తెలంగాణ

telangana

By

Published : Feb 28, 2022, 1:41 PM IST

ETV Bharat / bharat

8ఏళ్ల చిన్నారి సాహసం.. ఆ జీవులను కాపాడేందుకు సముద్ర లోతుల్లోకి..

8 Year Old Scuba Dives: ప్లాస్టిక్‌ తిని ఏ జీవీ చావకూడదనేది ఓ ఎనిమిదేళ్ల చిన్నారి కల. దాన్నే లక్ష్యంగా పెట్టుకుంది. స్కూబా డైవింగ్​ చేస్తూ సముద్రం అడుగుకు వెళ్లి ప్లాస్టిక్ వ్యర్థాలను సేకరిస్తోంది. ఆమే తమిళనాడుకు చెందిన తాగరై ఆరాధన. ప్రతి విద్యార్థి పర్యావరణం కోసం తపించాలని.. ఆ దిశగా అందరికి ఏదో ఒక లక్ష్యం ఉండాలని చెబుతున్న ఆ చిన్నారి గురించి మరిన్ని విషయాలు మీకోసం..

8 year old scuba diving
plastic in ocean

8 Year Old Scuba Dives: ప్లాస్టిక్​ తిని ఏ జీవి చనిపోకూడదని లక్ష్యంగా పెట్టుకుంది ఓ 8ఏళ్ల చిన్నారి. అంతేకాదు ఆ దిశగా అమితమైన కృషి చేస్తోంది. తనే స్కూబా డైవర్ తాగరై ఆరాధన. కారప్పాకం ప్రాంతానికి చెందిన ఈ చిన్నారి ప్లాస్టిక్‌ వ్యర్థాలకు వ్యతిరేకంగా ఉద్యమిస్తోంది. ఎన్నో సముద్ర జీవుల్ని కాపాడే పనిలో ఉంది. ఇదంతా ఎందుకు చేస్తున్నావు అనంటే.. ఉన్న జీవుల్ని కాపాడుకునేందుకు, నా బాటనే మరికొందరు ఎంచుకునేందుకు అని చెబుతోంది. ఆ బుజ్జాయి ఇంకా ఏమంటుందంటే..

"నా చిన్నతనం నుంచి చెన్నై తీరాన్ని గమనిస్తూనే ఉన్నాను. నగరవ్యాప్తంగా, చుట్టుపక్కల పడేసిన ప్లాస్టిక్‌ వ్యర్థాలు వర్షాలొచ్చినప్పుడు, కాలువల్లో పడినప్పుడు అవన్నీ కొట్టుకొచ్చి సముద్రంలో చేరుతున్నాయి. దీంతో ఎటుచూసినా ప్రమాదకర ప్లాస్టిక్‌ పదార్థాలు సముద్రంలో తేలియాడటం, చాలావరకు నీటి అడుగుకు చేరడం కనిపిస్తోంది. ఇవి సముద్రజీవులకు ఎంత ప్రమాదకరమో ఆలోచించండి! చేపలు, తాబేళ్లు, ఇతర సముద్రజీవులు చనిపోయి ఒడ్డుకు కొట్టుకొస్తున్నాయి. చాలావరకు ప్లాస్టిక్‌కు, కాలుష్యానికి బలవుతున్నాయి."

తీరంలో చనిపోయిన తాబేలును పరిశీలిస్తూ..

వేదనకు గురయ్యా..

"మన దేశ తీర సముద్రంలో డుగాంగ్‌ జీవులు చాలా అరుదుగా ఉన్నాయి. అధికారుల లెక్కలప్రకారమే 150కన్నా తక్కువగా ఉన్నాయని చెబుతున్నారు. గల్ఫ్‌ ఆఫ్‌ మన్నార్, గుజరాత్, అండమాన్‌ తీరాల్లో మాత్రమే ఇవి ఉన్నాయి. వీటికి సముద్ర అడుగు భాగంలోని గడ్డిలాగా ఉండే పదార్థాలే ఆహారం. కానీ అక్కడే ఉన్న ప్లాస్టిక్‌ని సైతం తినేస్తున్నాయి. ఎంత బాధాకరం. ఇలాంటి సముద్రజీవుల్ని కాపాడాలని నేను లక్ష్యంగా పెట్టుకున్నా. ఇలా విద్యార్థులు కూడా పర్యావరణ రక్షణలో భాగంగా చెట్టునో, పక్షినో రక్షించాలని లక్ష్యంగా పెట్టుకోవాలి. ఆ లక్ష్యం నిర్ధిష్టంగా ఉండటం సహా దానికోసం శ్రమించాలి."

వందల కిలోల ప్లాస్టిక్‌..

బీచ్‌ల్లో ప్లాస్టిక్‌ వ్యర్థాల్ని సేకరిస్తున్న ఆరాధన

"నేనూ, మా నాన్న అరవింద్‌ కలిసి చెన్నై సముద్ర తీరంలోని వివిధ బీచ్‌ల్లో ప్లాస్టిక్‌ వ్యర్థాల్ని తొలగించాం. 3నెలల్లో 600కిలోలు వచ్చాయి. ఇందులో 200కిలోలు సముద్ర తీర గర్భంలో, మరో 400కిలోలు బీచ్‌ల్లో తీశాం. ప్రజల్లో అవగాహన పెంచేందుకు, వ్యర్థాల్ని ఎక్కడపడితే అక్కడ వేయకుండా ఉండేందుకు మా ప్రయత్నం చేస్తున్నాం. కార్పొరేషన్, ప్రభుత్వం కూడా మాకు సహకరిస్తోంది. వచ్చిన ప్లాస్టిక్‌ వ్యర్థాల్ని రీసైక్లింగ్​కు పంపుతున్నాం."

