తెలంగాణ

telangana

By

Published : Jul 30, 2020, 7:16 AM IST

ETV Bharat / bharat

ఆర్టికల్ 370 రద్దుతో ఉగ్రవాదానికి కళ్లెం

జమ్ము-కశ్మీర్‌లో సానుకూల పవనాలు వీస్తున్నాయి. అధికరణం 370 రద్దు తర్వాత కశ్మీర్​లో హింసాత్మక ఘటనలు తగ్గుముఖం పట్టినట్లు తెలుస్తోంది. ఉగ్రవాదుల్లో యువత చేరడం 40 శాతం మేర తగ్గింది. ఆగస్టు 5 నాటికి ఈ అధికరణం రద్దుకు ఏడాది నిండుతుంది. ఈ నేపథ్యంలో తొలి వార్షికోత్సవాన్ని ఘనంగా జరిపేందుకు కేంద్రం సన్నద్ధమవుతోంది.

article 370 abolition
ఆర్టికల్ 370 రద్దు

జమ్మూ-కశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తిని రద్దుచేశాక కేంద్ర ప్రభుత్వం చేపట్టిన చర్యలపై మిశ్రమ స్పందన వ్యక్తమవుతోంది. చారిత్రక తప్పిదాన్ని సరిచేశామని చెప్పిన కేంద్రం- ఆగస్టు 5న తొలి వార్షికోత్సవాన్ని ఘనంగా జరిపేందుకు రంగం సిద్ధం చేస్తోంది. 370 అధికరణ రద్దు తర్వాత తీసుకున్న కీలక నిర్ణయాలు, అవి వివిధ రంగాలపై చూపించనున్న ప్రభావం తీరుతెన్నులు..

పరిశ్రమల కోసం భూమి బ్యాంకులు

జమ్ము-కశ్మీర్‌కు పెట్టుబడులను ఆకట్టుకునేందుకు ప్రభుత్వం ‘భూమి బ్యాంకు’లను ఏర్పాటు చేసింది. దానిపై భిన్నరకాలుగా ప్రచారం జరిగినా, జమ్ము-కశ్మీర్‌కు ప్రపంచవ్యాప్త పెట్టుబడులను ఆకర్షించేందుకు మార్చిలో నిర్వహించబోయే సదస్సును దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది. ఇప్పటివరకు 624 ఎకరాల భూముల్ని గుర్తించారు. పారిశ్రామిక కార్యకలాపాలను పెంచి, ఉపాధి అవకాశాలు మెరుగుపరచడమే దీని ఉద్దేశమని అధికారులు చెబుతున్నారు. పెట్టుబడుల సదస్సు జరిగేలోగా కొన్ని సంస్కరణలను తీసుకువచ్చి, మరింత భూముల్ని గుర్తించనున్నారు. పారిశ్రామిక వాడల్ని నిర్మించనున్నారు.

స్థానికత చట్టంలో మార్పులు

జమ్ము-కశ్మీర్‌ కోసం కేంద్రం ఈ ఏడాది మార్చి 31న ‘స్థానికత చట్టం’ తీసుకువచ్చింది. దీనికింద స్థానికత నిర్వచనాన్ని మార్చి, దేశంలో అర్హులైనవారెవరైనా జమ్ము-కశ్మీర్‌లో ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించింది. 370 అధికరణ అమల్లో ఉన్నప్పుడు దానికి ఆస్కారం లేదు. గత ఆగస్టులో రద్దు చేయని మరికొన్ని చట్టాలను కూడా రద్దు చేసింది. ఇప్పుడు కొన్ని షరతులకు లోబడి ఇతర ప్రాంతాల వారు సైతం స్థానికులుగా గుర్తింపు తీసుకోవచ్చు.

సైనిక దళాలకు వ్యూహాత్మక ప్రాంతాలు

జమ్ము-కశ్మీర్‌లో కొన్ని ప్రాంతాలను సైనిక దళాలకు వ్యూహాత్మక ప్రదేశాలుగా గుర్తించాలని ప్రభుత్వం ఈ నెల 17న నిర్ణయించింది. తద్వారా సైనిక అవసరాలకు నిర్మాణాలు చేపట్టుకునే వీలు కల్పించింది. సైన్యం ఎక్కడ స్థిరాస్తిని కొనాలన్నా నిరభ్యంతర ధ్రువీకరణ పత్రాన్ని హోంశాఖ నుంచి పొందాలనే నిబంధనను తొలగించింది. దీనిపై పలు పార్టీలు అభ్యంతరాలు వ్యక్తం చేసినా, దేశ భద్రత కోణంలోనే ఈ నిర్ణయాలు తీసుకున్నట్లు ప్రభుత్వం సమర్థించుకుంది.

