తెలంగాణ

telangana

ETV Bharat / bharat

కర్​నాటకం: ముంబయి రిసార్టులో ఎమ్మెల్యేలు

ఎమ్మెల్యేల రాజీనామాతో కర్ణాటకలో రాజకీయాలు క్షణక్షణానికి ఉత్కంఠ రేపుతున్నాయి. రాజీనామా చేసిన వారిలో 10 మంది ఎమ్మెల్యేలు ముంబయికి చేరారు. విపత్కర పరిస్థితుల నేపథ్యంలో కాంగ్రెస్ కీలక నేతలు బెంగళూరుకు చేరుకుంటున్నారు.

By

Published : Jul 6, 2019, 10:43 PM IST

ముంబయి చేరిన ఎమ్మెల్యేలు

కర్ణాటక రాజకీయాలు క్షణక్షణానికి ఆసక్తికరంగా మారుతున్నాయి. రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా గోవా వెళ్లాలని నిశ్చయించుకున్న 10 మంది ఎమ్మెల్యేలు అనూహ్యంగా రూటు మార్చి ముంబయిలోని ఓ హోటల్​కు చేరుకున్నారు. బెంగళూరులోని హెచ్​ఏఎల్​ విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో ముంబయి చేరారు. రాజీనామా చేసిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు రామలింగారెడ్డి, ఎస్టీ సోమశేఖర్​, మునిరత్న బెంగళూరులోనే ఉండిపోయారు.

సిద్ధరామయ్య నివాసంలో సమావేశం

ఎమ్మెల్యేల రాజీనామా నేపథ్యంలో కాంగ్రెస్ కర్ణాటక వ్యవహారాల ఇన్​ఛార్జి కేసీ వేణుగోపాల్ సీఎల్పీ నేత సిద్ధరామయ్య ఇంటికి ​ చేరుకున్నారు. అక్కడ కేపీసీసీ కార్యనిర్వహక అధ్యక్షుడు ఈశ్వర్​ ఖంద్రె, మంత్రులు డీకే శివకుమార్​, డీకే సురేశ్​ భేటీ అయ్యారు. తాజా పరిణామాలపై చర్చించారు.

ఎమ్మెల్యేలపై నమ్మకం ఉంది: ఖర్గే

రాజీనామా చేసిన ఎమ్మెల్యేలపై నమ్మకం ఉందని కాంగ్రెస్ సీనియర్​ నేత మల్లికార్జున ఖర్గే విశ్వాసం వ్యక్తం చేశారు. వాళ్లందరూ ఎన్నో ఏళ్లుగా పార్టీలో ఉన్నారనీ, మనసు మార్చుకుని మళ్లీ మద్దతిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు.

ప్రభుత్వాన్ని కూల్చేందుకు భాజపా యత్నాలు: కాంగ్రెస్

ఎమ్మెల్యేల కొనుగోలు ద్వారా ప్రభుత్వాన్ని కూల్చేందుకు భాజపా యత్నిస్తోందని ఆరోపించింది కాంగ్రెస్. రాజ్యాంగబద్ధంగా ఎన్నికైన ప్రభుత్వాన్ని దించేందుకు యత్నిస్తున్నారని కాంగ్రెస్ అధికార ప్రతినిధి సుర్జేవాలా ఆరోపించారు.

కాంగ్రెస్ కార్యకర్తల నిరసన

బెంగళూరులోని కాంగ్రెస్​ రాష్ట్ర ప్రధాన కార్యాలయం ఎదుట పార్టీ కార్యకర్తలు నిరసన చేపట్టారు. రాజీనామా చేసిన ఎమ్మెల్యేలపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

కర్ణాటక అధికార కూటమికి చెందిన 11 మంది ఎమ్మెల్యేలు నేడు శాసనసభ్యత్వానికి రాజీనామా చేశారు. వీరికి ముందే ఒకరు రాజీనామా చేయగా... వీటన్నింటిపై స్పీకర్​ మంగళవారం నిర్ణయం తీసుకునే అవకాశముంది. 224మంది సభ్యులున్న శాసనసభకు 14 మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేశారు. 12మంది ఎమ్మెల్యేల రాజీనామాలను స్పీకర్ ఆమోదించినా 118 మంది ఎమ్మెల్యేలతో అధికారంలో కాంగ్రెస్​-జేడీఎస్​ కూటమి మెజారిటీ కోల్పోతుంది. భాజపా ప్రభుత్వం ఏర్పాటుకు మార్గం సుగమం అవుతుంది.

ఇదీ చూడండి: 'భాజపా ప్రభుత్వం వస్తే యడ్యూరప్పే సీఎం'

ABOUT THE AUTHOR

...view details