తెలంగాణ

telangana

ETV Bharat / business

చివర వరకు కొనసాగని జోష్...

బడ్జెట్​ ప్రకటన సమయంలో సూచీలు దూసుకెళ్లాయి. అయితే ఆ ఉత్సాహం చివర వరకు కొనసాగలేదు. ద్రవ్యలోటును పణంగా పెట్టి ప్రజాకర్షక మంత్రానికే జైకొట్టడం లాభాల్ని పరిమితం చేసింది.

By

Published : Feb 1, 2019, 5:47 PM IST

స్టాక్​ జోష్​

సార్వత్రిక ఎన్నికల ముందు వినియోగదారులకు పన్ను మినహాయింపు పెంపుతో స్టాక్​ మార్కెట్లు లాభాల బాట పట్టాయి. బాంబే ఎక్స్చేంజి సూచీ-సెన్సెక్స్​ 212 పాయింట్లు(0.59 శాతం) పెరిగి 36,469.43 పాయింట్ల వద్ద ముగిసింది. జాతీయ స్టాక్​ ఎక్స్చేంజి సూచీ-నిఫ్టీ 62.70 పాయింట్లు(0.58 శాతం) ఎగబాకి 10893.65 వద్ద స్థిరపడింది.

ఆదాయపు పన్ను పరిమితిని పెంపుతోపాటు, చిన్న సన్న కారు రైతులకు రూ. 6వేలు అందించనున్నట్లు పీయూష్​ గోయల్​ బడ్జెట్​ ప్రసంగంలో ప్రకటించారు. వీటన్నింటితో కొనుగోలు శక్తి పెరగనున్న దృష్ట్యా మదుపరుల సెంటిమెంటు సానుకూలంగా ప్రభావితమైంది. వాహన, వినియోగ వస్తువుల షేర్లు వృద్ధిలోకి వచ్చాయి.

ఇంట్రాడే తీరిది...

మొదట 550 పాయింట్ల లాభపడ్డ సెన్సెక్స్​ 36,771.14 పాయింట్ల వద్ద గరిష్ఠాన్ని తాకింది. అనంతరం 36,221.32 పాయింట్ల వద్ద కనిష్ఠాన్ని చేరుకుంది. అదే సమయంలో నిఫ్టీ 10,983.45 పాయింట్ల వద్ద అత్యధికాన్ని...10,813 పాయింట్ల వద్ద అత్యల్పాన్ని తాకింది.

వివిధ రంగాల తీరు..

బీఎస్​ఈలోని ఆటో, ఎఫ్​ఎమ్​సీజీ, స్థిరాస్తి సూచీలు 2.62 శాతం వరకు లాభపడ్డాయి.

సెన్సెక్స్​లో హీరో మోటోకార్ప్​, మారుతీ, హెచ్​సీఎల్​ టెక్​, ఏషియన్​ పెయింట్స్​, బజాజ్​ ఆటో, బజాజ్​ ఫినాన్స్​, హెచ్​డీఎఫ్​సీ, రిలయన్స్​, హెచ్​యూఎల్​, భారతీ ఎయిర్​టెల్​, పవర్​ గ్రిడ్ అత్యధికంగా 7.48 శాతం వరకు లాభపడ్డాయి.

వేదాంత అత్యధికంగా 17.82 శాతం నష్టపోయింది. గురువారం నాడు విడుదల చేసిన త్రైమాసిక ఫలితాల్లో 25.54 శాతం తగ్గుదలతో మదుపరులు అమ్మకాలకు దిగారు.

బ్యాంకింగ్​ రంగం అత్యధికంగా నష్టాల్లో ఉంది. యస్​ బ్యాంకు, ఎస్​బీఐ, ఐసీఐసీఐ బ్యాంకు, యాక్సిస్​ బ్యాంకుల షేర్లు 4.68 శాతం వరకు పడిపోయాయి.

ఇతర మార్కెట్ల తీరిది...

ఆసియా మార్కెట్లు మిశ్రమంగా ఉన్నాయి. షాంఘై కాంపోజిట్​ సూచీ 1.30 శాతం, జపాన్​ నిక్కీ 0.07 శాతం లాభపడ్డాయి. హాంకాంగ్​కు చెందిన హ్యాంగ్​సెంగ్​ సూచీ 0.04 శాతం, కొరియాకు చెందిన కొస్పి సూచీ 0.06 శాతం నష్టపోయాయి.

జర్మనీకి చెందిన ఫ్రాంక్​ఫర్ట్​ డీఏఎక్స్​ సూచీ 0.20 శాతం, ప్యారిస్​ సీఏసీ సూచీ 0.14 శాతం, లండన్​ ఎఫ్​టీఎస్​ఈ 0.37 శాతం వృద్ధిలో కొనసాగుతున్నాయి.

రూపాయి, ముడిచమురు...

అమెరికా డాలరుతో పోల్చితే రూపాయి 24 పైసలు పడిపోయింది. ప్రస్తుతం మారక విలువ 71.32గా ఉంది. అంతర్జాతీయ ముడిచమురు ప్రామాణికం -బ్రెంట్​ సూచీ స్వల్పంగా పడిపోయింది. బ్యారెల్​ ముడిచమురు ధర 60.53 డాలర్లుగా ఉంది.

ABOUT THE AUTHOR

...view details