రాయలసీమ ఎత్తిపోతల పథకంపై జాతీయ హరిత ట్రైబ్యూనల్ను తప్పుదోవ పట్టించేలా కేంద్ర పర్యావరణ శాఖ డైరెక్టర్ కెరకెట్టా, ఏపీ జల వనరుల శాఖ ప్రత్యేక కార్యదర్శి ఆదిత్యనాథ్ తప్పుడు నివేదికలు ఇచ్చారని... పిటిషనర్ గవినోళ్ల శ్రీనివాస్ ఎన్జీటీకి అఫిడవిట్ సమర్పించారు.
రాయలసీమ ఎత్తిపోతల పథకానికి పర్యావరణ అనుమతులు లేదని కేంద్ర పర్యావరణ శాఖ ఎన్జీటీకి సమర్పించిన నివేదికపై ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు. కేంద్ర పర్యావరణ శాఖ తన అభిప్రాయాన్ని స్వతంత్రంగా వ్యక్తపరచలేదని... తమ అనుమతులు లేకుండా ప్రాజెక్టులపై ముందుకు వెళ్లవద్దని కేంద్ర జలశక్తి శాఖ చేసిన సూచనలను పరిగణలోకి తీసుకోలేదని ఆరోపించారు.
నివేదిక సమర్పించిన పర్యావరణ శాఖ డైరెక్టర్ కెరకెట్టా గతంలోనూ ఇలానే వ్యవహరించారని అఫిడవిట్ లో పేర్కొన్నారు. గతంలో పురుషోత్తపట్నం, పోలవరంలో భాగమేనని... పర్యావరణ అనుమతులు అవసరం లేదని ఎన్జీటీకి నివేదిస్తే... దాన్ని జలశక్తి శాఖ విబేధించిన విషయాన్ని పిటిషనర్ గుర్తు చేశారు. పురుషోత్తపట్నం కొత్త ప్రాజెక్టు అని.. పర్యావరణ అనుమతులు తీసుకోవాలని ఎన్జీటీ ప్రధాన ధర్మాసనం ఇచ్చిన తీర్పును అఫిడవిట్ లో పేర్కొన్నారు.
పురుషోత్తపట్నంతో పోలిస్తే రాయలసీమ ఎత్తిపోతలు పెద్ద పథకమని... ఈ విషయాలపై నోడల్ ఏజెన్సీగా ఉన్న జలశక్తి శాఖ ఆదేశాలను కేంద్ర పర్యావరణ శాఖ పాటించడం లేదన్నారు. ఈ నేపథ్యంలో తమ అభ్యంతరాలను పరిగణలోకి తీసుకుని తదుపరి ఆదేశాలు ఇవ్వాలని ఎన్జీటీని అఫిడవిట్ పిటిషనర్ శ్రీనివాస్ కోరారు.
ఇది చూడండి 'ఇప్పట్లో మా ఇద్దరికి పెళ్లి ఆలోచన లేదు'