తెలంగాణ

telangana

ETV Bharat / bharat

మోదీ వివాహ బంధంపై మాయ తీవ్ర వ్యాఖ్యలు

ప్రధాని నరేంద్ర మోదీపై వ్యక్తిగత విమర్శలకు దిగారు బహుజన్​ సమాజ్​ పార్టీ అధినేత్రి మాయావతి. మోదీ తన భార్యను స్వార్థ రాజకీయాల కోసం వదిలేశారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అలాంటి వ్యక్తికి ఓటేయకూడదని దేశ మహిళలకు విజ్ఞప్తి చేశారు మాయావతి. ఈ వ్యాఖ్యలపై కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్​ జైట్లీ ప్రతిస్పందిస్తూ మాయావతి రాజకీయాలకు పనికిరారని దుయ్యబట్టారు.

By

Published : May 13, 2019, 5:34 PM IST

Updated : May 13, 2019, 5:58 PM IST

మోదీ వివాహ బంధంపై మాయ తీవ్ర వ్యాఖ్యలు

బహుజన్​ సమాజ్​ పార్టీ అధినేత్రి మాయావతి ప్రధాని నరేంద్ర మోదీని ఉద్దేశించి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. రాజస్థాన్​ ఆల్వార్​ సామూహిక అత్యాచారం కేసుపై మోదీ ఆరోపణలను తిప్పికొడుతూ... తీవ్ర విమర్శలు చేశారు. అత్యాచారం కేసుపైనా మోదీ రాజకీయాలు చేస్తున్నారని లఖ్​నవూలో మండిపడ్డారు మాయావతి.

మోదీ వివాహ బంధంపై మాయ తీవ్ర వ్యాఖ్యలు

"తన (మోదీ) స్వార్థ రాజకీయాల కోసం సొంత భార్యనే వదిలేశారు. అంతేకాదు నాకు మరో విషయం తెలిసింది. భాజపాలోని మహిళా నేతలు తమ భర్తలు మోదీని కలిస్తే ఆందోళన చెందుతున్నారు. తనలానే.. భార్యను వదిలేయమని మోదీ వాళ్లకు చెబుతారేమోనని భయపడుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో దేశంలోని మహిళలకు నా విజ్ఞప్తి ఒకటే. ఇలాంటి వ్యక్తికి మీరు ఓటు వేయకండి. ఇదే ఆయన వదిలేసిన భార్యకు నిజమైన గౌరవం కూడా."
- మాయావతి, బీఎస్పీ అధినేత్రి

ఆల్వార్​ అత్యాచారం కేసులో కాంగ్రెస్​ ప్రభుత్వం సరైన చర్యలు తీసుకోకపోతే మద్దతు ఉపసంహరించుకుంటామని తేల్చిచెప్పారు మాయ.

'ఆమె రాజకీయాలకు పనికిరారు'

ప్రధానిపై మాయావతి వ్యక్తిగత విమర్శలకు దిగడంపై కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్​ జైట్లీ మండిపడ్డారు.

"సోదరి మాయావతికి ప్రధాన మంత్రి కావాలని కల. ఆమె పరిపాలన, విలువలు అత్యంత నీచ స్థితికి చేరాయి. ఈ రోజు ప్రధానిపై ఆమె చేసిన వ్యాఖ్యలతో మాయావతి రాజకీయాలకు పనికిరారని తేలిపోయింది."
- అరుణ్​ జైట్లీ, కేంద్ర ఆర్థిక మంత్రి

Last Updated : May 13, 2019, 5:58 PM IST

ABOUT THE AUTHOR

...view details