తెలంగాణ

telangana

'వైద్య పరీక్షలు చేయకుండా తాగాడని ఎలా చెబుతారు..?'

High Court on RTC drivers Drunk and Drive: వైద్య పరీక్షలు చేయకుండా మద్యం మత్తును నిర్ధారించడానికి వీల్లేదని ఏపీ హైకోర్టు స్పష్టం చేసింది. మద్యం మత్తులో బస్సును నడుపుతున్నారనే అభియోగంతో ఓ ఆర్టీసీ డ్రైవర్​ను సర్వీసు నుంచి తొలగించడాన్ని తప్పుపడుతూ హైకోర్టు సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పును ధర్మాసనం సమర్థించింది. పూర్వ ప్రయోజనాలు కల్పిస్తూ.. ఆ డ్రైవర్​ను సర్వీసులోకి తీసుకోవాలని ఆర్టీసీ అధికారులను ఆదేశించింది.

By

Published : May 17, 2022, 10:23 AM IST

Published : May 17, 2022, 10:23 AM IST

'వైద్య పరీక్షలు చేయకుండా మద్యంమత్తును నిర్ధారించడానికి వీల్లేదు'
'వైద్య పరీక్షలు చేయకుండా మద్యంమత్తును నిర్ధారించడానికి వీల్లేదు'

మద్యం మత్తులో బస్సును నడుపుతున్నారనే అభియోగంతో, సహచరులు చెప్పిన నోటిమాటల ఆధారంగా ఓ ఆర్టీసీ డ్రైవర్​ను సర్వీసు నుంచి తొలగించడాన్ని తప్పుపడుతూ ఏపీ హైకోర్టు సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పును ధర్మాసనం సమర్థించింది. పూర్వ ప్రయోజనాలను కల్పిస్తూ.. ఆ డ్రైవర్​ను సర్వీసులోకి తీసుకోవాలని హైకోర్టు ఆదేశించింది. కోర్టు తీర్పును 8 వారాల్లో అమలు చేయాలని ఆర్టీసీ అధికారులకు తేల్చి చెప్పింది. వైద్య పరీక్షలు చేయకుండా మద్యం మత్తును నిర్ధారించడానికి వీల్లేదని స్పష్టం చేసింది. సింగిల్ జడ్జి తీర్పును సవాల్​ చేస్తూ.. విశాఖ ఆర్టీసీ డిపో మేనేజర్ 2014లో దాఖలు చేసిన అప్పీలు కొట్టేసింది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్​కుమార్ మిశ్రా, జస్టిస్ ఎం.సత్యనారాయణ మూర్తితో కూడిన ధర్మాసనం ఇటీవల ఈ మేరకు తీర్పు ఇచ్చింది.

2004 జనవరి 3న మద్యం మత్తులో బస్సును నడుపుతున్నాడనే కారణంతో విశాఖపట్నం జిల్లా జ్ఞానాపురానికి చెందిన ఆర్టీసీ డ్రైవర్ సీహెచ్. వెంకటేశ్వరరావును సర్వీసు నుంచి తొలగించారు. ఆ ఉత్తర్వులను ఇండస్ట్రీయల్ ట్రైబ్యునల్ / కార్మిక కోర్టులో డ్రైవర్ సవాల్​ చేశారు. అక్కడ ఎదురుదెబ్బ తగలడంతో హైకోర్టును ఆశ్రయించారు. విచారణ జరిపిన సింగిల్ జడ్జి.. వైద్య పరీక్షల రిపోర్ట్​ లేకుండా సర్వీసు నుంచి తొలగించడాన్ని తప్పుబట్టారు. డ్రైవర్​ను విధుల్లోకి తీసుకోవాలని 2013 సెప్టెంబర్​లో తీర్పు ఇచ్చారు. ఆ తీర్పును సవాల్​ చేస్తూ విశాఖ ఆర్టీసీ డిపో మేనేజర్ 2014లో ధర్మాసనం ముందు అప్పీల్ వేశారు. దానిపై సీజే నేతృత్వంలోని ధర్మాసనం ఇటీవల విచారణ జరిపింది.

బస్సు నడిపే సమయంలో మద్యం ప్రభావితుడై ఉన్నారని సహోద్యోగి ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా డ్రైవర్​పై శాఖాపరమైన విచారణ ప్రారంభించారు. మోటారు వాహనాల చట్టం సెక్షన్ 185 ప్రకారం మద్యం మత్తులో ఉన్నారని చెప్పేందుకు బ్రీత్ అనలైజర్ పరీక్షలో ఆ వ్యక్తి 100 ఎంఎల్ రక్తంలో 30 ఎంజీకి మించి ఆల్కహాల్ కలిగి ఉండాలి.. లేదా డ్రగ్ ప్రభావంతో వాహనంపై తగిన నియంత్రణ కోల్పోయే పరిస్థితిలో ఉండాలి. అప్పుడే మద్యం మత్తులో వాహనం నడుపుతున్నారనే అభియోగాలు వర్తిస్తాయి.

ప్రస్తుత కేసులో పిటిషనర్ రక్తంలో 30 ఎంజీకి మించి ఆల్కహాల్ ఉందని నిరూపించేందుకు ఎలాంటి 'వైద్య సాక్ష్యం' లేదు. ఆయనపై అభియోగాలు నిరూపణ కాలేదు. మత్తు స్థితిలో బస్సును నిర్లక్ష్య ధోరణిలో నడుపుతున్నాడనే విషయాన్ని రుజువు చేసేందుకు తగిన వైద్య సాక్ష్యం అవసరం. అంతేకానీ కొంతమంది ప్రయాణికులు, సహ ఉద్యోగులు చెప్పిన నోటిమాట ద్వారా డ్రైవర్​ను సర్వీసు నుంచి తొలగించడానికి వీల్లేదని డివిజన్ బెంచ్ స్పష్టం చేసింది. సింగిల్ జడ్జి సైతం ఇదే విషయాన్ని స్పష్టం చేశారు. ఆ తీర్పుతో మేము ఏకీభవిస్తున్నామని తెలిపింది. ఆ తీర్పును 8 వారాల్లో అమలు చేయాలని స్పష్టం చేసింది. విశాఖ డిపో మేనేజర్ దాఖలు చేసిన అప్పీల్​ను ధర్మాసనం కొట్టివేసింది.

ఇదీ చదవండి..:

జీవచ్ఛవాలుగా మారిన బిడ్డలు.. ఆపన్నహస్తం కోసం ఎదురుచూపులు

ఇలా నీళ్లు టైంకి తాగితే... బరువు తగ్గొచ్చు..!!

ABOUT THE AUTHOR

...view details