తెలంగాణ

telangana

By

Published : Apr 3, 2020, 1:57 PM IST

ETV Bharat / business

'కరోనాతో ప్రపంచ ఆర్థికానికి ట్రిలియన్​ డాలర్ల నష్టం'

చైనాలో పుట్టుకొచ్చిన కరోనా విజృంభణతో ప్రపంచ దేశాల ఆర్థిక వ్యవస్థలు పతనమవుతున్నాయి. స్టాక్​మార్కెట్లు కుప్పకూలుతున్నాయి. ఈ నేపథ్యంలో.. ప్రపంచ ఆర్థిక రంగం భారీగా నష్టపోతుందని అంచనా వేసింది ఆసియా అభివృద్ధి బ్యాంకు(ఏడీబీ). భారత్​లోనూ ఈ ఏడాది వృద్ధి రేటు మరింత మందగిస్తుందని విశ్లేషించింది. ప్రభుత్వ ఉద్దీపన చర్యలు, సంస్కరణలతో తీవ్రతను కాస్త తగ్గించవచ్చని పేర్కొంది.

ADB expects India's economic growth to slow down to 4 pc in FY21 on global pandemic
'కరోనాతో ప్రపంచ ఆర్థికానికి ట్రిలియన్​ డాలర్ల నష్టం'

కరోనా మహమ్మారితో ప్రపంచ దేశాలు అతలాకుతలం అవుతున్నాయి. అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలైన అమెరికా, ఐరోపాలు తీవ్రంగా నష్టపోతున్నాయి. ఈ కారణంగా ప్రపంచ ఆర్థికానికి దాదాపు 4.1 ట్రిలియన్​ డాలర్ల మేర నష్టం వాటిల్లే అవకాశం ఉందని అంచనా వేసింది ఆసియా అభివృద్ధి బ్యాంకు (ఏషియన్​ డెవలప్​మెంట్​ బ్యాంకు-ఏడీబీ). ఇది ప్రపంచవ్యాప్త రాబడిలో దాదాపు 5 శాతమని విశ్లేషించింది.

ఈ నష్టతీవ్రత చాలా తక్కువేనని.. ఆర్థిక, సామాజిక సంక్షోభం, విద్య, ఆరోగ్య రంగాలపై దీర్ఘకాలిక ప్రభావాన్ని ఇందులో మినహాయించినట్లు ఏడీబీ తెలిపింది. అయితే... స్వల్పకాలంలోనే ఈ నష్టాన్ని 2 ట్రిలియన్​ డాలర్లకు తగ్గించే అవకాశాలున్నాయని వెల్లడించింది మనీలా కేంద్రంగా నడిచే ఏడీబీ.

''ప్రస్తుత సంక్షోభంతో ఆర్థిక వ్యవస్థపై దీర్ఘకాలిక ప్రభావం పడనుందనే మదుపరుల భయాలతో స్టాక్​మార్కెట్లు భారీగా పతనమవుతున్నాయి. అయితే.. కేంద్ర బ్యాంకులు, ప్రభుత్వాలు ఉద్దీపన చర్యలను ప్రకటిస్తుండటం సానుకూలాంశం.''

-ఏడీబీ

ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసులు 10 లక్షలు దాటిన తరుణంలో ఈ హెచ్చరికలు చేసింది ఏడీబీ. బిలియన్ల మంది ప్రజలు ఇంటికే పరిమితమవుతుండటం కారణంగా.. ఆర్థిక వ్యవస్థలు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి.

ఆసియాలో..

ఆసియాలో ప్రస్తుత సంవత్సరానికి వృద్ధిని కుదించింది ఏడీబీ. ఈ ఏడాది 2.2 శాతం మాత్రమే పెరుగుదల నమోదవుతుందని.. 1998 ఆర్థిక సంక్షోభం సమయంలో పెరిగిన 1.7 శాతం కంటే ఇది తక్కువ అని స్పష్టం చేసింది.

కరోనా సంక్షోభం... ఆసియాలో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ గల చైనాపై తీవ్ర ప్రభావం చూపనున్నట్లు అంచనా వేసింది ఏడీబీ. వృద్ధి రేటు.. 2.3 శాతానికి పరిమితమవుతుందని విశ్లేషించింది. జీడీపీలో దాదాపు 5 శాతం(628 బిలియన్​ డాలర్లు) కోల్పోతుందని పేర్కొంది.

భారత్​లో మందగమనం...

ప్రస్తుత ప్రపంచ ఆరోగ్య అత్యయిక పరిస్థితుల నేపథ్యంలో.. భారత్​లో వృద్ధి మరింత మందగిస్తుందని శుక్రవారం విడుదల చేసిన తన అవుట్​లుక్​లో వెల్లడించింది ఏడీబీ. వచ్చే ఆర్థిక సంవత్సరం 6.2 శాతానికి పుంజుకునే ముందు.. ఈ ఏడాది భారత జీడీపీ వృద్ధి రేటు 4 శాతానికి పరిమితమవుతుందని అంచనా వేసింది.

అయితే.. ప్రస్తుతానికి భారత్​లో కరోనా మహమ్మారి పెద్దగా విస్తరించలేదని, మెరుగైన చర్యల ద్వారా నష్టాన్ని తగ్గించవచ్చని వివరించింది. ఈ సందర్భంగా కార్పొరేట్​ పన్ను తగ్గింపు వంటి ప్రభుత్వ ఉద్దీపన చర్యలు, ఆర్థిక రంగంలో సంస్కరణలు వంటివి ఉపశమనం కలిగిస్తాయని పేర్కొంది.

ABOUT THE AUTHOR

...view details