తెలంగాణ

telangana

ETV Bharat / briefs

తప్పుడు వార్తలకు 'టిప్​లైన్'​తో కళ్లెం!

సార్వత్రిక ఎన్నికల వేళ తప్పుడు సమాచార వ్యాప్తిని అరికట్టేందుకు వాట్సాప్​ చర్యలు చేపట్టింది. సమాచారం నిజమైందా కాదా అని వినియోగదారులు తెలుసుకునేందుకు 'చెక్​పాయింట్​ టిప్​లైన్'​ ఫీచర్ తీసుకొచ్చింది.

By

Published : Apr 2, 2019, 4:50 PM IST

వాట్సాప్​లో తప్పుడు వార్తలకు 'టిప్​లైన్'​తో కళ్లెం!

సామాజిక మాధ్యమం వాట్సాప్​ తప్పుడు వార్తల​ను అరికట్టేందుకు చర్యలు చేపట్టింది. దేశంలో సాధారణ ఎన్నికల నేపథ్యంలో తప్పుడు సమాచార వ్యాప్తి చెందకుండా కొత్త ఫీచర్​ను ఆవిష్కరించింది. తమకు అందిన సమాచారం నిజమైందా కాదా అని సరిచూసుకునేందుకు 'చెక్​పాయింట్​ టిప్​లైన్' అనే ఆప్షన్​ను ప్రవేశపెట్టింది.

"భారత్ కేంద్రంగా పనిచేసే మీడియా నిపుణుల స్టార్టప్​ ప్రోటో (పీఆర్​ఓటీఓ) ఈ 'టిప్​లైన్'​ను ప్రారంభించింది. ఇది ఎన్నికల సమయంలో పుకార్లతో కూడిన డేటాబేస్​ రూపొందించి... దాని ఆధారంగా సమాచారాన్నివిశ్లేషిస్తూ చెక్​ పాయింట్​కు సహకరిస్తుంది. ఈ పరిశోధన ప్రాజెక్ట్​ను వాట్సాప్ పర్యవేక్షిస్తూ సాంకేతిక సహకారం అందిస్తుంది. " -వాట్సాప్​

భారత వినియోగదారులు తమకు అందిన తప్పుడు సమాచారాన్ని, పుకార్లను వాట్సాప్​లోని (+ 91-9643-000-888) నంబర్ ద్వారా చెక్​పాయింట్​ టిప్​లైన్​కు పంపొచ్చని సంస్థ తెలిపింది. ఒకసారి వాట్సాప్ వినియోగదారుడు అనుమానిత సమాచారాన్ని టిప్​లైన్​కు పంపితే దానికి ప్రోటో ధ్రువీకరణ కేంద్రం స్పందిస్తుంది. ఆ సమాచారం నిజమా కాదా అనేది వినియోగదారునికి చేరవేస్తుంది.

ఈ కేంద్రం చిత్రాలు, వీడియో లింక్స్​, టెక్ట్స్ రూపంలోని సమాచారాన్ని విశ్లేషిస్తుంది. ఆంగ్లంతో పాటు నాలుగు స్థానిక భాషలు హిందీ, తెలుగు, బెంగాలీ, మలయాళంలలో సమీక్షిస్తుంది.
తప్పుడు సమాచార వ్యాప్తిపై ప్రపంచవ్యాప్తంగా పనిచేసిన డిగ్​ డీపర్​ మీడియా, మీడాన్​ సంస్థలు భారత్​లో ఫేక్​న్యూస్​ కట్టడికి ప్రోటో(పీఆర్​ఓటీఓ)కు సహాయపడతాయని పేర్కొంది వాట్సాప్​.

"వాట్సాప్​లో క్రమ పద్ధతిలో తప్పుడు సమాచారం వ్యాప్తిపై అధ్యయనం చేయటమే ఈ ప్రాజెక్ట్​ ముఖ్య ఉద్దేశం. ఎంత ఎక్కువ సమాచారం వస్తే అంత గొప్పగా మేం తప్పుడు సమాచారంపై విశ్లేషించగలుగుతాం. అనుమానాస్పద సమస్యలు, భాషలు, ప్రాంతాలు తదితరమైనవి గుర్తించగలుగుతాం." -రిత్విజ్​ పర్రీక్​, నాసర్​ ఉల్​ హాది, ప్రోటో వ్యవస్థాపకుడు

ABOUT THE AUTHOR

...view details