తెలంగాణ

telangana

By

Published : Apr 24, 2022, 1:33 PM IST

ETV Bharat / bharat

కండోమ్ లేకుండా సెక్స్.. 17లక్షల మందికి హెచ్​ఐవీ​.. ఆంధ్రప్రదేశ్​ టాప్!

India AIDS statistics: అరక్షిత లైంగిక సంపర్కం కారణంగా భారత్​లో గత పదేళ్లలో 17 లక్షల మందికిపైగా హెచ్​ఐవీ​ బారినపడ్డారు. 3 లక్షల 18వేలకుపైగా కేసులతో ఆంధ్రప్రదేశ్​ ఈ జాబితాలో తొలిస్థానంలో ఉంది. సహ చట్టం కింద చేసిన దరఖాస్తుకు సమాధానంగా జాతీయ ఎయిడ్స్ నివారణ సంస్థ ఈ విషయాలు వెల్లడించింది.

india aids statistics
కండోమ్ లేకుండా సెక్స్.. 17లక్షల మందికి ఎయిడ్స్​.. ఏపీ టాప్!

India AIDS statistics: లైంగిక సంపర్కం సమయంలో సరైన జాగ్రత్తలు తీసుకోని కారణంగా భారత్​లో 2011-21 మధ్య 17 లక్షల 8 వేల 777 మందికి హెచ్​ఐవీ సోకింది. మధ్యప్రదేశ్​కు చెందిన సామాజిక కార్యకర్త చంద్రశేఖర్​ గౌర్​ సమాచార హక్కు చట్టం కింద చేసిన అభ్యర్థన మేరకు ఈ వివరాలు వెల్లడించింది జాతీయ ఎయిడ్స్​ నియంత్రణ సంస్థ(నాకో).

అయితే.. ఎయిడ్స్ బారినపడుతున్న వారి సంఖ్య దశాబ్దకాలంగా క్రమంగా తగ్గుతూ వస్తోందని వెల్లడించింది నాకో. అరక్షిత సంభోగం కారణంగా 2011-12లో 2.4లక్షల మందికి హెచ్​ఐవీ సోకగా.. 2020-21లో ఆ సంఖ్య 85,268గా ఉన్నట్లు తెలిపింది. జాతీయ ఎయిడ్స్​ నియంత్రణ సంస్థ ఇచ్చిన నివేదికలోని మరిన్ని కీలకాంశాలు ఇలా ఉన్నాయి..

  • Which state is first in aids in India: అరక్షిత లైంగిక సంపర్కం కారణంగా దేశంలోనే అత్యధిక హెచ్​ఐవీ​ కేసులు ఆంధ్రప్రదేశ్​లో నమోదయ్యాయి. గత పదేళ్లలో కండోమ్ వాడకపోవడం వల్ల ఏపీలో 3,18,814 మందికి హెచ్​ఐవీ సోకింది.
  • మహారాష్ట్ర(2,84,577 కేసులు), కర్ణాటక(2,12,982 కేసులు), తమిళనాడు(1,16,536 కేసులు), ఉత్తర్​ప్రదేశ్​(1,10,911 కేసులు), గుజరాత్​(87,440 కేసులు) తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.
  • రక్త మార్పిడి, ఇతర సంబంధిత కారణాలతో గత పదేళ్లలో 15,782 మంది హెచ్​ఐవీ బారిన పడ్డారు.
  • 2011-21 మధ్య 4,423 మంది చిన్నారులకు తల్లుల నుంచి హెచ్​ఐవీ సోకింది.
  • అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో హెచ్​ఐవీ కేసులు స్థిరంగా తగ్గుతున్నాయి.
  • 2020 నాటికి దేశంలో 23 లక్షల 18 వేల 737 మంది హెచ్​ఐవీతో జీవిస్తున్నారు. వీరిలో 81 వేల 430 మంది చిన్నారులు.
  • హెచ్​ఐవీ టెస్టుకు ముందు/తర్వాత చేసే కౌన్సిలింగ్​లో రోగులు చెప్పిన వివరాల ఆధారంగా ఈ లెక్కలు వేసింది జాతీయ ఎయిడ్స్​ నియంత్రణ సంస్థ.

పరిస్థితి మెరుగు:ఎయిడ్స్​ విషయంలో భారత్​లో పరిస్థితులు క్రమంగా మెరుగుపడుతున్నాయని నిపుణులు చెబుతున్నారు. "టెస్టులు, నిర్ధరణ మొదలు చికిత్స వరకు హెచ్​ఐవీ రోగుల పర్యవేక్షణ విషయంలో భారత ప్రభుత్వ సంస్థ అయిన నాకో చాలా సమర్థంగా పనిచేస్తోంది. చికిత్స సులువుగా లభించడం వల్ల దేశంలో ఎయిడ్స్​ రోగుల పరిస్థితి మెరుగైంది. 2000 తర్వాత నుంచి దేశంలో హెచ్​ఐవీ సోకిన రోగుల సంఖ్య తగ్గుతోంది" అని తెలిపారు గురుగ్రామ్​లోని ఫోర్టిస్ మెమోరియల్​లో ఇంటర్నల్ మెడిసిన్ విభాగం సంచాలకుడు సతీశ్​ కౌల్.

"రెండేళ్లుగా హెచ్​ఐవీ కేసుల సంఖ్య చాలా తక్కువగా ఉంది. కరోనా మహమ్మారి, లాక్​డౌన్​ ఆంక్షలే ఇందుకు కారణం. ఇప్పుడు కొవిడ్ తగ్గిపోతోంది కాబట్టి ఎయిడ్స్ రోగుల సంఖ్య పెరిగే అవకాశముంది. ఎవరికైనా హెచ్​ఐవీ సోకినట్లు తేలితే.. సాధ్యమైనంత త్వరగా యాంటీ రెట్రోవైరల్ థెరపీ చేయాలి." అని చెప్పారు దిల్లీ ద్వారకాలోని ఆకాశ్​ హెల్త్​కేర్​ ఆస్పత్రిలో ఇంటర్నల్ మెడిసిన్ విభాగం సీనియర్ కన్సల్టెంట్ ప్రభాత్ రంజన్​ సిన్హా.

ABOUT THE AUTHOR

...view details