తెలంగాణ

telangana

ఆర్టీఐ పరిధిలోకి సీజేఐ కార్యాలయం- సుప్రీం సంచలన తీర్పు

By

Published : Nov 13, 2019, 4:58 PM IST

Updated : Nov 13, 2019, 7:43 PM IST

సుప్రీం కోర్టు మరో చారిత్రక తీర్పు వెలువరించింది. భారత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) కార్యాలయం... సమాచార హక్కు చట్టం (ఆర్‌టీఐ) పరిధిలోకే వస్తుందని స్పష్టం చేసింది. ఈ వ్యవహారంలో 2010 జనవరిలో దిల్లీ హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీం కోర్టు ధర్మాసనం సమర్థించింది.

ఆర్టీఐ పరిధిలోకి సీజేఐ కార్యాలయం- సుప్రీం సంచలన తీర్పు

ఆర్టీఐ పరిధిలోకి సీజేఐ కార్యాలయం- సుప్రీం సంచలన తీర్పు

ఇటీవల అయోధ్య భూవివాదంపై కీలక తీర్పు ఇచ్చిన సుప్రీం కోర్టు మరో సంచలన నిర్ణయం తీసుకొంది. సీజేఐ కార్యాలయానికి సంబంధించిన కేసులో కీలక ఉత్తర్వులు జారీ చేసింది. భారత ప్రధాన న్యాయమూర్తి కార్యాలయం.. సమాచార హక్కు చట్టం పరిధిలోకి వస్తుందని చారిత్రక తీర్పు వెలువరించింది. 2010 జనవరిలో దిల్లీ హైకోర్టు ఈమేరకు ఇచ్చిన తీర్పును.. సుప్రీం ధర్మాసనం సమర్థించింది.
పారదర్శకత అనేది న్యాయస్వేచ్ఛకు విఘాతం కలిగించదని సుప్రీం స్పష్టంచేసింది. గోప్యత హక్కు, సమాచార హక్కు అనేవి కలిసిమెలిసి ఉండాలని కోర్టు అభిప్రాయపడింది. న్యాయవ్యవస్థపై పరిశీలనకు ఆర్టీఐ ఒక సాధనంగా ఉండాలని పేర్కొంది.

భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రంజన్‌ గొగొయి నేతృత్వంలో జస్టిస్‌ ఎన్‌.వి.రమణ, జస్టిస్‌ డి.వై.చంద్రచూడ్‌, జస్టిస్‌ దీపక్‌ గుప్తా, జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నాతో కూడిన రాజ్యాంగ ధర్మాసనం ఈ తీర్పు వెలువరించింది. సీజేఐ, జస్టిస్​ దీపక్​ గుప్తా, జస్టిస్​ సంజీవ్​ ఖన్నా ఒక తీర్పను రాయగా... జస్టిస్​ రమణ, జస్టిస్​ చంద్రచూడ్​ మరో తీర్పు రాశారు. ధర్మాసనంలోని మెజార్టీ న్యాయమూర్తులు దిల్లీ హైకోర్టు తీర్పునే సమర్థించారు.

నిఘా అస్త్రం కాకూడదు...

అయితే... ఆర్టీఐని నిఘా అస్త్రంగా వాడరాదని, న్యాయవ్యవస్థ స్వతంత్రను దృష్టిలో ఉంచుకుని వినియోగించాలని ధర్మాసనం సూచించింది. కొలీజియం ప్రతిపాదించిన న్యాయమూర్తుల పేర్లను మాత్రమే ఆర్టీఐ కింద ఇవ్వడం జరుగుతుందని, అందుకు గల కారణాలను మాత్రం వెల్లడించేది లేదని ధర్మాసనం స్పష్టం చేసింది.

ఆర్‌టీఐ కార్యకర్త దాఖలు చేసిన పిటిషన్‌పై దిల్లీ హైకోర్టు తీర్పు వెలువరించగా.. దాన్ని సవాలు చేస్తూ సుప్రీంకోర్టు సెక్రటరీ జనరల్‌, కోర్టుకు చెందిన కేంద్ర ప్రజా సమాచార అధికారి సర్వోన్నత న్యాయస్థానంలో పిటిషన్లు దాఖలు చేశారు. వాటిని విచారించిన న్యాయస్థానం ఈ ఏడాది ఏప్రిల్‌ 4న తీర్పును రిజర్వులో ఉంచింది. నేడు తీర్పు వెలువరించింది.

Last Updated : Nov 13, 2019, 7:43 PM IST

ABOUT THE AUTHOR

...view details