తెలంగాణ

telangana

'రీ-ఇన్‌ఫెక్షన్‌'కు శాస్త్రవేత్తల నిర్వచనం ఇదే

By

Published : Apr 1, 2021, 4:42 PM IST

కరోనా పాజిటివ్ వచ్చిన వ్యక్తికి 102 రోజుల్లోపు మళ్లీ వైరస్ సోకితే దాన్ని రీ-ఇన్​ఫెక్షన్​గా పరిగణించాలని భారత శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. రెండు సార్లు పాజిటివ్ వచ్చిన వ్యక్తికి మధ్యలో ఓసారి నెగెటివ్ వచ్చి ఉండాలని స్పష్టం చేశారు.

re infection definition by icmr
'రీ-ఇన్‌ఫెక్షన్‌'కు భారత శాస్త్రవేత్తల నిర్వచనం ఇదే

ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్‌ మహమ్మారి విజృంభిస్తున్న వేళ.. ఇదివరకే కొవిడ్‌ సోకిన వారికి మళ్లీ పాజిటివ్‌(రీ-ఇన్‌ఫెక్షన్‌) వస్తోందని పలు నివేదికలు వెల్లడిస్తున్నాయి. ఈ నేపథ్యంలో రీ-ఇన్‌ఫెక్షన్‌కు సాంకేతికపరంగా స్పష్టమైన నిర్వచనాన్ని భారత శాస్త్రవేత్తలు రూపొందించారు. కరోనా పాజిటివ్‌ వచ్చిన వ్యక్తికి కనీసం 102 రోజుల్లోపు మళ్లీ పాజిటివ్‌ రావడం సహా మధ్యలో ఒకసారి నెగెటివ్‌ వస్తేనే దాన్ని రీ-ఇన్‌ఫెక్షన్‌గా పరిగణించాలని స్పష్టం చేశారు.

కేంబ్రిజ్డ్ జర్నల్​లో అధ్యయనం

భారత్‌తో పాటు ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్‌ ఉద్ధృతి పెరుగుతున్న నేపథ్యంలో రీ-ఇన్‌ఫెక్షన్‌ కేసులు బయటపడుతుండడం శాస్త్రవేత్తల్లో ఆందోళనకు కారణమవుతోంది. ఇటు భారత్‌లోనూ కొవిడ్‌-19 రీ-ఇన్‌ఫెక్షన్‌ కేసులు వెలుగు చూస్తున్నాయి. కరోనా వైరస్‌ రీ-ఇన్‌ఫెక్షన్‌కు ఇప్పటి వరకు స్పష్టమైన నిర్వచనం లేకపోవడం వల్ల భారత వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్‌) వీటిపై అధ్యయనం చేపట్టింది. 102 రోజుల వ్యవధిలో రెండోసారి పాజిటివ్‌ రావడం సహా మధ్యలో ఓసారి నెగెటివ్‌ వస్తేనే దాన్ని రీ-ఇన్‌ఫెక్షన్‌గా పరిగణించాలని పేర్కొంది. అంతేకాకుండా కరోనా రీ-ఇన్‌ఫెక్షన్‌ను నిర్ధరించాలంటే జన్యుక్రమాన్ని‌ అధ్యయనం చేయడం అవసరమని ఐసీఎంఆర్‌ స్పష్టం చేసింది. ఈ అధ్యయనానికి సంబంధించిన నివేదిక కేంబ్రిడ్జ్‌కు చెందిన ఎపిడమాలజీ అండ్‌ ఇన్‌ఫెక్షన్‌ జర్నల్‌లో ప్రచురితమైంది.

