తెలంగాణ

telangana

ETV Bharat / bharat

లాక్​డౌన్​ 2.0: నేడు మార్గదర్శకాలు- సడలింపులపై రానున్న స్పష్టత

దేశంలో లాక్​డౌన్​ పొడిగింపునకు సంబంధించి నేడు మార్గదర్శకాలను విడుదల చేయనుంది కేంద్ర ప్రభుత్వం. ఈ సారి పలు రంగాలకు సడలింపులు ఇచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. వ్యవసాయం, మత్స్య పరిశ్రమ, ఫార్మా సంస్థలకు ఆంక్షల నుంచి మినహాయిస్తారని సమాచారం. పలు రాష్ట్రాలు కోరుతున్న నేపథ్యంలో మద్యం దుకాణాలపైనా స్పష్టత వచ్చే అవకాశం ఉంది.

By

Published : Apr 15, 2020, 5:55 AM IST

LOCKDOWN-EXEMPTIONS
లాక్​డౌన్​ 2.0

దేశంలో లాక్​డౌన్​ను మే 3వ తేదీ వరకు పొడిగిస్తూ మోదీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఆంక్షలకు సంబంధించిన మార్గదర్శకాలను నేడు విడుదల చేయనుంది కేంద్రం. వివిధ వర్గాల నుంచి వస్తోన్న అభ్యర్థనల మేరకు పలు రంగాలకు మినహాయింపులు ఇచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది.

ఈ రంగాల్లో సడలింపులు..

లాక్​డౌన్​ 2.0లో వ్యవసాయం, మత్స్య పరిశ్రమ, ఫార్మా సంస్థలకు ఆంక్షల నుంచి మినహాయింపులు ఇచ్చే అవకాశం ఉందని అధికార వర్గాలు తెలిపాయి. అయితే దేశవ్యాప్తంగా వైరస్ ప్రభావిత 370 జిల్లాల్లో పూర్తి స్థాయిలో లాక్​డౌన్ కొనసానే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

వీటితో పాటు జాతీయ, రాష్ట్ర రహదారుల పక్కన ఉండే దాబాలు, వాహన మరమ్మతుల దుకాణాలకు మినహాయింపులు ఉంటాయని సమాచారం. కరోనా కేసులు నమోదు కాని ప్రాంతాల్లో భవన నిర్మాణ పనులు కొనసాగించేందుకు స్థానిక కార్మికులకు అనుమతి ఇచ్చే అవకాశం ఉంది.

మూడు జోన్లు..

ఈ సడలింపులు ఇస్తూనే భౌతిక దూరం పాటించేలా చర్యలు తీసుకుంటామని కేంద్ర హోంశాఖకు చెందిన ఒక అధికారి స్పష్టం చేశారు. కరోనా కేసుల ఆధారంగా దేశాన్ని రెడ్​, ఆరెంజ్, గ్రీన్ జోన్లుగా విభజించి ఆంక్షలు అమలు చేస్తారని తెలిపారు.

కరోనా హాట్​స్పాట్లుగా గుర్తించిన జిల్లాలకు సడలింపులు ఉండవని స్పష్టం చేశారు. జిల్లాలకు సంబంధించి కలెక్టర్లకు కేంద్రం కీలక బాధ్యతలను అప్పగించనుంది. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చర్యలు తీసుకునే అధికారం కలెక్టర్లదేనని హోంశాఖ అధికారి తెలిపారు.

పోలీసుల సమక్షంలోనే..

జిల్లాల మధ్య రాకపోకలు మే 3 వరకు కొనసాగవని మరో అధికారి తెలిపారు. వ్యవసాయ మార్కెట్ల విషయంలో పరిమిత సంఖ్యలో కొనుగోలు దారులకు అవకాశం ఇవ్వనున్నారు. వ్యవసాయ ఉత్పత్తుల అమ్మకాలు పూర్తిగా పోలీసుల పర్యవేక్షణలోనే జరుగుతాయి.

వైరస్ తీవ్రత తక్కువగా ఉన్న ప్రాంతాల్లో ఏప్రిల్​ 20 నుంచి దశలవారీగా అనుమతులు ఇస్తారని ఇప్పటికే అధికారులు స్పష్టం చేశారు. ఈ సడలింపులపై బుధవారం స్పష్టత రానుంది. ఈ మేరకు మార్గదర్శకాలను రూపొందించే పనిలో కేంద్ర హోంశాఖ అధికారులు నిమగ్నమయ్యారు.

మద్యం దుకాణాలపై..

ప్రధాని మోదీతో ఏప్రిల్​ 11న జరిగిన వీడియో కాన్ఫరెన్స్​లో​ ఆదాయాన్ని పెంచుకోవడంలో కీలకమైన మద్యం దుకాణాలు తెరిచేందుకు అనుమతి ఇవ్వాలని పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కోరారు. ఇప్పటికే అసోం, మేఘాలయలో మద్యం దుకాణాల తెరిచారు.

ఈ విషయంలో రాష్ట్రాలే నిర్ణయం తీసుకునేలా మార్గదర్శకాల్లో పేర్కొనే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అబ్కారీ శాఖకు సంబంధించి విధానాన్ని రూపొందించుకునేందుకు రాష్ట్రాలకే అనుమతి ఇచ్చే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.

దేశంలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో తొలుత 21 రోజుల పాటు లాక్​డౌన్​ విధిస్తున్నట్లు మార్చి 24న ప్రధాని నరేంద్రమోదీ ప్రకటించారు. దేశంలో కరోనా కేసుల్లో ఎలాంటి మార్పు లేని కారణంగా మే 3 వరకు పొడిగిస్తున్నట్లు మంగళవారం తెలిపారు.

ఇదీ చూడండి:చాపకింద నీరులా విస్తరిస్తున్న కరోనా - ముంబయి విలవిల

ABOUT THE AUTHOR

...view details