తెలంగాణ

telangana

By

Published : Jul 22, 2021, 1:00 PM IST

Updated : Jul 22, 2021, 1:54 PM IST

ETV Bharat / bharat

'కరోనా మరణాల లెక్క పక్కా- అవన్నీ అసత్యాలే!'

కరోనా మరణాలను తక్కువ చేసి చూపిస్తున్నారన్న ఆరోపణలను కేంద్రం ఖండించింది. కరోనా కేసులు దృష్టికి రాకపోయినా.. మరణాలు లెక్కలోకి రాకపోవడం చాలా అరుదు అని పేర్కొంది. కరోనాతో మృతుల సంఖ్య ప్రభుత్వ లెక్కలతో పోలిస్తే 49 లక్షల మేర అధికంగా ఉండొచ్చని అమెరికాకు చెందిన ఓ సంస్థ విడుదల చేసిన నివేదికను తప్పుబట్టింది.

India's COVID-19 death toll
కరోనా మరణాలు భారత్

దేశంలో అధికారిక లెక్కలతో పోలిస్తే కరోనా మరణాల వాస్తవ సంఖ్య అధికంగా ఉంటుందన్న వార్తల నేపథ్యంలో కేంద్రం స్పందించింది. మరణాల సంఖ్యను తక్కువగా నమోదు చేశారన్న ఆరోపణలను కొట్టిపారేసింది. అదనపు మరణాలన్నింటినీ కొవిడ్ మరణాలుగా నివేదికలు పరిగణిస్తున్నాయని, ఇది సరైంది కాదని వ్యాఖ్యానించింది.

మరణాల నమోదు కోసం దేశంలో ఉన్న బలమైన వ్యవస్థ కారణంగా.. కరోనా మరణాలు లెక్కలోకి రాకపోవడం చాలా అరుదు అని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ పేర్కొంది. కరోనా కేసులు దృష్టికి రాకపోయినా.. మరణాలు మాత్రం నమోదు కాకుండా ఉండే అవకాశం తక్కువ అని స్పష్టం చేసింది. కరోనా వివరాలను జిల్లా స్థాయిలో నమోదు చేసి.. పైస్థాయికి అందజేస్తారని, వాటిని రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్రానికి అందిస్తాయని వివరించింది.

"వైరస్​తో చనిపోయే అవకాశం దేశవ్యాప్తంగా ఒకేరకంగా ఉంటుందనే విషయం ఆధారంగా మరణాల గణన చేపట్టారు. ప్రత్యక్ష, పరోక్ష కారకాలను విస్మరించారు. జనాభాలోని వివిధ వర్గాలను, వారి జీనోమ్ ఆకృతులను పరిగణనలోకి తీసుకోలేదు. యాంటీబాడీలు త్వరగా నాశనమవుతాయని, తద్వారా మరణాల రేటు పెరుగుతుందని ఈ అధ్యయనం భావించడం కూడా ఆందోళనకరం. అధికంగా నమోదైన మరణాలన్నింటినీ కరోనా మరణాలని ఈ అధ్యయనం పరిగణిస్తోంది. ఇది పూర్తిగా తప్పుదోవపట్టించే విధంగా ఉంది."

-కేంద్ర ఆరోగ్య శాఖ

కేంద్ర మంత్రి మన్​సుఖ్ మాండవీయ సైతం రాజ్యసభలో కరోనా మరణాలను దాస్తున్నారనే ఆరోపణలను ఖండించారని ఆరోగ్య శాఖ తన ప్రకటనలో గుర్తు చేసింది. రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు పంపించే డేటాను మాత్రమే తాము ప్రచురిస్తామని తెలిపింది. మార్గదర్శకాలను అనుసరించి సరిగ్గా మరణాలను నమోదు చేయాలని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు అనేకసార్లు సూచించినట్లు స్పష్టం చేసింది.

49 లక్షలు అధికం!

దేశవ్యాప్తంగా కరోనాతో మృతి చెందినవారు ప్రభుత్వ లెక్కలతో పోలిస్తే 34 లక్షల నుంచి 49 లక్షల మేర అధికంగా ఉండొచ్చని అమెరికాకు చెందిన మేధోమధన సంస్థ 'సెంటర్‌ ఫర్‌ గ్లోబల్‌ డెవలప్‌మెంట్‌' నివేదిక అంచనా వేసింది. 2020 జనవరి నుంచి 2021 జూన్‌ మధ్య మరణాల గణాంకాలను విశ్లేషించి... ఈ కాలంలో 3 వేర్వేరు విధానాల్లో మరణాలను లెక్కగట్టింది. సంస్థకు చెందిన జస్టిన్‌ శాండెఫర్‌, భారత మాజీ ముఖ్య ఆర్థిక సలహాదారు అరవింద్‌ సుబ్రమణియన్‌, హార్వర్డ్‌ వర్సిటీకి చెందిన అభిషేక్‌ ఆనంద్‌ నివేదిక రూపకల్పనలో భాగస్వాములు.

ఇవీ చదవండి:

Last Updated : Jul 22, 2021, 1:54 PM IST

ABOUT THE AUTHOR

...view details