాయతీలోనూ అసలు అభ్యర్థులతోపాటు డమ్మీ అభ్యర్థులనూ నిలబెట్టాలని తెదేపా ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు సూచించారు. నామినేషన్‌ వేసిన వెంటనే పార్టీ కార్యాలయానికి సమాచారం ఇవ్వాలని తెలిపారు. ఎక్కడైనా ఎన్నికల విధుల్లో అధికారులు నిర్లక్ష్యం చేసినా, సహాయ నిరాకరణ చేసినా వెంటనే ఫిర్యాదు ఇవ్వాలని సూచించారు.

వైకాపాపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత

తొలి దశ పంచాయతీ ఎన్నికలపై పార్టీ ప్రజాప్రతినిధులు, మండల, గ్రామ కమిటీ సభ్యులతో చంద్రబాబు మంగళవారం టెలీకాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ‘జగన్‌రెడ్డి పాలనపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉంది. గ్రామాల్లో అభివృద్ధి పనులన్నీ ఆపేశారు. గత 20 నెలల్లో ఎక్కడా తట్ట మట్టి, బొచ్చె కాంక్రీట్‌ వేయలేదు. అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర అయినా చేసింది శూన్యం. అభివృద్ధి పనులన్నీ నాశనం చేశారు. పేదలపై రూ.70వేల కోట్ల పన్నులు వేశారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలపై దౌర్జన్యాలు, ఆలయాలపై దాడులతో వైకాపా అన్ని వర్గాలకు దూరమైంది. స్వేచ్ఛగా, నిష్పాక్షికంగా ఎన్నికలు జరిగితే ఆ పార్టీకి ఓటమి ఖాయం’ అని స్పష్టం చేశారు. ‘రాష్ట్ర ఎన్నికల సంఘంపై దాడి, ఏపీలో రాజ్యాంగ సంక్షోభంపై దేశవ్యాప్తంగా చర్చ జరిగింది. డీజీపీపై ఏపీ హైకోర్టు చేసిన తాజా వ్యాఖ్యలు, జగన్‌రెడ్డిపై జస్టిస్‌ రాకేశ్‌ కుమార్‌ చేసిన వ్యాఖ్యలు వైకాపా నేతల ఉన్మాద పాలనకు నిదర్శనం. రాష్ట్రంలోని పరిస్థితులపై సుప్రీంకోర్టు సైతం మందలించింది. అయినా వైకాపా నేతలు సిగ్గుపడటం లేదు. తెదేపాపైనే మళ్లీ ఎదురు దాడి చేస్తున్నారు’ అని మండిపడ్డారు.

ఇదీచదవండి:మార్కెట్ల బలోపేతానికి తెలంగాణ సర్కార్ నిర్ణయం..

ABOUT THE AUTHOR

...view details