తెలంగాణ

telangana

ETV Bharat / bharat

తండ్రి డ్రగ్స్​ బానిస.. స్టేషన్​లో పిల్లలు.. పసికందుకు పాలిచ్చిన పోలీస్ అమ్మ

ఏ దిక్కూ లేనివారికి దేవుడే దిక్కంటారు. కానీ ఇక్కడ పోలీసులే దిక్కయ్యారు. పసి పిల్లలకు పాలు పట్టించి వారి ఆకలి తీర్చారు. ఎత్తుకుని అటు ఇటు తిరుగుతూ లాలించారు. పిల్లల పట్ల వ్యవహరించిన తీరుకు కేరళ పోలీసులను అందరూ అభినందిస్తున్నారు.

By

Published : Nov 3, 2022, 9:30 AM IST

Policemen turn baby sitters
Policemen turn baby sitters

ఉపాధ్యాయురాలు కావాలన్నది ఆమె లక్ష్యం. అందుకే పీజీ అనంతరం బీఈడీ చేశారు. 24 ఏళ్ల వయసులో అనుకోకుండా పోలీసు అధికారిగా ఎంపికై.. నాలుగేళ్ల క్రితం విధుల్లో చేరిన ఎం.ఆర్‌.రమ్యపై కేరళ రాష్ట్రంలో ఇప్పుడు ప్రశంసల జల్లు కురుస్తోంది. పోలీసుల ప్రతిష్ఠ పెంచిన అధికారిగా, సిసలైన మాతృమూర్తిగా ఆమెను అభినందిస్తూ కేరళ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ దేవన్‌ రామచంద్రన్‌ ఓ లేఖ పంపారు. డీజీపీ అనిల్‌కాంత్‌ కుటుంబ సమేతంగా రమ్యను పోలీస్‌ హెడ్‌క్వార్టర్స్‌కు ఆహ్వానించి, ప్రశంసాపత్రం అందజేశారు. ఇంతకూ ఆమె ఏం చేశారంటే.. ఓ కేసులో తల్లికి దూరమైన 12 రోజుల చిన్నారికి మాతృమూర్తిగా పాలిచ్చి, ప్రాణాపాయ స్థితి నుంచి కాపాడారు.

రమ్యను అభినందిస్తున్న కేరళ డీజీపీ అనిల్​కాంత్

తనతో గొడవ పడి, పొత్తిళ్లబిడ్డతో భర్త ఎటో వెళ్లిపోయాడని అక్టోబరు 29న ఓ మహిళ చేవాయుర్‌ పోలీస్‌స్టేషనులో ఫిర్యాదు చేశారు. విచారణ ప్రారంభించిన రమ్య బృందం బెంగళూరు సమీపంలోని సుల్తాన్‌ బత్తెరీ వద్ద వాహన తనిఖీల సందర్భంగా బిడ్డతోపాటు ఆమె భర్తను పట్టుకొన్నారు. అప్పటికే తల్లిపాలు లేక అలసిపోయిన ఆ చిన్నారిని పరీక్షించిన అక్కడి వైద్యులు చక్కెర నిల్వలు తగ్గిపోయాయని చెప్పారు. ఆ సమయంలో తన ఇద్దరు పిల్లలు గుర్తుకురాగానే.. మరో ఆలోచన లేకుండా రమ్య ఆ బిడ్డకు తానే పాలిచ్చి మాతృహృదయం చాటుకొన్నారు. ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న భర్త సైతం తన చర్యను సమర్థించి, హర్షం వ్యక్తం చేశారని ఆమె తెలిపారు.

తండ్రి డ్రగ్స్​ బానిస.. పిల్లలు పోలీస్​ స్టేషన్​లో..
డ్రగ్స్​కు బానిసైన ఓ తండ్రి.. పిల్లల్ని పెంచడం చేతకాక పోలీస్​ స్టేషన్​లో వదిలి పారిపోయాడు. దీంతో పసిపిల్లల్ని లాలించడం పోలీసుల వంతైంది. ఈ ఘటన కేరళలోని ఎర్నాకులంలో జరిగింది.

.

అసలు ఏం జరిగిందంటే..కేరళలో డ్రగ్స్​కు​ బానిసైన ఓ వ్యక్తి తన పిల్లల్ని పోలీస్​ స్టేషన్​లో వదిలి పారిపోయాడు. దీంతో అతణ్ని కొందరు పోలీసులు వెంబడించగా.. మరికొంత మంది పిల్లల్ని చూసుకున్నారు. డబ్బా పాలు పట్టించారు. వారిని ఎత్తుకుని అటు ఇటు తిరుగుతూ లాలించారు. ఆ తర్వాత పోలీసులు ఆ వ్యక్తిని పట్టుకుని పోలీస్​ స్టేషన్​కు తీసుకువచ్చారు. దీంతో అతడు ఏడ్చుకుంటూ, తలను బాదుకుంటూ.. తన భార్య తనను పిల్లల్ని వదిలి ఎటో వెళ్లిపోయిందని.. తాను పిల్లల్ని చూసుకోలేనని పోలీసులకు చెప్పాడు. తనకు ఏ ఉద్యోగం లేదని.. వారిని పోషించే స్తోమత లేదని అన్నాడు. అనంతరం పోలీసులు అతణ్ని అతడి ఇంటికి తీసుకెళ్లారు. అతడు చెప్పింది నిజమేనని నిర్ధరణకు వచ్చారు. దీంతో పిల్లల్ని చైల్డ్​ వెల్ఫేర్​ కమిటీకి అప్పగించారు. డ్రగ్స్​కు బానిసైన వ్యక్తి దగ్గరి బంధువులు ఎవరైనా పిల్లల్ని తీసుకెళ్లాలనుకుంటే వారికి అప్పగిస్తామని పోలీసులు తెలిపారు. దీంతో అందరూ పోలీసులను అభినందిస్తున్నారు.

ఇవీ చదవండి :మైనర్​గా ఉన్నప్పుడు భార్యపై అత్యాచారం- దోషికి 20 ఏళ్ల జైలు.. బాధితురాలి ట్విస్ట్!

15 ఏళ్ల బాలికపై అత్యాచారం.. ఆపై హత్య.. చెరుకు తోటలో పడేసి..

ABOUT THE AUTHOR

...view details