తెలంగాణ

telangana

'మతమార్పిళ్లు' చాలా తీవ్రమైన అంశం.. రాజకీయ రంగు పులమొద్దు : సుప్రీం

By

Published : Jan 9, 2023, 5:52 PM IST

SC On Religious Conversion : మతమార్పిళ్ల అంశంపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఇది చాలా తీవ్రమైన అంశమని.. దీనికి రాజకీయ రంగు పులమకూడదని స్పష్టం చేసింది. బెదిరింపులు, మోసం, కానుకలు ఆశ చూపి బలవంతంగా చేసే మతమార్పిళ్లకు సంబంధించిన కేసు విచారణకు సహకారం అందించాలని అటార్నీ జనరల్​ ఆర్​. వెంకటరమణిని కోరింది.

SC on religious conversion
SC on religious conversion

SC On Religious Conversion : మతమార్పిళ్ల అంశం చాలా తీవ్రమైనదని.. దీనికి రాజకీయ రంగు పులమకూడదని స్పష్టం చేసింది సుప్రీం కోర్టు. మోసపూరిత మతమార్పిళ్లను అరికట్టేలా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలంటూ దాఖలైన పిటిషన్​పై ఈ వ్యాఖ్యలు చేసింది. బెదిరింపులు, మోసం, కానుకలు ఆశ చూపి బలవంతంగా చేసే మతమార్పిళ్లకు సంబంధించిన కేసు విచారణకు సహకారం అందించాలని అటార్నీ జనరల్​ ఆర్​. వెంకటరమణిని జస్టిస్​ ఎమ్​.ఆర్ షా, జస్టిస్​ సీటీ రవికుమార్​తో కూడిన ధర్మాసనం కోరింది.

అయితే విచారణ ప్రారంభంలో తమ రాష్ట్రంలో ఎలాంటి మతమార్పిళ్లు జరగలేదని.. ఇదంతా రాజకీయ కక్షసాధింపు చర్యలని తమిళనాడు తరఫు న్యాయవాది వాదించారు. దీనిపై బెంచ్ తీవ్ర అభ్యంతరం తెలిపింది."మీరు ఇలా వ్యాఖ్యానించడానికి వేరే కారణాలు ఉండవచ్చు. కానీ కోర్టు వ్యవహారాలను ఇతర విషయాల్లోకి మళ్లించవద్దు. మేము మొత్తం దేశం కోసం ఆందోళన చెందుతున్నాము. ఇది మీ రాష్ట్రంలోనే జరిగితే బాధాకరం.. జరగకపోతే మంచిది. ఇది ఒక రాష్ట్రాన్ని లక్ష్యంగా చేసుకున్నట్లు చూడవద్దు. దీన్ని రాజకీయం చేయొద్దు" అని హితవు పలికింది. ఈ కేసు విచారణను ఫిబ్రవరి 7కు వాయిదా వేసింది.

బలవంతపు మతమార్పిళ్లు దేశ భద్రతను ప్రమాదంలోకి నెడుతున్నాయని.. పౌరుల మతస్వేచ్ఛకు భంగం కలిగిస్తున్నాయని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. ఇది చాలా తీవ్రమైన అంశమని.. దీనిని అరికట్టేలా పటిష్ఠ చర్యలు తీసుకోవాలని ఇటీవలే కేంద్రానికి సూచించింది. ఇతరులను బలవంతంగా మతం మార్పించడమన్నది మతస్వేచ్ఛ పరిధిలోకి రాదని సుప్రీంకోర్టులో కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. మోసం, బలప్రయోగం, ఆకర్షణల ద్వారా మతమార్పిళ్లకు పాల్పడితే మతస్వేచ్ఛను ఉల్లంఘించినట్లేనని పేర్కొంది. అలాంటి చర్యలను నిరోధించేందుకు అవసరమైన చట్టాలు చేయాల్సిన ఆవశ్యకతను నొక్కిచెప్పింది.

భయపెట్టడం, కానుకలు అందజేయడం, ఆర్థిక ప్రయోజనాలు కల్పించడం ద్వారా దేశంలో మతమార్పిళ్లు జరుగుతున్నాయని.. వాటిని అరికట్టేందుకు ప్రభుత్వాలు కఠిన చర్యలు తీసుకునేలా ఆదేశాలు జారీ చేయాలని న్యాయవాది అశ్వినీకుమార్‌ ఉపాధ్యాయ్‌ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దానికి స్పందనగా కేంద్ర ప్రభుత్వం తాజా వివరాలతో కోర్టులో సంక్షిప్తంగా ఓ ప్రమాణపత్రాన్ని సమర్పించింది. బలవంతపు మతమార్పిళ్ల సమస్య తీవ్రత గురించి తమకు తెలుసని అందులో పేర్కొంది. అశ్వినీకుమార్‌ పిటిషన్‌లో ప్రస్తావించిన అంశాలను పరిగణనలోకి తీసుకుంటూ.. మతస్వేచ్ఛను పరిరక్షించేలా చర్యలు చేపడతామని హామీ ఇచ్చింది.

ఇవీ చదవండి:తమిళనాడు అసెంబ్లీలో గందరగోళం.. గవర్నర్ వాకౌట్.. చరిత్రలో తొలిసారి!

'నా భార్య అలిగింది.. ఫోన్​ చేసినా మాట్లాడడం లేదు.. లీవ్ కావాలి'.. ASPకి కానిస్టేబుల్​ లేఖ

ABOUT THE AUTHOR

...view details