ఇదీ చదవండి:కరోనా కల్లోలం- భారత్​లో ఒక్కరోజే 72 వేల కేసులు

ఐసీఎంఆర్‌ శాస్త్రవేత్తలు చేపట్టిన రీ-ఇన్‌ఫెక్షన్‌ అధ్యయనంలో భాగంగా 58మంది కొవిడ్‌ రోగులపై పరిశోధన చేపట్టారు. వీరిలో 12మంది ఆరోగ్య కార్యకర్తలున్నారు. అధ్యయనంలో పాల్గొన్న వారికి తొలుత పాజిటివ్‌ వచ్చిన సమయంలో వైరల్‌ లోడ్‌ తీవ్రంగా ఉండి, లక్షణాలు కనిపించని వారే అధిక సంఖ్యలో ఉన్నారు. రెండోసారి వైరస్‌ సోకినపుడు మాత్రం కొందరిలో మాత్రమే వైరస్‌ లక్షణాలు కనిపించినట్లు పరిశోధకులు గుర్తించారు.

ఏకాభిప్రాయం లేదు

ఇప్పటి వరకు కరోనా రీ-ఇన్‌ఫెక్షన్‌పై ప్రపంచవ్యాప్తంగా ఏకాభిప్రాయం లేదని అధ్యయన బృందం పేర్కొంది. అమెరికా వ్యాధుల నియంత్రణ నిర్మూలన కేంద్రం(సీడీసీ) ప్రకారం, ఓ వ్యక్తికి 90 రోజుల అనంతరం మళ్లీ పాజిటివ్‌ వస్తే, జీనోమ్‌ సీక్వెన్స్‌ ద్వారా రీ-ఇన్‌ఫెక్షన్‌ను నిర్ధరించాలని సూచిస్తోంది. తాజాగా చేపట్టిన అధ్యయనంలో ఐసీఎంఆర్‌ ఆ వ్యవధి కనీసం 102రోజులుగా ఉండాలని పేర్కొంది. ఇలా వీటిని నిర్ధరించుకునేందుకు పాజిటివ్‌ వచ్చిన వారి నమూనాలను లక్షల సంఖ్యలో సేకరించి నిల్వ చేసుకోవడం సాధ్యమయ్యే పని కాదని అధ్యయనం బృందం అభిప్రాయపడింది. అయితే, వైరస్‌ ప్రమాదం పొంచివున్న పాజిటివ్‌ వచ్చిన వైద్య ఆరోగ్య సిబ్బంది నమూనాలను తదుపరి పరీక్షల కోసం(రీ-ఇన్‌ఫెక్షన్‌) భద్రపరచుకోవచ్చని ఐసీఎంఆర్‌ నివేదిక సూచించింది.

వృద్ధులకు ముప్పు!

కొవిడ్‌ రీ-ఇన్‌ఫెక్షన్‌ అరుదుగా సంభవిస్తుందని.. వృద్ధులు మాత్రం రీ-ఇన్‌ఫెక్షన్‌ బారినపడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని ప్రముఖ అంతర్జాతీయ జర్నల్‌ 'ది లాన్సెట్‌' నివేదిక ఈమధ్యే వెల్లడించింది. ఈ నేపథ్యంలో సార్స్‌-కోవ్‌-2 రీ-ఇన్‌ఫెక్షన్‌ అత్యంత అరుదైన విషయం అయినప్పటికీ, వైరస్‌ పర్యవేక్షణ వ్యవస్థలను రూపొందించుకోవడంలో రీ-ఇన్‌ఫెక్షన్‌ నిర్వచనం ఎంతో అవసరమని ఐసీఎంఆర్‌ శాస్త్రవేత్తలు అభిప్రాయపడ్డారు. అందుకే కరోనా పాజిటివ్‌ వచ్చిన వారు కూడా మరోసారి వైరస్‌ బారినపడకుండా తగు జాగ్రత్తలు తీసుకోవడమే మేలని సూచిస్తున్నారు. వైరస్ నుంచి కోలుకున్నవారు వ్యక్తిగత శుభ్రత పాటించడం, మాస్కులు ధరించడం మరిచిపోవద్దని సూచించారు.

ఇదీ చదవండి:ఇక సెలవు రోజుల్లోనూ టీకా పంపిణీ

ABOUT THE AUTHOR

...view details