Visually Impaired Student Got A Gold Medal: చదువుకోవాలనే దృఢ సంకల్పం ఉంటే ఎలాంటి అవరోధాలు ఎదురైనా లక్ష్యాన్ని చేరుకోగలమని నిరూపించాడు ఓ అంధ విద్యార్థి. కర్ణాటక మంగళూరు కుంబాలకు చెందిన అన్విత్ కుమార్ దృష్టి లోపంతో బాధపడుతున్నాడు. అయినా నిరాశ పడకుండా చదివి పోస్ట్ గ్రాడ్యుయేషన్లో గోల్డ్ మెడల్ సాధించాడు. మంగళూరు విశ్వవిద్యాలయం నుంచి రాజకీయ శాస్త్రంలో అత్యధిక స్కోరు సంపాదించిన విద్యార్థిగా నిలిచాడు.
అన్విత్ ఆరో తరగతిలో ఉండగా.. తన రెండు కళ్లను పోగొట్టుకున్నాడు. ఆ తర్వాత అతడి తల్లి చదువుకోవాలని ఎంతగానో ప్రోత్సహించింది. ఫలితంగా ప్రతి తరగతిలోనూ మెరుగైన మార్కులు సాధించాడు. పదో తరగతి వరకు బ్రెయిలీ లిపిలో చదువుకున్న అన్విత్.. తర్వాత సాధారణంగానే విద్యను అభ్యసించాడు. అతడికి తల్లితోపాటు సహచర విద్యార్థులు, అధ్యాపకులు అండగా నిలిచారు. సహాయకులతో పరీక్షలకు హాజరైన అన్విత్.. పదో తరగతిలో 87శాతం, పీయూసీలో 88 శాతం, బీఏలో 89 శాతం, ఎంఏలో 82 శాతం మార్కులు పొందాడు. బీఏ, ఎంఏలో బంగారు పతకాలు సాధించిన అన్విత్.. ప్రొఫెసర్ కావడమే తన లక్ష్యం అంటున్నాడు.
"నేను బీఏలో ఈ ఘనత సాధించడానికి అధ్యాపకులు, మిత్రులు చాలా సహాయం చేశారు. ఎంఏలో కూడా అదే సహకారం అందించారు. నాకు మెటీరియల్ అవసరమైనపుడు ప్రొఫెసర్లు ఇచ్చేవారు. పరీక్షల సమయంలో ఇది ఎంతో సహాయం చేసింది."