తెలంగాణ

telangana

ETV Bharat / briefs

కేసీఆర్ బహిరంగ సభలు... కేటీఆర్​ రోడ్​ షోలు

లోక్​సభ ఎన్నికల ప్రచారానికి తెరాస  షెడ్యూలు సిద్ధం చేస్తోంది. నియోజకవర్గాల వారిగా పర్యటనలపై, నాయకులను సమన్వయం చేస్తూ... గెలుపే లక్ష్యంగా కార్యాచరణను రూపొందిస్తున్నారు కేసీఆర్​. 11 రోజుల్లో 20 సభల్లో పాల్గొనే అవకాశం ఉంది.

By

Published : Mar 23, 2019, 6:27 AM IST

Updated : Mar 23, 2019, 8:36 AM IST

kcr

ఎన్నికల ప్రచారంలో కేసీఆర్
అభ్యర్థుల ప్రకటన అయిపోయింది. ఇప్పుడు ప్రచారంపై దృష్టి పెట్టారు తెరాస అధినేత. నేతలను సమన్వయం చేసుకొని గెలుపే లక్ష్యంగా పని చేసే విధంగా కార్యాచరణ రూపొందిస్తున్నారు. ఈనెల 28 నుంచి ప్రచారాన్ని ప్రారంభించనున్నారు కేసీఆర్​. దాదాపు 11 రోజులు పాటు 20 సభల్లో పాల్గొనే అవకాశం ఉంది. జంటనగరాల్లోని నియోజకవర్గాల్లో కేటీఆర్​ రోడ్​ షోలు నిర్వహించనున్నారు.

గెలిపించాలే...

అభ్యర్థుల గెలుపు వ్యూహాన్ని రూపొందించేందుకు వీలుగా మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో కేసీఆర్​ సమావేశం నిర్వహించనున్నారు. శుక్రవారం జంట నగరాల పరిధిలోని మంత్రులు, నేతలతో సమావేశమైనట్లు సమాచారం. ఈ మేరకు చేవెళ్ల, సికింద్రాబాద్‌, మల్కాజిగిరి స్థానాల్లో పార్టీ అభ్యర్థులను గెలిపించేందుకు కలిసికట్టుగా కృషి చేయాలని సూచించారు. మిగిలిన నియోజకవర్గాల పరిధిలోని మంత్రులు, ప్రజాప్రతినిధులతో సీఎం వరుసగా భేటీ కానున్నారు. అభ్యర్థులు సత్వరమే నామినేషన్‌ దాఖలు చేసి ప్రచార బరిలోకి దిగాలని సూచించారు. ఈ నెల 28న నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసిన వెంటనే కేసీఆర్​ సభలకు హాజరు కానున్నారు.

ప్రచారాలకు షెడ్యూలు

లోక్‌సభ ఎన్నికల ప్రచారానికి నియోజకవర్గాల వారీగా షెడ్యూలు సిద్ధమవుతోంది. మెదక్‌, ఆదిలాబాద్‌, నల్గొండ, మహబూబ్​నగర్‌, వరంగల్‌, మహబూబాబాద్‌ తదితర నియోజకవర్గాల్లో మొదటి వారం సభలు జరుగనున్నాయి. ఈ నెల 29న నల్గొండ, 31న మహబూబ్​నగర్‌, ఏప్రిల్​ 1న మహబూబాబాద్‌, ఖమ్మంలో కేసీఆర్‌ సభలపై పార్టీ శ్రేణులకు సమాచారం అందించారు. వచ్చే నెల 9న ఎన్నికల ప్రచారం ముగుస్తుంది. అప్పటి వరకు మొత్తం 14 నియోజకవర్గాల్లో సీఎం సభలు సాగనున్నాయి. మల్కాజిగిరి, ఆదిలాబాద్‌, ఖమ్మం, నల్గొండ, మహబూబ్​నగర్‌లో రెండేసి చొప్పున సభలు నిర్వహించాలని నిర్ణయించారు.

జంటనగరాల్లో కేటీఆర్​ రోడ్​ షోలు

తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ జంట నగరాల్లోని మల్కాజిగిరి, సికింద్రాబాద్‌, చేవెళ్ల నియోజకవర్గాల్లో రోడ్‌ షోలు నిర్వహించడానికి ప్రణాళికను రూపొందిస్తున్నారు. సికింద్రాబాద్‌ పరిధిలో ఈ నెల 30 నుంచి వచ్చే నెల 2 వరకు, మల్కాజిగిరి నియోజకవర్గంలో, ఏప్రిల్​ 3 నుంచి 6 వరకు, చేవెళ్ల పరిధిలో ఏప్రిల్‌ 7 నుంచి 9 వరకు రోడ్‌ షోలు నిర్వహించే అవకాశం ఉంది. కొత్త అభ్యర్థులకు కేటీఆర్‌ అభినందనలు తెలిపారు. ఎన్నికల ప్రచారంపై దృష్టి కేంద్రీకరించాలని అభ్యర్థులకు సూచించినట్లు సమాచారం.

ఇదీ చూడండి:ఎమ్మెల్సీ ఎన్నికల్లో 73.27 శాతం పోలింగ్

Last Updated : Mar 23, 2019, 8:36 AM IST

ABOUT THE AUTHOR

...view details