సముద్రంలో దిగేందుకు భయపడలేదు..

స్కూబాడైవింగ్‌ చేస్తూ ప్లాస్టిక్‌ వ్యర్ధాన్ని తీస్తున్న ఆరాధన

"ప్లాస్టిక్‌ తీసేందుకు సముద్రగర్భంలో 2మీటర్ల మేర నేల తాకేచోట స్కూబా డైవింగ్‌ చేసి లోపలికి వెళ్తున్నా. నాకు తోడుగా నాన్న ఉంటారు. అక్కడ కవర్లు, గుట్కా పొట్లాలు ఇలా పలురకాల వ్యర్థాలు కనిపిస్తూనే ఉంటాయి. తీరంలో సముద్రగర్భంలోకి వెళ్లేందుకు నేనేమీ భయపడటంలేదు. భవిష్యత్తులో నేను కూడా మా నాన్నలాగా స్కూబా డైవింగ్‌ శిక్షకురాలిని అవ్వాలనే ఆకాంక్ష ఉంది. ఈ లక్ష్యాన్ని సముద్రజీవుల రక్షణకు వాడుతున్నాను. కిలోలకొద్దీ ప్లాస్టిక్‌ వ్యర్థాల్ని బీచ్‌లో, సముద్రగర్భంలో తీసేసినప్పుడు ఎన్నో జీవుల్ని కాపాడుతున్నాననే సంతృప్తి నాలో ఉంటోంది. ఈమధ్యే ప్రజల్లో ప్లాస్టిక్‌ వ్యర్థాలపై అవగాహన పెంచేందుకు 19కి.మీ మేర సముద్రంలో ఈది ఓ రికార్డును కూడా కైవసం చేసుకున్నాను."

అలా వచ్చేసిందంతే..

"ఇంత చిన్న వయసులో స్కూబా డైవింగ్‌ ఎలా చేయగలుగుతున్నావ్‌? భయమేయట్లేదా? అని చాలామంది అడుగుతున్నారు. నాకు చిన్నతనం నుంచే అలవాటైపోయింది. అదెలాగో చెప్తా.. నేను 9నెలల పాపగా ఉన్నప్పుడే మా నాన్న రోజూ ఉదయం సాయంత్రం 10నిమిషాలపాటూ నీటిలో కూర్చోబేట్టేవారట, ఇప్పటికీ ఆ వీడియోలున్నాయి. అలాగే నన్ను నీటిలో తేలియాడేలా చేసేవారు. అలా రెండున్నరేళ్లకే ఈదడం మొదలుపెట్టాను. 5ఏళ్లకే స్కూబాడైవింగ్‌ శిక్షణ పొందా. మా నాన్న కూడా స్కూబా డైవింగ్‌ శిక్షకుడే. ప్రమాదం లేనిచోట్ల నన్ను ఈదడం, నీటిలోపల ఉండటం అలవాటు చేశారు."

నాన్నే స్ఫూర్తి.

తల్లిదండ్రులతో చిన్నారి ఆరాధన

"ప్లాస్టిక్‌పై అవగాహన పెంచడానికి నాకు నాన్నే ఆదర్శం. నేను 3ఏళ్ల వయసులో ఉన్నప్పుడే ఆయన బీచ్‌ క్లీనింగ్‌ల్లో విరివిగా పాల్గొనేవారు. నేనూ వెళ్లేదాన్ని. తీరంలో వ్యర్థాల్ని చూసి ఎంతో బాధేసేది. ఆ తర్వాత అవి సముద్రజీవులకు ఎంత ప్రమాదకరమో నాన్న వివరించేవారు. తమిళనాడు మెరైన్‌ పోలీస్, మత్స్యశాఖ, వైల్డ్‌లైఫ్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియాతో కలిసి పనిచేయడం వల్ల మా నాన్న ఎక్కువగా నేర్చుకోగలిగారు. ఆ విషయాల్ని నాకు చెప్పేవారు. సముద్రజీవులు చనిపోయేందుకు ప్లాస్టిక్, కాలుష్యం ప్రధాన కారణాలనీ చెప్పేవారు. వాటిని అర్థం చేసుకుని నేను కూడా స్వయంగా తెలుసుకున్నా. జీవుల పొట్టల్లోనూ ప్లాస్టిక్‌ వ్యర్థాలుండేవి. చేపలు, తాబేళ్లు ఇలా ఎన్నో. నేను తెలుసుకోవడంతోనే ఆగకూడదనుకుని పాఠశాలల్లో విద్యార్థులకు కూడా నాకున్న జ్ఞానాన్ని పంచుతున్నాను. ఈ ప్రయత్నం ఎంత దూరమెళ్తుందో, ఎంతమందిని ప్రభావితం చేస్తుందో తెలీదు. కానీ పర్యావరణం కోసం అందరూ కష్టపడాలనేదే నా తాపత్రయం."

ఇవీ చూడండి:

ప్లాస్టిక్‌ గరళ సాగరాలు- చేపల నుంచి మనుషులకు ముప్పు!

ప్లాస్టిక్‌ వ్యర్థాలు కుప్పలుతెప్పలు.. పునర్వినియోగం అంతంతే

తాబేళ్లు మెచ్చే నివాసం..నేడు కాలుష్యానికి ఆవాసం

ABOUT THE AUTHOR

...view details