తెలంగాణ

telangana

By

Published : Feb 13, 2023, 7:27 AM IST

ETV Bharat / business

ప్రభుత్వ బ్యాంకులు భళా.. డిసెంబర్ త్రైమాసికంలో రూ.29వేల కోట్ల లాభం

ప్రభుత్వ రంగ బ్యాంకులు అదరగొట్టాయి. దేశంలోని 12 పీఎస్​బీలు డిసెంబర్ త్రైమాసికంలో రూ.29వేల కోట్లకు పైగా లాభాన్ని గడించాయి. నాలుగు పీఎస్​బీల లాభం గతేడాదితో పోలిస్తే 100 శాతానికి పైగా పెరిగింది.

Profits of public sector banks in December quarter
డిసెంబర్ త్రైమాసికంలో ప్రభుత్వ బ్యాంకుల లాభాలు

దేశంలోని 12 ప్రభుత్వరంగ బ్యాంకు (పీఎస్‌బీ)లన్నీ కలిపి డిసెంబరు త్రైమాసికంలో రూ.29,175 కోట్ల నికరలాభాన్ని ఆర్జించాయి. 2021-22 ఇదే కాలంలో వీటి లాభం రూ.17,729 కోట్లతో పోలిస్తే ఈ మొత్తం 65 శాతం ఎక్కువ. లాభదాయకత ఏడాది క్రితంతో పోలిస్తే 100 శాతానికి పైగా పెరిగిన పీఎస్‌బీలు 4 ఉండటం గమనార్హం.

ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో పీఎస్‌బీల లాభాలు 2021-22 ఇదే కాలంతో పోలిస్తే 9%, రెండో త్రైమాసికంలో 50%, మూడో త్రైమాసికంలో 65% పెరగడం గమనార్హం. అతిపెద్ద బ్యాంక్‌ స్టేట్‌బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా నికరలాభం జూన్‌ త్రైమాసికంలో రూ.6,068 కోట్లుగానే ఉన్నా, సెప్టెంబరు త్రైమాసికంలో రూ.13,265 కోట్లు, డిసెంబరు త్రైమాసికంలో రూ.14,205 కోట్ల మేర రికార్డు స్థాయిలో నమోదు చేయడం గమనార్హం. ఈ ఆర్థిక సంవత్సరం ఏప్రిల్‌-డిసెంబరులో పీఎస్‌బీల నికరలాభాలు రూ.70,166 కోట్లకు చేరాయి. 2021-22 ఇదేకాలం నాటి రూ.48,983 కోట్లతో పోలిస్తే తాజా మొత్తం 43 శాతం అధికం.

డిసెంబరు త్రైమాసికంలో రూ.29,175 కోట్ల నికరలాభం

ఆయిల్‌ ఇండియా లాభం రూ.1746 కోట్లు
ప్రభుత్వరంగ ఆయిల్‌ ఇండియా లిమిటెడ్‌, ఇప్పటివరకు నమోదు చేయనంత అత్యధిక త్రైమాసిక నికరలాభాన్ని అక్టోబరు-డిసెంబరులో ప్రకటించింది. సహజవాయువు, చమురు ధరలు పెరగడంతో, సమీక్షా త్రైమాసికంలో రూ.1746.10 కోట్ల (షేరుకు రూ.16.10 చొప్పున) నికరలాభాన్ని ఆర్జించినట్లు సంస్థ తెలిపింది. 2021-22 ఇదేకాలంలో లాభం రూ.1244.90 కోట్లు (షేరుకు రూ.11.48) మాత్రమే.

ఉత్పత్తి చేసిన బ్యారెల్‌ ముడిచమురుపై 88.33 డాలర్లు (ఏడాది క్రితం 78.59 డాలర్లు) లభించిందని, సహజవాయువు మిలియన్‌ బ్రిటిష్‌ థర్మల్‌ యూనిట్‌కు ఆర్జన 6.10 డాలర్ల నుంచి 8.5 డాలర్లకు పెరిగినట్లు ఆయిల్‌ ఇండియా తెలిపింది. చమురు ఉత్పత్తి 0.75 మిలియన్‌ టన్నుల నుంచి 0.81 మిలియన్‌ టన్నులకు, గ్యాస్‌ ఉత్పత్తి 0.79 బిలియన్‌ క్యూబిక్‌ మీటర్ల నుంచి 0.8 బి.క్యూ.మీ.కు పెరిగింది. సమీక్షా త్రైమాసికంలో మొత్తం టర్నోవర్‌ 27 శాతం అధికమై రూ.5981.63 కోట్లకు చేరింది.

రూ.10 ముఖవిలువ కలిగిన ప్రతి షేరుపై రూ.10 చొప్పున రెండో మధ్యంతర డివిడెండ్‌ చెల్లించాలని బోర్డు నిర్ణయించింది. తొలి మధ్యంతర డివిడెండుగా ఇప్పటికే రూ.4.50 చొప్పున ప్రకటించిన సంగతి విదితమే.

ABOUT THE AUTHOR

...view details