తెలంగాణ

telangana

By

Published : Mar 22, 2021, 8:20 PM IST

ETV Bharat / bharat

'మహా'లో లేఖ రచ్చ- ఠాక్రే సర్కార్​పై ఒత్తిడి!

మహారాష్ట్ర హోంమంత్రి అనిల్ దేశ్​ముఖ్​పై తీవ్ర ఆరోపణలతో ముంబయి మాజీ సీపీ రాసిన లేఖ దుమారం రేపుతోంది. వివాదాస్పద ఆదేశాలు జారీ చేశారని సీపీ పేర్కొన్న సమయంలో.. దేశ్​ముఖ్ ఎక్కడ ఉన్నారనే అంశంపై పాలక విపక్షాలు మాటల దాడి చేసుకున్నాయి. మరోవైపు, మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలన విధించాలని కేంద్ర మంత్రి రామ్​దాస్ అఠవాలే అమిత్ షాకు లేఖ రాశారు.

NCP chief Pawar defended Anil Deshmukh
'మహా'లో లేఖ రచ్చ- రాష్ట్రపతి పాలనకు డిమాండ్

నెలకు రూ. 100 కోట్లు సంపాదించాలని పోలీసులకు మహారాష్ట్ర హోంమంత్రి అనిల్ దేశ్​ముఖ్ ఆదేశాలు జారీ చేశారంటూ ముంబయి మాజీ పోలీస్ కమిషనర్ పరమ్​బీర్ సింగ్ రాసిన లేఖ వ్యవహారం రోజురోజుకు ముదురుతోంది. ఎన్​సీపీ నేత దేశ్​ముఖ్​ను సమర్థిస్తూ ఆ పార్టీ అధినేత శరద్​ పవార్ మాట్లాడటం.. పవార్​ను ఇరకాటంలో పెట్టాలని యత్నిస్తూ భాజపా ఎదురుదాడికి దిగడం వల్ల రాష్ట్రంలో పరిస్థితి వాడీవేడీగా మారింది.

ఈ విషయంపై మీడియా సమావేశం నిర్వహించిన శరద్ పవార్.. పోలీసులకు వివాదాస్పద ఆదేశాలు జారీ చేశారని చెప్పిన సమయంలో దేశ్​ముఖ్ ఆస్పత్రిలో ఉన్నారని పేర్కొన్నారు. అప్పుడు కరోనాకు చికిత్స తీసుకుంటున్నారని వివరించారు.

పవార్

"ఫిబ్రవరి మధ్యలో.. హోంమంత్రి కొందరు పోలీసులకు వివాదాస్పద ఆదేశాలు జారీ చేశారని మాజీ కమిషనర్ తన లేఖలో ప్రస్తావించారు. కానీ.. కరోనా వల్ల ఫిబ్రవరి 6 నుంచి 16 వరకు అనిల్ దేశ్​ముఖ్ ఆస్పత్రిలోనే ఉన్నారు. డిశ్చార్జి తర్వాత ఫిబ్రవరి 27 వరకు హోంక్వారంటైన్​లో ఉన్నారు. కాబట్టి ఆరోపణలకు ఎలాంటి బలం లేదు. అవి నిరాధారమైనవని తేలింది."

-శరద్ పవార్, ఎన్​సీపీ అధినేత

అయితే, ఫిబ్రవరి 15న దేశ్​ముఖ్ ఓ ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించారని భాజపా పేర్కొంది. ఆ సమయంలో ఆస్పత్రిలో ఉన్నారని శరద్ పవార్ చేసిన వ్యాఖ్యలను తప్పుబట్టింది. సెక్యూరిటీ గార్డులు, మీడియా సిబ్బందితో కలిసి ప్రెస్​ కాన్ఫరెన్స్ నిర్వహించారని భాజపా నేత దేవేంద్ర ఫడణవీస్ పేర్కొన్నారు.

దేశ్​ముఖ్ వివరణ

ఈ నేపథ్యంలో ప్రెస్ కాన్ఫరెన్స్​పై వివరణ ఇచ్చారు అనిల్ దేశ్​ముఖ్. ట్విట్టర్​లో వీడియో పోస్ట్ చేసిన ఆయన.. డిశ్చార్జి తర్వాత ఆస్పత్రి ప్రాంగణంలోనే మీడియాతో మాట్లాడానని చెప్పారు. తనకు ఓపిక లేనందున కుర్చీలో కూర్చున్నానని స్పష్టం చేశారు.

