తెలంగాణ

telangana

By

Published : Jan 16, 2020, 4:58 AM IST

ETV Bharat / bharat

'కశ్మీర్​లో 'అంతర్జాల వినియోగం'పై పర్యటకుల భావోద్వేగం'

జాతి వ్యతిరేక కార్యకలాపాలకు ఉగ్రవాదులు, దేశ ద్రోహులు అంతర్జాలాన్ని దుర్వినియోగం చేసే ప్రమాదం ఉన్న కారణంగానే సాధారణ ప్రజలకు ఇంటర్నెట్ సేవలను అందుబాటులోకి తీసుకురాలేదని జమ్ముకశ్మీర్ ప్రభుత్వ యంత్రాంగం స్పష్టం చేసింది. కశ్మీర్​లోని ఐదు జిల్లాల పరిధిలో ఆస్పత్రులు, బ్యాంకులు, హోటళ్లు సహా అత్యవసరమైన సదుపాయాల నిమిత్తం అంతర్జాల సేవలను పునరుద్ధరించినట్లు తెలిపింది. కశ్మీర్​లో పర్యటించిన మలేసియా టూరిస్టులు తొలిసారి అంతర్జాలం ఉపయోగించేందుకు అనుమతించటం వల్ల భావోద్వేగానికి లోనయ్యారు.

J-K cites terror threat to not resume internet in Kashmir Valley
'కశ్మీర్​లో తొలిసారి అంతర్జాల వినియోగంపై పర్యటకుల భావోద్వేగం'

ఉగ్రవాదులు, దేశద్రోహులు అంతర్జాలాన్ని దుర్వినియోగం చేసే అవకాశం ఉన్నందునే జమ్ము కశ్మీర్​లో సాధారణ ప్రజలు, మీడియాకు ఇంటర్నెట్ సేవలను అందుబాటులోకి తీసుకురాలేదని ప్రభుత్వ యంత్రాంగం స్పష్టం చేసింది.

సుప్రీంకోర్టు ఆదేశాల నేపథ్యంలో 2జీ ఇంటర్నెట్ సేవలను పునఃప్రారంభించింది జమ్ముకశ్మీర్​ ప్రభుత్వం. మొత్తం ఐదు జిల్లాల పరిధిలోని ఆస్పత్రులు, బ్యాంకులు, హోటళ్లులకు పోస్ట్ పెయిడ్ సహా బ్రాడ్​ బ్యాండ్ సేవలను పునరుద్ధరిస్తున్నట్లు హోంశాఖ ముఖ్య కార్యదర్శి షాలీనా కాబ్రా ఆదేశాలు జారీ చేశారు. అయితే మొబైల్ ఇంటర్నెట్​ను మాత్రం తిరిగి ప్రారంభించలేదు.

ఎందుకంటే?

అంతర్జాలం ద్వారా ప్రజలకు తప్పుడు వార్తలు పంపించి ఉగ్రవాదంవైపు మొగ్గుచూపేలా ముష్కరులు ప్రయత్నాలు చేస్తున్నారనే సమాచారం అందినట్లు హోంశాఖ ప్రధాన కార్యదర్శి షాలీన్ కాబ్రా తెలిపారు. అంతర్జాలం పునరుద్ధరించడం ద్వారా వేర్పాటువాదులు సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంచుకునే అవకాశం ఉందని వెల్లడించారు. ఈ కారణంగానే కశ్మీర్ డివిజన్​లో మొబైల్ అంతర్జాల సేవలను పునరుద్ధరించలేదని స్పష్టం చేశారు.

పాక్షికంగానే..

మరోవైపు పునరుద్ధరించిన అంతర్జాల సేవలను సైతం పరిమితంగానే అందించాలని ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్లను అధికారులు ఆదేశించారు. పునరుద్ధరించిన ప్రాంతాల్లో అంతర్జాలం దుర్వినియోగం కాకుండా జాగ్రత్త వహించాలని సూచించారు. అయితే సామాజిక మాధ్యమాలపై ఉన్న నిషేధాన్ని కొనసాగిస్తున్నారు.

పర్యటకుల భావోద్వేగం

కశ్మీర్​లో పర్యటిస్తున్న కొందరు మలేసియా దేశీయులు.. చాలా రోజుల తర్వాత ఇంటర్నెట్​ పొందటంపై ఆనందం వ్యక్తం చేశారు. ఈనెల 11న కశ్మీర్​ వచ్చిన వారికి బుధవారం తొలిసారి ఇంటర్నెట్​ పొందేందుకు అనుమతించారు అధికారులు. ఈ క్రమంలో తమవారితో వీడియో కాలింగ్​ చేసి.. తల్లిదండ్రులు, పిల్లలతో నేరుగా మాట్లాడే అవకాశం రావటంపై భావోద్వేగానికి లోనయ్యారు.

ABOUT THE AUTHOR

...view details