తగ్గిన ఉగ్రవాదం

జమ్ము-కశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పిస్తూ వచ్చిన 370వ అధికరణాన్ని రద్దు చేసిన తర్వాత అక్కడి యువత ఉగ్రవాదం వైపు వెళ్లడం 40 శాతానికి పైగా తగ్గిందని అధికారిక గణాంకాలు వెల్లడిస్తున్నాయి. గత ఏడాది ఆగస్టు 5న ఈ అధికరణం రద్దయిన విషయం తెలిసిందే. ఆ రోజే రాష్ట్రాన్ని రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా విభజించారు. గత ఏడాది జనవరి 1 నుంచి జులై 15 వరకు 105 మంది యువత కొత్తగా ఉగ్రవాదంలో చేరితే ఈ ఏడాది అదే వ్యవధిలో 67 మంది చేరారు. ఇదే వ్యవధిలో ఉగ్రవాద ఘటనలు 188 నుంచి 120కి తగ్గాయి. నియంత్రణ రేఖ వెంబడి చొరబాటు ప్రయత్నాలనైతే పాక్‌ గడ్డనుంచి ఉగ్రవాదులు కొనసాగిస్తున్నా ఇతరత్రా కోణాల్లో మాత్రం సానుకూల పవనాలు వీచినట్లేనని కేంద్రం వద్దనున్న సమాచారం చెబుతోంది. కరోనాకు కళ్లెం వేయడానికి విధించిన లాక్‌డౌన్‌ ఆంక్షలూ దీనికి కొంత దోహదపడ్డాయని చెప్పాలి.

  • గత ఏడాది మొదటి ఏడు నెలల్లో 126 మంది ఉగ్రవాదుల్ని భద్రత బలగాలు హతమారిస్తే ఈ ఏడాది ఇంతవరకు 26 మంది పాకిస్థానీలు సహా 136 మందిని మట్టుబెట్టగలిగాయి. జమ్ము-కశ్మీర్‌లో బలంగా ఉన్న హిజ్‌బుల్‌ ముజాహిదీన్‌కు చెందినవారే 50 మంది దీనిలో ఉన్నారు. దాని కమాండర్‌ రియాద్‌ నైకూ, లష్కరే కమాండర్‌ హైదర్‌, జైషే కమాండర్‌ యాసిర్‌ వంటి కీలక ఉగ్రవాదులను భద్రత బలగాలు అంతం చేయగలిగాయి.
  • సరిహద్దు పరిరక్షణ, ఉగ్రవాద నిర్మూలన చర్యల్లో జనవరి-జులై మధ్య గత ఏడాది 75 మంది భద్రత బలగాలు ప్రాణాలు కోల్పోయాయి. ఈ ఏడాది ప్రాణనష్టం 35కి పరిమితమయింది.
  • విధ్వంసకర పేలుళ్లు, గ్రెనేడ్‌ దాడుల పరంగానూ పరిస్థితి మెరుగుపడింది. వివిధ ఘటనల్లో ప్రాణాలు కోల్పోయిన స్థానిక పౌరుల సంఖ్య మాత్రం గత ఏడాది, ఈ ఏడాది దాదాపు ఒకేలా ఉన్నాయి. ఇదే సమయంలో కశ్మీర్‌ వేర్పాటువాద గ్రూపు హురియత్‌ కాన్ఫరెన్స్‌ నేత సయ్యద్‌ ఆలీషా జిలానీ ఆ సంస్థకు దూరమవుతున్నట్లు ప్రకటించడం కూడా ఈ ఏడాది చెప్పుకోదగ్గ పరిణామమని హోంశాఖ పేర్కొంది.

ఇదీ చదవండి:అయోధ్య శోభాయమానం- భూమిపూజకు ముస్తాబు

ABOUT THE AUTHOR

...view details