తెలంగాణ

telangana

ETV Bharat / city

నాటి వైభవం కోల్పోయి రోదిస్తోన్న మూసీ

ప్రాణాలతో పోరాడే మనిషిని బతికించుకునేందుకు.....చివరిక్షణాల దాకా ప్రయత్నాలు చేస్తాం. అది మానవత్వం... చనిపోయిన తర్వాత కూడా వస్తాడేమోనన్న ఆశతో...చివరకు చితి వద్ద కూడా పేరుపెట్టి పిలుస్తాం. ఓ మనిషి జీవితానికే ఇంత ప్రాధాన్యముంటే....తరతరాలకు బతుకునివ్వాల్సిన నది ఇంకెంత ప్రధానం...? భాగ్యనగరానికి వరప్రదాయినిగా ఉన్న మూసీనది ఇప్పుడు కాలుష్యం కాటుకు కొనఊపిరితో కొట్టుమిట్టాడుతోంది. రక్షించండంటూ రోదిస్తోంది.

By

Published : Dec 18, 2019, 5:42 PM IST

musi river contamination with house and industrial pollutants
నాటి వైభవం కోల్పోయి రోదిస్తోన్న మూసీ

నాటి వైభవం కోల్పోయి రోదిస్తోన్న మూసీ

చరిత్రలో అద్భుతమైన నాగరికతలు...విలాసమైన నగరాలు నదీ తీరాల్లోనే పుట్టుకొచ్చాయి. నాటి సింధూ నాగరికత నుంచి నేటి ఆధునిక నాగరికత వరకు....ఎన్నో చారిత్రక నిదర్శనాలు ఇప్పటికీ సజీవంగానే ఉన్నాయి. అంతటి గొప్ప విశిష్టత భాగ్యనగరానికీ ఉంది. నగరంలో ప్రవహించే మూసీ నది.....ఒకప్పుడు నగర ప్రజలకు జీవనవాహినిగా తులతూగింది. కానీ కొన్ని దశాబ్దాల్లోనే...పాలకుల అశ్రద్ధ, ముందుచూపు లేకుండా చేసిన మానవ తప్పిదాల కారణంగా నిర్జీవంగా మారింది. దేశంలోని ఐదు మృతనదుల్లో ఒకటిగా నిలిచింది.

దుఃఖదాయినిగా మారిన వరప్రదాయిని...

ఒకప్పుడు స్వచ్ఛమైన నీరు, అద్భుతమైన మత్స్యసంపద, పరివాహక ప్రాంతాల్లో ప్రకృతి అందాలతో తులతూగిన నది మూసీ. ప్రస్తుతం నాటి వైభవం కోల్పోయి మూగగా రోదిస్తోంది. ఎక్కడెక్కడి నుంచో వచ్చి చేరే వ్యర్థాలతో....భయంకరమైన కాలుష్యాన్ని కడుపున మోస్తోంది. ఆ నీరు, నేల, పీల్చే గాలి..అన్నీ కలుషితమేనని తెలిసినా...ఆ మట్టితో అనుబంధం తెంచుకోలేకఎన్నో జీవితాలు అక్కడే కాల ప్రవాహంతో కలిసి సాగిపోతున్నాయి. ఒకప్పుడు భాగ్యనగర వరప్రదాయిని అయిన మూసీ నది...నేడు ఎందరికో దుఃఖదాయినిగా మారింది.

అభివృద్ధి పేరుతో చేసిన విధ్వంసమిది...

మూసీనదిలో ప్రవహించే నీరు, అటుగా వీచే గాలి, పరిసరాలు, పండే పంటలు, పచ్చటి మొక్కలు...పాతాళం నుంచి ఉబికి వచ్చే నీరు..ఇలా ప్రతిదీ కాలుష్య కాసారమే. అభివృద్ధి పేరుతో మనిషి చేసిన విధ్వంసం తాలూకు దుష్ఫలితాలకు ఇదో ప్రత్యక్ష నిదర్శనం.అంబర్‌పేట మొదలుకొని మూసారాంబాగ్‌ సహా...నగర శివారులోని పీర్జాదిగూడ, పర్వతాపూర్‌, కాచవాని సింగారం, ప్రతాప సింగారం, వెంకటాపూర్‌, ఎదుల్లాబాద్‌, కొర్రెముల, గౌరెల్లి, బాచారం, బండరావిరాల గ్రామాలలో ఈటీవీ భారత్​ పర్యటించింది.

అన్ని వ్యర్థాలు వదిలేది అందులోకే...

వికారాబాద్ జిల్లా అనంతగిరి కొండల్లో పుట్టిన మూసీ నది...వికారాబాద్ పట్టణం, నవాబ్‌పేట, శంకర్‌పల్లి, మొయినాబాద్ మండలాల మీదుగా 44 కిలోమీటర్లు ప్రవహిస్తూ.... హైదరాబాద్, రంగారెడ్డి, నల్గొండ జిల్లాలను తాకుతూ కృష్ణానదిలో కలుస్తుంది. నగరంలోకి ప్రవేశించిన ప్రాంతం నుంచి నల్గొండ పరిధిలోకి చేరే వరకు....57 కిలోమీటర్ల మేర మూసీ నది తీవ్రంగా కలుషితమైంది. ఇళ్ల నుంచి వ్యర్థ జలాలు, పరిశ్రమల నుంచి రసాయనిక వ్యర్థాలు సహా.... అన్నిరకాల వ్యర్థాలు 51 నాలాల ద్వారా మూసీలో కలుస్తున్నాయి.

సబర్మతీ తరహాలో అభివృద్ధి చేస్తాం.. ముఖ్యమంత్రి

భాగ్యనగరానికి మచ్చగా మారిన మూసీని సబర్మతీ నది తరహాలో అభివృద్ధి చేస్తామని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గతంలో ప్రకటించారు. ఈ మేరకు రాష్ట్ర పురపాలక శాఖ..ఆరంభశూరత్వంగా 2017లో మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్‌ను ఏర్పాటు చేసింది. 2017-18, 2018-19 బడ్జెట్‌లలో మూసీ నది ప్రక్షాళన కోసం మొత్తం 754.70 కోట్లు కేటాయించిన ప్రభుత్వం...ఈ రెండేళ్లలో 3 కోట్లు మాత్రమే విడుదల చేసింది. అవి కూడా నిర్వాహణ కోసం ఖర్చుపెట్టేశామని తేల్చేసింది.

ప్రస్తుతం గ్రేటర్‌లో ప్రతిరోజు 1600 ఎంఎల్​డీల ముగురునీరు ఉత్పత్తి అవుతుంటే.... 771 ఎంఎల్​డీల మురుగునీటిని మాత్రమే ఎస్టీపీల్లో శుద్ధి చేస్తున్నారు. నగరంలో ఉత్పత్తి అవుతున్న 90 శాతం మురుగు....నేరుగా మూసీలో కలుస్తోంది. మరో 10 శాతం వివిధ జలవనరుల్లో చేరుతోంది. దీంతో దిగువన చెరువులు, భూగర్భ జలాలు సైతం తీవ్రంగా కలుషితమైపోతున్నాయి.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details