తెలంగాణ

telangana

ETV Bharat / bharat

Narayan Rane: రాణె పిటిషన్​పై బాంబే హైకోర్టు విచారణ!

తనపై నమోదైన ఎఫ్​ఐఆర్​లను కొట్టివేయాలని కోరుతూ.. కేంద్ర మంత్రి నారాయణ్​ రాణె(Narayan Rane) దాఖలు చేసిన వ్యాజ్యంపై బాంబే హైకోర్టు(Bombay High Court) నేడు విచారణ జరపనుంది. మరోవైపు... రాణెను సెప్టెంబర్​ 2న విచారణకు హాజరు కావాలని నాసిక్​ పోలీసులు నోటీసులు జారీ చేశారు.

By

Published : Aug 25, 2021, 11:04 AM IST

Updated : Aug 25, 2021, 11:25 AM IST

Narayan Rane i
కేంద్ర మంత్రి నారాయణ్​ రాణె

మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్‌ ఠాక్రేను(Uddhav Thackeray) ఉద్దేశించి వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన కేంద్రమంత్రి నారాయణ్‌ రాణె(Narayan Rane).. తనపై నమోదైన ఎఫ్​ఐఆర్​ల​ను కొట్టేయాలని కోరుతూ దాఖలు చేసిన వ్యాజ్యాలపై బాంబే హైకోర్టు(Bombay High Court) నేడు విచారణ జరపనుంది. ఈ నేపథ్యంలో రాణె సహా ఆయన తరఫు న్యాయవాదుల బృందం.. హైకోర్టుకు చేరుకుంది. నోటీసులు ఇవ్వకుండా తనను పోలీసులు ఎలా అరెస్టు చేస్తారని నారాయణ్​ రాణె తన పిటిషన్​లో పేర్కొన్నారు.

మరోవైపు.. రాణెను పోలీసు కేసులు వెంటాడుతున్నాయి. ఇప్పటికే అరెస్టయి.. బెయిల్‌పై విడుదలైన ఆయనకు తాజాగా నాసిక్‌ పోలీసులు నోటీసులు జారీ చేశారు. సెప్టెంబర్​ 2న విచారణకు హాజరుకావాలని పేర్కొన్నారు.

రాణె ఏమన్నారంటే...

దేశానికి ఏ సంవత్సరం స్వాతంత్ర్యం వచ్చిందో అడిగి తెలుసుకున్న సీఎంను చెంప చెల్లుమనిపించేవాడినంటూ కేంద్రమంత్రి రాణె చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. కేంద్రమంత్రి వ్యాఖ్యలు శాంతిభద్రతలకు విఘాతం కలిగించేలా ఉన్నాయంటూ శివసేన శ్రేణులు నాసిక్‌ సహా పలు ప్రాంతాల్లో ఆయనపై పోలీసులకు ఫిర్యాదు చేశాయి. ఈ మేరకు కేంద్ర మంత్రి రాణెపై ఎఫ్​ఐఆర్​ నమోదు చేసిన మహారాష్ట్ర పోలీసులు.. ఆయనను అరెస్టుచేశారు.

రూ.15 వేల పూచీకత్తుతో..

అయితే.. అరెస్టు తర్వాత తనకు రక్తపోటు ఎక్కువైందని, మధుమేహ స్థాయి పెరిగిందని మంత్రి చెప్పగా పోలీసులు వైద్య పరీక్షలు చేయించారు. తదుపరి విచారణ నిమిత్తం రాయ్‌గఢ్‌ పోలీసులకు అప్పగించారు. రాత్రి మహాద్‌లోని మేజిస్ట్రేట్‌ కోర్టులో మంత్రిని హాజరుపరచగా బెయిలుమంజూరైంది. అయితే.. ఆగస్టు 31, సెప్టెంబర్ 13 తేదీల్లో ఈ కేసు విచారణలో భాగంగా రత్నగిరి పోలీస్​ స్టేషన్​లో హాజరు కావాలని రాణెను ఆదేశించింది న్యాయస్థానం. భవిష్యత్తులో ఇలాంటి తరహా నేరాలు పాల్పడకూడదని చెప్పింది. రూ.15,000 పూచీకత్తుతో బెయిల్​ మంజూరు చేసింది.

విఫలయత్నాలు..

పోలీసుల అరెస్టు నుంచి రక్షణ కోసం బాంబే హైకోర్టులో రాణె తొలుత చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. తనపై ఎఫ్‌ఐఆర్‌ను కొట్టివేయాలని ఆయన అభ్యర్థించారు. మంగళవారమే అత్యవసర విచారణ చేపట్టాల్సిందిగా రాణె తరఫు న్యాయవాది చేసిన అభ్యర్థనను జస్టిస్‌ ఎస్‌.ఎస్‌.శిందే, జస్టిస్‌ ఎన్‌.జే.జమాదర్‌ల ధర్మాసనం తిరస్కరించింది.

హోం మంత్రితో సీఎం మీటింగ్

రాణె అరెస్టు నేపథ్యంలో మంగళవారం రాత్రి.. మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాక్రే.. హోం మంత్రి దిలీప్ వాల్సేతో ముంబయిలోని వర్ష నివాసంలో భేటీ అయ్యారు. రాష్ట్రంలో శాంతి భద్రతలపై సీఎంకు హోంమంత్రి వివరించారు. మరోవైపు.. శివసేన యువజన విభాగం యువసేన నేతలు కూడా సీఎంతో ఆయన నివాసంలో మంగళవారం రాత్రి సమావేశమయ్యారు.

భద్రత కట్టుదిట్టం..

మంగళవారం.. ముంబయి జుహులోని రాణె నివాసం వద్ద శివసేన, భాజపా కార్యకర్తల మధ్య తీవ్ర ఘర్షణ జరిగింది. ఈ క్రమంలో.. మరోసారి అలాంటి ఘటనలు జరగకుండా ముంబయి పోలీసులు అప్రమత్తమయ్యారు. రాణె నివాసం వద్ద బుధవారం భద్రతను కట్టుదిట్టం చేశారు. రాణెను కలిసేందుకు భాజపా సీనియర్ నేతలు.. నేడు రానున్న నేపథ్యంలో ఈ ఏర్పాట్లు చేసినట్లు తెలుస్తోంది.

రాణె నివాసం వద్ద పోలీసు సిబ్బంది
రాణె నివాసం వద్ద మోహరించిన పోలీసులు

ఇదీ చూడండి:సుప్రీం మాజీ జడ్జి ఇంటి వద్ద బాంబుపేలుళ్ల కలకలం

Last Updated : Aug 25, 2021, 11:25 AM IST

ABOUT THE AUTHOR

...view details