తెలంగాణ

telangana

By

Published : May 12, 2023, 4:33 PM IST

Updated : May 12, 2023, 5:04 PM IST

ETV Bharat / bharat

'మెజారిటీ లేకున్నా అధికారం.. బీజేపీ ప్లాన్​-బీ రెడీ!'.. జేడీఎస్ కలిసేది వారితోనే!!

Karnataka election results 2023 : 'ఎవరు ఏమనుకున్నా అధికారం మాదే'.. కర్ణాటకలో అన్ని రాజకీయ పార్టీలు చెబుతున్న మాట ఇది! ఎగ్జిట్ పోల్స్ అంచనాలు ఎలాగున్నా.. ప్రభుత్వం ఏర్పాటు చేసేది తామెనంటూ అన్ని పార్టీల నేతలు చెబుతున్నారు. బీజేపీ అయితే ఇంకో అడుగు ముందుకేసి.. 'మెజారిటీ రాకపోయినా మాదే అధికారం' అని చెబుతోంది. ఇందుకు ప్లాన్-బీ సైతం సిద్ధంగా ఉందని అంటోంది. ఏంటా ప్లాన్? ఆపరేషన్ కర్ణాటక రిపీట్ అవుతుందా? జేడీఎస్ వేసుకుంటున్న లెక్కలేంటి?

karnataka-election-results-2023
karnataka-election-results-2023

Karnataka election results 2023 : కర్ణాటకలో ఎవరు అధికారంలోకి రానున్నారనే విషయం కొద్ది గంటల్లో తేలిపోనుండగా.. అన్ని పార్టీలు తమదైన వ్యూహాల్లో నిమగ్నమయ్యాయి. ఫలితం తమకు అనుకూలంగా వస్తే ఏం చేయాలి? ప్రతికూలంగా వస్తే ఏం చేయాలో ఇప్పటి నుంచే రెడీ అవుతున్నాయి. మెజారిటీ తమకే వస్తుందని కాంగ్రెస్ విశ్వాసం వ్యక్తం చేస్తుండగా.. కింగ్ మేకర్ కాదు కింగ్ అవ్వాలని జేడీఎస్ ఊవిళ్లూరుతోంది. ఇక బీజేపీ ప్లాన్స్ ఎప్పటిలాగే అంచనాలకు అందకుండా సాగుతున్నట్లు తెలుస్తోంది. మెజారిటీ స్థానాలు రాకపోతే రాష్ట్రంలో తమ 'ఆపరేషన్' ప్రారంభిస్తామని బీజేపీ నేత, రాష్ట్ర మంత్రి ఆర్ అశోక సంచలన వ్యాఖ్యలు చేశారు. హైకమాండ్ మార్గదర్శకత్వంలో 'కార్యాచరణ' చేపడతామని చెప్పారు. బీజేపీకి మెజారిటీ సీట్లు వచ్చినా, రాకపోయినా ప్రభుత్వం ఏర్పాటు చేసేది తామేనని ధీమా వ్యక్తం చేశారు. ఈ మేరకు రాష్ట్రంలో హంగ్ వస్తే బీజేపీ ఏం చేస్తుందనే విషయంపై మీడియాతో మాట్లాడారు అశోక.

"మేం ప్రభుత్వం ఏర్పాటు చేస్తాం. ఎప్పుడు, ఎలా అని అడగకండి. కేంద్ర అధినాయకత్వంతో చర్చిస్తాం. ప్లాన్​-బీపై రాష్ట్ర నాయకులతో మాట్లాడతాం. ఈ ఏడాది 'కప్పు' మాదే. హైకమాండ్ మద్దతుతో ట్రోఫీ గెలిచి విజేతలుగా అవతరిస్తాం. కర్ణాటకలో డబుల్ ఇంజిన్ సర్కారు వచ్చి తీరుతుంది. అందులో అనుమానం లేదు. మేం మెజారిటీతో గెలుస్తున్నాం. మెజారిటీ రాకపోతే హైకమాండ్ మార్గదర్శకత్వంలో 'ఆపరేషన్' ప్రారంభిస్తాం."
-ఆర్ అశోక, బీజేపీ నేత, రాష్ట్ర మంత్రి

ఆర్ అశోక

కర్ణాటకలో మెజారిటీ ఎగ్జిట్ పోల్స్ కాంగ్రెస్ అధికారంలోకి వస్తాయని పేర్కొనగా.. హంగ్ అసెంబ్లీ ఏర్పడుతుందని ఇంకొన్ని ఎగ్జిట్​పోల్స్ అంచనా వేశాయి. రెండు ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు మాత్రం బీజేపీ అధికారంలోకి వస్తుందని వెల్లడించాయి. ఈ నేపథ్యంలోనే ఫలితంపై ఉత్కంఠ నెలకొంది. అయితే, ప్లాన్-బీ గురించి తనకు అవగాహన లేదని కర్ణాటక సీఎం, బీజేపీ నేత బసవరాజ్ బొమ్మై చెప్పారు. మెజారిటీ సాధించే అధికారంలోకి వస్తామని చెప్పారు. ఎగ్జిట్ పోల్ అంచనాలు తప్పు అని రుజువవుతుందని అన్నారు.