"ఫిబ్రవరి 5 నుంచి 15 వరకు నాగ్​పుర్​లోని అలెక్సిస్ ఆస్పత్రిలో చికిత్స తీసుకున్నాను. ఫిబ్రవరి 15న డిశ్చార్జి అయ్యాను. ఆస్పత్రి బయట ఉన్న కొందరు విలేకరులు.. నేను బయటకు వచ్చే సమయంలో కొన్ని ప్రశ్నలు అడిగారు. అప్పుడే కొవిడ్ నుంచి కోలుకోవడం వల్ల నాకు నీరసంగా అనిపించింది. గేట్ వద్ద కుర్చీపై కుర్చొని పాత్రికేయుల ప్రశ్నలకు సమాధానం చెప్పాను. ఆ తర్వాత ఇంటికి వెళ్లి, ఫిబ్రవరి 27 వరకు హోం క్వారంటైన్​లో ఉన్నాను. ఫిబ్రవరి 28న బయటకు వచ్చి సహ్యాద్రి గెస్ట్ హౌస్​లో ఓ కార్యక్రమానికి హాజరయ్యాను."

-అనిల్ దేశ్​ముఖ్, మహారాష్ట్ర హోంమంత్రి

నిర్ణయం సీఎందే: కాంగ్రెస్

దేశ్​ముఖ్ రాజీనామా చేయాలని విపక్షాల నుంచి డిమాండ్ వినిపిస్తున్న వేళ మహారాష్ట్ర కాంగ్రెస్ ఇంఛార్జి హెచ్​కే పాటిల్ కీలక వ్యాఖ్యలు చేశారు. హోంమంత్రి అనిల్ దేశ్​ముఖ్ రాజీనామా అంశంపై సీఎం ఉద్ధవ్ ఠాక్రే ఒక్కరే నిర్ణయం తీసుకుంటారని స్పష్టం చేశారు. పార్టీ నేతలతో సమావేశమైన తర్వాత ఈ ప్రకటన చేశారు పాటిల్.

పార్లమెంట్​లో రగడ

అటు.. ఈ లేఖ సెగ పార్లమెంటును తాకింది. మహారాష్ట్రలో మహా వికాస్ అఘాడీ ప్రభుత్వం తక్షణమే గద్దె దిగాలని భాజపా డిమాండ్ చేసింది. ఈ అంశంపై సభలో కాంగ్రెస్ నేత రవ్​నీత్​ సింగ్​, స్వతంత్ర ఎంపీ నవనీత్​ రవి రాణా, భాజపా సభ్యులు పీపీ చౌదరి, పూనం మహాజన్​ మధ్య మాటల యుద్ధం జరిగింది.

ఇదీ చదవండి:పరమ్​బీర్ లేఖపై పార్లమెంటులో రగడ

సుప్రీంకు వ్యవహారం

మరోవైపు, దేశ్​ముఖ్​ అవినీతి అంశంపై సీబీఐ ద్వారా నిష్పాక్షిక దర్యాప్తు జరిపించాలని పరమ్​బీర్ సింగ్.. సుప్రీంకోర్టుకు విజ్ఞప్తి చేశారు. ఆధారాలను ధ్వంసం చేయడానికి ముందే ఆయనపై చర్యలు తీసుకోవాలని కోరారు.

తనను ముంబయి సీపీ పదవి నుంచి బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలపైనా పరమ్​బీర్ సింగ్ అభ్యంతరం వ్యక్తం చేశారు. చట్టవిరుద్ధమైన ఆ ఆదేశాలను తక్షణమే రద్దు చేయాలని ధర్మాసనాన్ని అభ్యర్థించారు.

రాష్ట్రపతి పాలనకు డిమాండ్

కాగా, మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలన విధించాలని కేంద్రమంత్రి రామ్​దాస్ అఠవాలే... కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు లేఖ రాశారు. పరమ్​బీర్ చేసిన ఆరోపణలపై పూర్తి దర్యాప్తు జరగాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. శాంతి భద్రతల విషయంలో ప్రభుత్వంపై ప్రజలు విశ్వాసం కోల్పోయారని, కాబట్టి సర్కారును రద్దు చేసి రాష్ట్రపతి పాలనను అమలు చేయాలని కోరారు. మరో రెండు రోజుల్లో ఈ వ్యవహారంపై అమిత్ షాను కలుస్తానని అఠవాలే స్పష్టం చేశారు.

'రాష్ట్రపతి పాలన'పై శివసేన ఫైర్

భాజపా ప్రోద్బలంతోనే పరమ్​బీర్ సింగ్ లేఖ రాశారని శివసేన విమర్శించింది. ఈ మేరకు సామ్నా పత్రికలో సంపాదకీయం ప్రచురించింది. రాష్ట్రపతి పాలన కోసం కేంద్ర ప్రభుత్వ సంస్థలను దుర్వినియోగం చేసేందుకు జరిగే ప్రయత్నాలను ఖండించింది. అలాంటి ప్రయత్నాలు చేసేవారు.. అదే మంటల్లో కాలిపోతారని హెచ్చరించింది.

ఇదీ చదవండి:'జాతీయ జెండా ఉన్న కేకు తింటే నేరం కాదు'

ABOUT THE AUTHOR

...view details