తెలంగాణ

telangana

టీకా వేయించుకో- నిత్యావసర సరుకులు తీసుకుపో!

By

Published : Jun 26, 2021, 2:43 PM IST

వ్యాక్సిన్ తీసుకునేందుకు అంతగా ఆసక్తి చూపని గ్రామీణ ప్రాంతాల్లో టీకాలపై ఉన్న అపోహలను తొలగించేందుకు ఓ సంస్థ చొరవ తీసుకుంది. బీహార్‌ బోధ్​గయ జిల్లాలో టీకాలు పొందిన ప్రజలకు ఉచిత నిత్యావసరాలు పంపిణీ చేస్తూ.. వారిని ప్రోత్సహిస్తోంది ఓ సామాజిక సంస్థ.

Social organisation provides free ration in rural areas to improve inoculation
టీకా వేయించుకో.. నిత్యావసర సరుకులు తీసుకుపో!

దేశంలో కొనసాగుతున్న టీకా కార్యక్రమానికి మద్దతుగా.. తమవంతు సహాయాన్ని అందించేందుకు ఓ సామాజిక సంస్థ ముందుకొచ్చింది. గ్రామీణ ప్రాంతాల్లో టీకా తీసుకునేందుకు ప్రజలు అంతగా ఆసక్తి చూపడం లేదని గ్రహించిన 'సిద్ధార్థ కంపాషన్ ట్రస్ట్'(ఎస్.సీ.టీ) టీకా తీసుకున్నవారికి ప్రోత్సాహకాలు అందిస్తోంది. ఆ సంస్థ ఇప్పటివరకు రెండు వేల మందికి పైగా గ్రామీణులకు నిత్యావసర సరకులు పంపిణీ చేసింది.

ఈ విషయంలపై స్థానికులతో 'ఈటీవీ భారత్‌' మాట్లాడగా.. వారి నుంచి అనూహ్య స్పందన వచ్చింది. లాభాపేక్ష లేకుండా చేస్తున్న సంస్థ సేవల పట్ల హర్షం వ్యక్తం అవుతోంది.

"ఎస్.సీ.టీ బృందం మా గ్రామానికి వచ్చి ప్రజల్లో వ్యాక్సిన్ గురించి అవగాహన కల్పించింది. కొవిన్ యాప్ గురించి తెలియని వారికి వారే రిజిస్ట్రేషన్ చేశారు. ఆపై వారానికి 50 మంది చొప్పున నిత్యావసర వస్తువులను ఉచితంగా పంపిణీ చేశారు. వారు చూపిన ఈ చొరవ క్షేత్ర స్థాయిలో మంచి ప్రభావాన్ని చూపింది. ఇప్పుడు వ్యాక్సిన్ తీసుకునేందుకు ప్రజలు ఆసక్తి చూపుతున్నారు"

-సంజయ్ కుమార్, స్థానిక లబ్ధిదారుడు

టీకా వేయించుకున్నవారికి.. నిత్యావసర సరుకుల పంపిణీ

"కరోనా మహమ్మారిపై యుద్ధానికి టీకానే అతిపెద్ద ఆయుధం. దీనిపై అవగాహన కల్పించేందుకు మా బృందం గ్రామాల్లో పర్యటించింది. చాలా మంది అనాసక్తితో ఉన్నారని అర్థమైంది. దీంతో టీకా తీసుకున్నవారికి ఉచిత రేషన్ అందించాలని నిర్ణయించాం. ఇది మంచి ఫలితాన్ని ఇచ్చింది. రోజూ 200 మంది వరకు మా సంస్థ నుంచి సరకులు పొందుతున్నారు."

-వివేక్ కల్యాణ్, ఎస్.సీ.టీ కార్యదర్శి

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details