తెలంగాణ

telangana

By

Published : Oct 17, 2020, 9:34 AM IST

ETV Bharat / city

దసరా నుంచి రిజిస్ట్రేషన్లు పున:ప్రారంభించేందుకు ప్రభుత్వం చర్యలు

తెలంగాణ రాష్ట్రంలో రిజిస్ట్రేషన్లు పూర్తవగానే మ్యుటేషన్‌ కూడా చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం రంగం సిద్దం చేస్తోంది. ఇప్పటికే పాస్‌ పుస్తకాల్లో వివరాలు ప్రింట్‌ చేసేందుకు అవసరమైన ప్రింటర్లు సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాలకు, తహసీల్దార్‌ కార్యాలయాలకు చేరాయి. వ్యవసాయ భూములకు సంబంధించి ఆకుపచ్చ రంగు పాస్‌ పుస్తకాలు, వ్యవసాయేతర రిజిస్ట్రేషన్‌లకు చెంది మెరూన్‌ రంగు పాస్‌ పుస్తకాలు ఇవ్వాలని నిర్ణయించిన ప్రభుత్వం త్వరలో వాటిని సంబంధిత కార్యాలయాలకు చేరవేయనుంది.

government-measures-to-re-open-registrations-from-dussehra
దసరా నుంచి రిజిస్ట్రేషన్లు పున:ప్రారంభించేందుకు ప్రభుత్వం చర్యలు

దసరా నుంచి రిజిస్ట్రేషన్‌లు పున:ప్రారంభించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు ముమ్మరం చేసింది. వ్యవసాయ భూములను సర్వేనంబర్లు ఆధారంగా, వ్యవసాయేతర ఆస్తులను డోర్‌ నంబర్ల ఆధారంగా రిజిస్ట్రేషన్‌లు చేయాలని నిర్ణయించిన ప్రభుత్వం వాటి విలువలను నమోదు చేసే కార్యక్రమాన్ని రిజిస్ట్రేషన్‌ శాఖకు అప్పగించింది. ధరణి పోర్టల్‌లో ఆస్తుల విలువల నమోదు ప్రక్రియ గత నెల చివర వారం మొదలైంది. అది దాదాపు పూర్తయ్యిందని రిజిస్ట్రేషన్‌ శాఖ అధికారులు వెల్లడించారు. అక్కడక్కడ వివరాలు అసంపూర్తిగా ఉన్న ఆస్తులకు, వివాదస్పద ఆస్తులకు చెందినవి తప్ప... అన్ని ఆస్తుల విలువలను ధరణి పోర్టల్‌లో నమోదు పూర్తి చేశారు. ఎక్కువ ఆస్తులు కలిగిన హైదరాబాద్‌, రంగారెడ్డి జిల్లాలకు సంబంధించి నమోదు ప్రక్రియ దాదాపు పూర్తైనట్లు రిజిస్ట్రేషన్‌ శాఖ అధికారులు తెలిపారు. గ్రామాల వారీగా విలువలు నమోదు చేయాల్సి రావడం, తప్పులకు అవకాశం లేకుండా చూడాల్సి ఉండడంతో కాస్త ఆలస్యమైందని... తమ వద్ద ముందు నుంచి ఉన్న విలువలను... రెవెన్యూ, పురపాలక, పంచాయతీ శాఖలు ఇచ్చే ఆస్తుల వివరాలను బేరీజు వేసి నమోదు చేసినట్లు తెలిపారు.

ఒకట్రెండు రోజుల్లో పాస్​ పుస్తకాలు

ఇందులో ఆస్తుల విలువల నమోదు ప్రక్రియనే ప్రధానం కావడం... తాజాగా అది ఒక కొలిక్కి రావడం వల్ల తదుపరి కార్యకలాపాలపై ప్రభుత్వం దృష్టిసారించింది. రిజిస్ట్రేషన్లు పునఃప్రారంభమై పూర్తవగానే అందుకు సంబంధించిన మ్యుటేషన్‌ కూడా పూర్తి చేయాల్సి ఉంది. దీంతో ఇందుకు కావాల్సిన ఏర్పాట్లు శరవేగంగా జరుగుతున్నాయి. ఇప్పటికే పాస్‌ పుస్తకాల్లో ఆస్తుల వివరాలు నమోదు చేసేందుకు వీలుగా అవసరమైన ప్రింటర్లు ఆయా సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాలకు, తహసీల్దార్‌ కార్యాలయాలకు చేరాయి. వ్యవసాయ భూములకు ఆకుపచ్చ పాస్‌ పుస్తకాలు, వ్యవసాయేతర ఆస్తులకు మెరూన్‌ రంగు పాస్‌ పుస్తకాలు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకు సంబంధించి ఒకట్రెండు రోజుల్లో పాస్‌ పుస్తకాలు కూడా ఆయా కార్యాలయాలకు చేరనున్నాయని అధికారులు తెలిపారు.

అధికారులకు శిక్షణ

రిజిస్ట్రేషన్లు పున:ప్రారంభానికి ముందు అటు రెవెన్యూ, ఇటు రిజిస్ట్రేషన్ శాఖలకు చెందిన అధికారులకు శిక్షణ ఇవ్వాల్సి ఉంది. ఆ కార్యక్రమం కూడా వచ్చే వారం జరిగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. సబ్ రిజిస్ట్రార్‌లకు పురపాలక, పంచాయతీరాజ్‌ చట్టాలతోపాటు మ్యుటేషన్‌ చేయడంపై శిక్షణ ఇస్తారు. అదే మండల రెవెన్యూ అధికారులకు రిజిస్ట్రేషన్‌, స్టాంపుల చట్టాలపై శిక్షణ ఇవ్వడంతో పాటు అవసరాన్ని బట్టి రిజిస్ట్రేషన్‌ చేసే విధానంపై కూడా క్షేత్రస్థాయి శిక్షణ ఇచ్చే అవకాశం ఉందని రిజిస్ట్రేషన్‌ శాఖ అధికారులు తెలిపారు. అది కూడా ఒకట్రెండు రోజులు ఉండొచ్చని పేర్కొంటున్న అధికారులు... ధరణి పోర్టల్‌ అనుసంధానం చేసే కార్యక్రమం కూడా శరవేగంగా సాగుతున్నట్లు తెలిపారు.

ఇవీ చూడండి: ధరణి పోర్టల్​ ప్రారంభానికి శరవేగంగా ఏర్పాట్లు.. నేడు సీఎస్​ సమీక్ష

ABOUT THE AUTHOR

...view details