తెలంగాణ

telangana

ETV Bharat / business

నమో 2.0: 'ఆశల పద్దు'పై ముమ్మర కసరత్తు

2019-20 ఆర్థిక సంవత్సరానికి పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టేందుకు కేంద్ర ఆర్థిక శాఖ కసరత్తు ముమ్మరం చేసింది. ఈ నెల 11 నుంచి 23 వరకు ఆర్థికవేత్తలు, పరిశ్రమ వర్గాలతో విత్తమంత్రి నిర్మలా సీతారామన్​ భేటీ కానున్నారు.

By

Published : Jun 9, 2019, 2:10 PM IST

నమో 2.0: 'ఆశల పద్దు'పై ముమ్మర కసరత్తు

ఎన్డీఏ ప్రభుత్వం రెండోసారి అధికారం చేపట్టాక దేశ చరిత్రలోనే తొలిసారి పూర్తిస్థాయి మహిళా ఆర్థిక మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు నిర్మలా సీతారామన్​. పార్లమెంట్​ సమావేశాల్లో భాగంగా వచ్చే నెల 5 న 2019-20 ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్​ ప్రవేశపెట్టనున్నారు. ఇందుకోసం బడ్జెట్​ ముందస్తు సంప్రదింపులను ముమ్మరం చేసింది ఆర్థిక శాఖ.

ఈ నెల 11 నుంచి 23 వరకు ఆర్థికవేత్తలు, పారిశ్రామిక రంగం ప్రతినిధులు, బ్యాంకు వర్గాలతో భేటీ కానున్నారు విత్తమంత్రి సీతారామన్​. బడ్జెట్​ ముందస్తు సంప్రదింపులను ప్రధానమంత్రి ఆర్థిక సలహా మండలి సభ్యుల సమావేశంతో ప్రారంభించనున్నారు సీతారామన్​. ప్రస్తుత పరిస్థితుల్లో ఏ విధంగా ముందుకు వెళ్లాలనే అంశంపై వారి సలహాలు తీసుకోనున్నారు.

ఆర్థిక వృద్ధి మందగమనం, నిరర్థక ఆస్తులు, బ్యాంకింగేతర ఆర్థిక రంగాల్లో నిధుల కొరత, ఉద్యోగ కల్పన, ప్రైవేట్​ పెట్టుబడులు, ఎగుమతుల పునరుద్ధరణ, వ్యవసాయ సంక్షోభం, ప్రభుత్వ పెట్టుబడుల వంటి విషయాలు బడ్జెట్​ రూపకల్పనలో కీలకంగా మారాయి.

జీఎస్టీ సమావేశంలో..

జూన్​ 20న జీఎస్టీ మండలి సమావేశం జరగనుంది. ఈ సమావేశంలోనే బడ్జెట్​పై రాష్ట్రాల ఆర్థిక మంత్రుల సలహాలు, సూచనలు స్వీకరించే అవకాశం ఉంది.

పరిశ్రమ వర్గాలతో...

ఇప్పటికే పరిశ్రమ వర్గాలతో రెవెన్యూ కార్యదర్శి అజయ్​ భూషన్​ పాండే ఒక దశ సంప్రదింపులు పూర్తి చేశారు. కార్పోరేట్​ పన్ను, కనీస ప్రత్యామ్నాయ పన్ను(ఎమ్ఏటీ) తగ్గించాలని వారు కోరారు. విద్యుత్​ వాహనాల రంగంలో ప్రోత్సాహకాలు, అనుమతులను సులభతరం చేయాలని సూచించారు.

ప్రజల నుంచి...

బడ్జెట్​ పద్దుల తయారీలో ప్రజలను భాగస్వాములు చేయాలని ప్రత్యేక కార్యక్రమాన్ని తీసుకొచ్చింది ఆర్థిక శాఖ. బడ్జెట్​లో తమకు కావాల్సిన అంశాలపై సూచనలు చేసే అవకాశం కల్పించింది. 'mygov.in' పోర్టల్​ ద్వారా జూన్​ 20 వరకు సలహాలు స్వీకరించనుంది.

ఇదీ చూచండి:రూ.50 కోట్ల టర్నోవరు ఉంటేనే ఈ-బిల్లు!

ABOUT THE AUTHOR

...view details