"నేను ఆయన(అశోక)తో మాట్లాడలేదు. ప్లాన్-బీ ఏంటో తెలియదు. హంగ్ అసెంబ్లీ ఉండదని నేను విశ్వసిస్తున్నా. ఏడాది పాటు అధికారంలో ఉన్న కూటమి పూర్తిగా వైఫల్యం చెందింది. 141 స్థానాలు వస్తాయని చెప్తున్న డీకే శివకుమార్​ను శుక్రవారం వరకు కలలు కననివ్వండి. కుమారస్వామి తాము కింగ్ మేకర్ కాదు.. కింగ్ అని చెప్పుకుంటున్నారు. ఎవరైనా ఏదైనా చెప్పుకునే స్వేచ్ఛ ఉంది. 2018 మాదిరిగానే ఈసారి ఎగ్జిట్ పోల్ అంచనాలు అసత్యమని తేలుతుంది."
-బసవరాజ్ బొమ్మై, కర్ణాటక సీఎం

కర్ణాటక ఎగ్జిట్ పోల్స్

'కనీసం 141 గెలుస్తున్నాం'
కాంగ్రెస్ సైతం సొంతంగా అధికారంలోకి వస్తామని ధీమాగా ఉంది. కనీసం 141 స్థానాలు గెలుచుకొని ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని కర్ణాటక కాంగ్రెస్ అధ్యక్షుడు డీకే శివకుమార్ చెబుతున్నారు. రిసార్ట్ రాజకీయాల కాలం ముగిసిందని అన్నారు. "ఎగ్జిట్ పోల్స్​ను నేను నమ్మను. 141 సీట్లు గెలుస్తామని నేను విశ్వసిస్తున్నా. ఎగ్జిట్ పోల్స్ శాంపిల్ సైజ్ చాలా తక్కువ. మా శాంపిల్ సైజ్ చాలా పెద్దది. కాంగ్రెస్​కు అనుకూలంగా ఫలితాలు వస్తాయి. రిసార్టు రాజకీయాలకు మళ్లాల్సిన అవసరం లేదు. ఆ కాలం 25 ఏళ్ల క్రితమే ముగిసింది" అని డీకే శివకుమార్ చెప్పుకొచ్చారు.

జేడీఎస్ రూట్ ఎటో?
ఎన్నికల సందర్భంగా రెండు జాతీయ పార్టీలకు వ్యతిరేకంగా స్వరం వినిపించిన జేడీఎస్.. హంగ్ అసెంబ్లీపై ఆశలు పెట్టుకుంది. కాంగ్రెస్, బీజేపీలో ఎవరికీ మెజారిటీ స్థానాలు రాకపోతే తాము చక్రం తిప్పొచ్చని భావిస్తోంది. ఈసారి తాము కింగ్ మేకర్ కాదని, కింగ్ అవుతామని జేడీఎస్ నాయకుడు, మాజీ సీఎం కుమారస్వామి చెప్పుకొచ్చారు. దీన్ని బట్టి ఎవరికి మద్దతు ప్రకటించినా... సీఎం పదవిని జేడీఎస్ డిమాండ్ చేసే సూచనలు కనిపిస్తున్నాయి. అయితే, తాము ఎవరితో కలవాలో ఇదివరకే నిర్ణయించుకున్నామని జేడీఎస్ చెబుతోంది.

"ఎవరితో కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేస్తామనే విషయంపై ఇప్పటికే మేం నిర్ణయించుకున్నాం. సరైన సమయం వచ్చినప్పుడు దీనిపై మేం ప్రకటన చేస్తాం. కర్ణాటక ప్రజల కోసం మేం కొన్ని కార్యక్రమాలు చేపట్టాలని అనుకుంటున్నాం. రైతు, మహిళా సాధికారత, మెరుగైన విద్య, ఉద్యోగ కల్పన వంటి అంశాల్లో ఎవరైతే మెరుగ్గా పని చేయగలరో మాకు తెలుసు. అలాంటి పార్టీతోనే మేం జతకడతాం."
-తన్వీర్ అహ్మద్, జేడీఎస్

తన్వీర్ అహ్మద్, జేడీఎస్

మరోవైపు, జేడీఎస్​తో జట్టుకట్టే విషయంపై నిర్ణయం పార్టీ హైకమాండ్ తీసుకుంటుందని బీజేపీ దిగ్గజ నేత యడియూరప్ప పేర్కొన్నారు. అయితే, అలాంటి పరిస్థితి ఎదురుకాకపోవచ్చని అన్నారు. 'మా పార్టీకి 115 నుంచి 117 సీట్లు వస్తాయి. నేతలంతా కష్టపడి పనిచేశారు. బీజేపీ సొంతంగానే ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని అనుకుంటున్నా. ఏం జరుగుతుందో చూద్దాం' అని పేర్కొన్నారు యడ్డీ.

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు మే 10న జరిగాయి. చిక్కబళ్లాపుర జిల్లాలో అత్యధికంగా 85.56 శాతం మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. బెంగళూరు రూరల్​లో 85.08 శాతం మంది ఓటేయగా.. బెంగళూరు మహానగర పరిధిలో అతితక్కువగా 52.33 శాతం మంది మాత్రమే ఓటు వేశారు. మే 13న ఫలితాలు ఓట్ల లెక్కింపు ఉంటుంది. రాష్ట్ర అసెంబ్లీలో 224 స్థానాలు ఉన్నాయి. ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే.. పార్టీ/కూటమికి 113 సీట్లు అవసరం.

Last Updated : May 12, 2023, 5:04 PM IST

ABOUT THE AUTHOR

...view details