'తెలంగాణకు 4 కోట్ల గోనె సంచులిస్తాం' - తెలంగాణలో గోనె సంచుల కొరత
Gunny Bags for Telangana : ధాన్యం కొనుగోలు గొడవ ఓ కొలిక్కి వచ్చింది. ఇక కొనుగోలు కేంద్రాల్లో వసతుల కొరత ఒక్కొక్కటిగా బయటకు వస్తోంది. ఈ తరుణంలో ముఖ్యంగా గోనె సంచుల కొరతపై రైతులు ఆందోళన చెందుతున్నారు. కర్షకుల ఆందోళనకు తెరదించుతూ.. రాష్ట్రానికి నాలుగు కోట్ల గోనె సంచులు ఇచ్చేందుకు కేంద్రం సుముఖత వ్యక్తం చేసినట్లు సమాచారం.

Gunny Bags for Telangana : ధాన్యం కొనుగోలు చేయాలని రాష్ట్ర సర్కారు నిర్ణయించిన నేపథ్యంలో నాలుగు కోట్ల గోనె సంచులు ఇచ్చేందుకు కేంద్రం సుముఖత వ్యక్తంచేసినట్టు సమాచారం. జూట్ కార్పొరేషన్ ద్వారా సేకరించేందుకు అనుమతి ఇచ్చినట్టు తెలిసింది. యాసంగిలో 60 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణకు 15 కోట్ల గోనె సంచులు అవసరమవుతాయని రాష్ట్ర ప్రభుత్వం అంచనా వేసింది. సుమారు 5 కోట్ల వరకు కొత్తవి అవసరమని, వాటిని అందించాలని ఇటీవల కేంద్రానికి రాష్ట్ర పౌరసరఫరాల శాఖ లేఖ రాసింది. ఈ నేపథ్యంలో జూట్ కార్పొరేషన్ ద్వారా నాలుగు కోట్ల నూతన గోనె సంచులు సరఫరా చేసేందుకు కేంద్రం సుముఖత వ్యక్తం చేసినట్లు సమాచారం. మరో 9 కోట్ల పాత గోనె సంచుల కొనుగోలుకు పౌరసరఫరాల శాఖ టెండర్లు ఆహ్వానించింది. ఈ నెల 25న టెండర్లు దాఖలు చేసేందుకు తుది గడువుగా నిర్ణయించింది.
- ఇదీ చదవండి :ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో మౌలిక సదుపాయాల కొరత