తెలంగాణ

telangana

By

Published : Dec 3, 2020, 9:07 PM IST

ETV Bharat / bharat

రైతు దీక్ష: ఫలించని చర్చలు- శనివారం మరో భేటీ

కేంద్రం, రైతు సంఘాల మధ్య జరిగిన నాల్గో విడత చర్చలు అసంపూర్తిగానే ముగిశాయి. డిసెంబర్​ 5న మరోసారి సమావేశం కావాలని నిర్ణయించినట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. పార్లమెంటు ప్రత్యేక సమావేశాలను ఏర్పాటు చేసి, నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని రైతు సంఘాలు డిమాండ్​ చేసినట్లు సమాచారం. అయితే కనీస మద్దతు ధరను ఎట్టి పరిస్థితుల్లో ముట్టుకోమని హామీఇచ్చిన కేంద్రమంత్రులు.. దానికి ఎలాంటి సవరణలు కూడా చేయమని భరోసా ఇచ్చినట్లు విశ్వసనీయవర్గాలు తెలిపాయి.

Govt-farmers talks deadlocked; Next meeting proposed on Saturday
ఫలించని

నూతన వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ పోరుబాట పట్టిన రైతు సంఘాలు, కేంద్రం మధ్య సుదీర్ఘంగా సాగిన నాల్గోవిడత చర్చలు అసంపూర్తిగా ముగిశాయి. ఎల్లుండి మరోసారి సమావేశం కావాలని నిర్ణయించినట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. సుమారు ఎనిమిది గంటల పాటు సాగిన చర్చలు ఎలాంటి ఫలితం లేకుండానే ముగిశాయి. ఈ నెల ఒకటో తేదీన జరిపిన చర్చల్లో.. చట్టాలపై అభ్యంతరాల అధ్యయనానికి కమిటీ ఏర్పాటు చేస్తామన్న కేంద్రమంత్రుల ప్రతిపాదనకు రైతు ప్రతినిధులు నిరాకరించారు. ఈ నేపథ్యంలో గురువారం మధ్యాహ్నం మరోసారి రైతు సంఘాలతో కేంద్రం చర్చలు జరిపింది. ఈ చర్చల్లో కేంద్ర మంత్రులు నరేంద్రసింగ్ తోమర్, పీయూష్ గోయల్, సోం ప్రకాశ్ పాల్గొన్నారు.

కేంద్ర మంత్రులతో రైతు నాయకుల చర్చలు

పార్లమెంటు ప్రత్యేక సమావేశాలను ఏర్పాటు చేసి, నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని చర్చల సందర్భంగా రైతు సంఘాల ప్రతినిధులు కోరినట్లు తెలుస్తోంది. అయితే కనీస మద్దతు ధరను ఎట్టి పరిస్థితుల్లో ముట్టుకోమని, దానికి ఎలాంటి మార్పులు చేయబోమని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి తోమర్ హామీ ఇచ్చినట్లు సమాచారం. రైతుల డిమాండ్లపై నిర్ణయం తీసుకునేందుకు ఎల్లుండి వరకూ సమయం కావాలని కేంద్ర మంత్రులు కోరినట్లు విశ్వసనీయవర్గాలు తెలిపాయి.

"ఎంఎస్​పీపై అనేక అనుమానాలు ఉన్నాయి. ఎంఎస్​పీ ఎప్పటికీ కొనసాగుతుంది. ఎల్లుండి మధ్యాహ్నం 2 గంటలకు మరోసారి రైతు సంఘాలతో ప్రభుత్వం చర్చలు జరుపుతుంది. అందులో తుది నిర్ణయానికి వచ్చే అవకాశం ఉంది. ఇవాళ్టి చర్చలు మంచి వాతావరణంలో జరిగాయి. రైతులు తమ డిమాండ్లను సరిగ్గా తమ ముందు ఉంచారు. ప్రభుత్వానికి ఎలాంటి ఇగో లేదు. ప్రభుత్వం పూర్తి సంయమనంతో వారి డిమాండ్లను ఆలకించింది. ఆయా అంశాలపై ఇరువురం దాదాపు ఓ అంగీకారానికి వచ్చాం. చలికాలం అయినందున ఆందోళన విరమించాలని రైతులను కోరుతున్నా. ఇది వారికీ మంచిది, ఆందోళనల కారణంగా ఇబ్బందిపడుతున్న దిల్లీవాసులకూ మంచిది."

-నరేంద్ర సింగ్ తోమర్, వ్యవసాయ శాఖ మంత్రి

మరోవైపు, చర్చల విరామ సమయంలో కేంద్ర మంత్రులు.. రైతు సంఘాల ప్రతినిధులను భోజనానికి ఆహ్వానించగా వారు సున్నితంగా తిరస్కరించారు. కనీసం మంచినీరు, టీ కూడా తీసుకోలేదు. సింఘు సరిహద్దు నుంచి తీసుకొచ్చిన ఆహారాన్నే స్వీకరించారు.

దిల్లీ సరిహద్దులో ఆహారం వండుకుంటున్న రైతులు

అభ్యంతరాలపై లేఖ

అంతకుముందు, కొత్తచట్టాలపై తమ అభ్యంతరాలను తెలియజేస్తూ రైతు సంఘాలు కేంద్రానికి సవివరంగా లేఖ రాశాయి. నూతన చట్టాలతో రైతులకు ప్రయోజనం లేదని, వాటివల్ల కార్పొరేట్లకు మాత్రమే లబ్ధి చేకూరుతుందని ఆందోళన వ్యక్తం చేశాయి. కార్పొరేట్లకు స్వేచ్ఛ ఇవ్వటం ద్వారా నియంత్రణాధికారం వారి చేతుల్లోకి వెళ్తుందని ఆరోపించాయి. ప్రైవేటు మార్కెట్లకు అనుమతించటం, ప్రభుత్వ మార్కెట్లను నీరుగార్చడమేనని పేర్కొన్నాయి. ప్రైవేటు మార్కెట్లలో న్యాయపర రక్షణ అవకాశాలు లేవని తెలిపాయి.

దిల్లీ సరిహద్దులో రైతుల ఆందోళన

ఆగని నిరసనలు

అటు, దిల్లీ సరిహద్దుల్లో అన్నదాతలు సాగిస్తున్న పోరుబాట ఎనిమిదో రోజుకు చేరింది. గజగజ వణిస్తున్న చలిని సైతం లెక్కచేయకుండా ఆందోళన కొనసాగిస్తున్నారు. సింఘు, టిక్రీ, చిల్లా, ఘాజీపూర్​ సరిహద్దుల్లో రోడ్లపై బైఠాయించారు. యూపీ-దిల్లీ సరిహద్దుతోపాటు టిక్రీ, ఝరోడా, ఝతిక్రా సరిహద్దులను మూసివేశారు. దిల్లీ-యూపీ సరిహద్దు అయిన ఘజీపుర్​ వద్ద ఉద్రిక్తత నెలకొంది. వివిధ ప్రాంతాల నుంచి వస్తున్న రైతులను పోలీసులు అడ్డుకోవటం ఉద్రిక్తత పరిస్థితులకు దారితీసింది. జాతీయ రహదారిని మూసివేయటం సహా అడ్డంగా బారికేడ్లు పెట్టడం వల్ల రైతులు వాటిని దాటి వెళ్లేందుకు ప్రయత్నించారు.

రైతుల నిరసనల నేపథ్యంలో దిల్లీలో భారీ భద్రత

ABOUT THE AUTHOR

...view details