తెలంగాణ

telangana

INTER BOARD: ఇంటర్​ బోర్డు మౌనవ్రతం.. తల్లిదండ్రుల్లో అయోమయం..

By

Published : Jul 18, 2021, 6:55 AM IST

ఇంటర్​ ప్రవేశాల గురించి విద్యార్థులతో పాటు వారి తల్లిదండ్రులు అయోమయానికి గురవుతున్నారు. ఇంటర్‌ బోర్డు చెప్పేది ఒకటైతే... ప్రైవేటు, కార్పొరేట్‌ కళాశాలలు చేసేది మరొకటిగా ఉంటోందని... బోర్డు పనితీరు గాడి తప్పిందన్న విమర్శలు కూడా వస్తున్నాయి. ఇంటర్​ బోర్డు అనుబంధ గుర్తింపు ఉన్న కళాశాలల్లోనే చేరాలని గతంలో ఇంటర్​బోర్డు కార్యదర్శి ప్రకటించారు. కాని ఇప్పటివరకు ఇప్పటి వరకు 30 ప్రైవేటు కళాశాలలకు మాత్రమే(మేడ్చల్‌ జిల్లా) అనుబంధ గుర్తింపు ఇచ్చారు. మరి మిగతా కళాశాలలకు అనుమతి ఉన్నట్లా? లేనట్లా? అని విద్యార్థులు, తల్లిదండ్రులు సంశయం వ్యక్తం చేస్తున్నారు.

INTER BOARD: ఇంటర్​ బోర్డు పనితీరుపై సర్వత్రా విమర్శలు
INTER BOARD: ఇంటర్​ బోర్డు పనితీరుపై సర్వత్రా విమర్శలు

ఇంటర్‌ బోర్డు చెప్పేది ఒకటైతే... ప్రైవేటు, కార్పొరేట్‌ కళాశాలలు చేసేది మరొకటిగా ఉంటోంది. బోర్డు పనితీరు గాడి తప్పిందన్న విమర్శలు వస్తున్నాయి. పదవీ విరమణ పొందిన ఇద్దరు అధికారులను ఓఎస్‌డీలుగా పెట్టుకున్నా.. పనులు సకాలంలో పూర్తికావడం లేదు. దాదాపు 9.50 లక్షల మంది విద్యార్థులను ఏటా అయోమయంలో పడేస్తున్నారు. జులై సగం గడిచినా ఇప్పటివరకు అఫిలియేషన్‌ ఇవ్వకపోవడంపై అనుమానాలు తలెత్తుతున్నాయి. అలాగని గుర్తింపు పొందని కళాశాలల ప్రవేశాలను అడ్డుకున్న దాఖలాలూ లేవు. మూడేళ్ల క్రితం ఎల్‌బీనగర్‌లో ఇలాగే బోర్డు అనుమతి లేకున్నా పిల్లల్ని చేర్చుకొని ఫీజులు వసూలు చేసి హాల్‌టికెట్లు రాకపోవడంతో యాజమాన్యం పారిపోయింది. అయినా, బోర్డు మాత్రం అనుమతులపై కచ్చితమైన విధానాన్ని అమలు చేయడం లేదు.

ఆ కళాశాలల్లో చేరితే టెన్షనే..

ఈ సారి రాష్ట్రవ్యాప్తంగా 1,521 కళాశాలలు అనుబంధ గుర్తింపు కోసం దరఖాస్తు చేశాయి. వాటిలో 426 కళాశాలలు వాణిజ్య, గృహ సముదాయాల్లో ఉండటం వల్ల అగ్నిమాపక శాఖ నుంచి మిక్స్‌డ్‌ ఆక్యుపెన్సీ సర్టిఫికెట్‌ తప్పనిసరి. అది లేకుంటే ఇంటర్‌ బోర్డు అనుమతి ఇవ్వదు. మరోవైపు గత ఏడాదితో పోల్చుకుంటే ఈ సారి 161 కళాశాలలు అనుబంధ గుర్తింపు కోసం దరఖాస్తు చేసుకోలేదు. విద్యార్థులకు తెలియక వాటిలో చేరితే.. ఆయా యాజమాన్యాలు మోసం చేసే అవకాశాలూ లేకపోలేదు. ఇన్ని జరుగుతున్నా.. ఇంటర్‌ బోర్డు మాత్రం మిన్నకుండిపోతోందన్న విమర్శలున్నాయి. బోర్డు చెబుతున్న మాటలు కార్యరూపం దాల్చడం లేదు. ఏటా ఏప్రిల్‌/మే నాటికి అనుబంధ గుర్తింపు ప్రక్రియ పూర్తి చేస్తామని రెండేళ్ల క్రితమే ప్రకటించినా.. అది మాటలకే పరిమితమవుతోంది. దీనిపై బోర్డు అకడమిక్‌ విభాగం సంయుక్త కార్యదర్శి జయమణిని వివరణ కోరగా.. శనివారం సాయంత్రం నుంచే ప్రక్రియ ప్రారంభించామని, వచ్చే కొద్ది రోజుల్లో పూర్తి చేస్తామన్నారు.

ఇంటర్‌ బోర్డు అనుబంధ గుర్తింపు ఉన్న కళాశాలల్లోనే ప్రవేశాలు పొందండి. బోర్డు వెబ్‌సైట్లో పొందుపరిచిన కళాశాలల్లోనే చేరండి. -మే 25న ప్రవేశాల కాలపట్టిక జారీ సందర్భంగా బోర్డు కార్యదర్శి జలీల్‌ ప్రకటన.

జులై 5వ తేదీకి ప్రవేశాల గడువు ముగియగా.. 31వ తేదీ వరకు పొడిగించారు. ఇప్పటి వరకు 30 ప్రైవేటు కళాశాలలకు మాత్రమే(మేడ్చల్‌ జిల్లా) అనుబంధ గుర్తింపు ఇచ్చారు. అదీ శనివారం సాయంత్రమే వాటి పేర్లను వెబ్‌సైట్లో పొందుపరిచారు. క్షేత్రస్థాయిలో మాత్రం చాలా ప్రైవేటు కాలేజీలు మూడు, నాలుగు నెలల నుంచే ప్రవేశాలు మొదలుపెట్టాయి. ప్రవేశాలు దాదాపు పూర్తయ్యాయి. కార్పొరేట్‌ కళాశాలల్లో సగానికిపైగా సిలబస్‌ పూర్తయింది. మరి ఆ కళాశాలలకు ఇంటర్‌బోర్డు అనుమతి ఉన్నట్లా? లేనట్లా? - ఇదీ విద్యార్థులు, తల్లిదండ్రుల సంశయం

ఇదీ చదవండి:MEDICAL STUDENTS: నాడి పట్టని భావి వైద్యులు.. ఏడాదిన్నరగా క్లినికల్స్‌, ప్రాక్టికల్స్‌కు దూరం

ABOUT THE AUTHOR

...view details