తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ఆరోగ్యంగా ఉండాలంటే లక్ష్మణ రేఖ దాటొద్దు

బొత్తిగా నల్లపూసవైపోయావేం’ అని ఇప్పుడెవర్నీ అనక్కర్లేదు. అందరూ ‘నల్లపూసలే’ మరి. పొరపాటునో, గ్రహపాటునో ‘తెల్లపూస’లవుదామని ఎవరైనా అత్యుత్సాహం ప్రదర్శిస్తే ‘నలుపెక్కిందాకా’ తెగ ఉతుకుతున్నారు, గుంజీలు తీయిస్తున్నారు. ఆఖరుకు రెండు చేతులూ జోడించి దండం పెడుతున్నారు- బాబూ... బయటకు రాకండని!

By

Published : Apr 2, 2020, 8:47 AM IST

donot come out from homes for better health
ఆరోగ్యంగా ఉండాలంటే లక్ష్మణ రేఖ దాటొద్దు

మామూలు రోజుల్లో అయితే ఉగాదితో మొదలై శ్రీరామనవమి దాకా తొమ్మిది రోజులూ ‘శ్రీసీతారాముల కల్యాణము చూతమురారండీ...’ అనే పాటతో ఊరూవాడా మోతెక్కిపోయేవి. ఈసారి అలాలేదు పరిస్థితి. ‘తక్కువేమి మనకు... రాముండొక్కడుండువరకూ...’ అనుకుంటూ ఆ గీతాలను స్మార్ట్‌ ఫోన్లలో వినాల్సి వస్తోంది. కల్యాణం నుంచి పట్టాభిషేకం వరకు కావలసిన అన్ని రకాల పాటలూ ఇంట్లోనే విని ఆనందించాలి. పంచాంగంలో చెప్పినట్లు- శని ప్రభావమేమో!

పద్నాలుగు సంవత్సరాలు వనవాసం రాములవారికైతే, 14 వరకూ గృహవాసం మనకు. అప్పటివరకు ‘ఉత్తినే తిని తొంగుంటే మడిసికీ గొడ్డుకీ తేడా ఏటుంటది...?’. అంచేత ఇంట్లోనే ఉంటూ చేతనైన పనులు చేసేద్దాం. ఎన్నాళ్లుగానో వాయిదాలు వేస్తూవచ్చిన పనులన్నీ, ఇప్పుడు వరసగా ఒక్కటొక్కటిగా కానిచ్చేదాం. ఇళ్ళు, బండ్లు అన్నీ శుభ్రం చేసేసుకుందాం. గదులు, వసారాలు, వరండాలు... సమస్తమూ ఊడ్చిపారేద్దాం. బూజులు, దుమ్మూ ధూళి దులిపేద్దాం. ఇవన్నీ చేసిచూడండి... ఆ ఇంటి ఇల్లాలు ఎంత ఆనందిస్తుందో, మీ పరిసరాలు ఎంత బాగుపడతాయో. కాలక్షేపానికి కాలక్షేపం... ఒంటికీ మంచి వ్యాయామం!

ఈ మాటలు నచ్చకపోతే, పోనీ ప్రతి ఇల్లూ ఓ ‘బిగ్‌బాస్‌ హౌస్‌’ అనుకోండి. స్వార్థమే పరమార్థంగా కేవలం డబ్బు కోసమే జరిగే ఆ బిగ్‌బాస్‌లో ఎవరో ఒక్కరే విజేత. కానీ ప్రేమ, అభిమానం, ఆప్యాయతల మధ్య జరిగే ఈ ఇరవైఒక్క రోజుల బిగ్‌బాస్‌ హౌస్‌లో మనమందరమూ విజేతలమే. మరి విజేతలుగా నిలవాలీ అంటే మనమూ గడపదాటకూడదు. అక్కడేమో, ఒకడిమీద ఒకడు పైచేయి సాధించడం కోసం, ఏ ఒక్కడో గెలవడంకోసం యుద్ధం. ఇక్కడేమో, అందరం కలసిమెలసి ఒక్కటై, కలివిడిగా గెలవడంకోసం తపన.

భద్రాచల రాములవారికి సైతం ఈ సంవత్సరం ఏకాంతంలోనే కల్యాణం, పట్టాభిషేకాలు జరుపుతున్నారు. ఏం చేస్తాం మరి? ‘అనువుగాని చోట అధికులమనరాదు, కొద్దిగుండుటెల్ల కొదువగాదు’ అని అనుకుని ఊరుకోవాలి. నాగాస్త్రం నుంచి అర్జునుణ్ని కాపాడటానికి రథాన్ని శ్రీకృష్ణుడు కొద్దిగా కిందికి తొక్కిపెట్టినట్లు, ఈ మహమ్మారి నుంచి మనల్ని కాపాడటానికి, ప్రధాని, ముఖ్యమంత్రులు కలిసి మనల్ని ఇళ్ళల్లోనే ‘లాక్‌డౌన్‌’ చేశారు. తప్పదు మరి!

రాములోరి పందిళ్లు..

రాములోరి పందిళ్లలో వడపప్పు, పానకాలు అందరికీ పంచినట్లే పులిహోర, దద్దోజనాలతో అన్నదానానికి సిద్ధమవుదాం. ఎవరికీ అని అంటారేమో- మనకోసం నిరంతరం శ్రమిస్తున్న వైద్యులు, వైద్యసిబ్బందికి, పోలీసులకు, పారిశుద్ధ్య కార్మికులకు. కుటుంబాలకు దూరమై, తిండీతిప్పలకు నోచుకోకుండా నిరంతరం కష్టపడుతున్నవారి కోసం ఉడతాభక్తి సాయం చేయడానికి మనమూ ముందుకు రావాలి. అవే మనకు మహా ప్రసాదాలు.

బతుకుతెరువు కోసం సొంత ఊళ్లను వదలి ఊరుకాని ఊరు వచ్చిన ఎందరో వలసకూలీలు, పనివారు, సంచారజీవులు- వీరందరికీ అన్నదానాలు చేద్దాం!

రామాయణం మనకు నేర్పించిందేమిటి? ప్రాణాలకు తెగించి, ప్రజల కోసం కర్తవ్య నిర్వహణ చేస్తున్న ప్రతి ఒక్కరికోసం, ఇళ్ళ దగ్గర వారిరాక కోసం ఆశగా, ఆర్తిగా ఎదురుచూస్తున్న వాళ్ళవాళ్ళ తల్లులు, చెల్లెళ్ళు, అక్కలు, భార్యలూ అందరూ ఊర్మిళల వారసులే. కనుక వారందరి కోసం చేతనైనంత తోడ్పాటునందిద్దాం. ఏ రకంగా వీలైతే ఆ రకంగా- కరోనా యుద్ధరంగంలో నిలబడిన మన తోటివారికి సాయం చేద్దాం. లంకకు వారధి నిర్మించడానికి సాయపడిన ఉడుతను ఆదర్శంగా తీసుకుందాం. రామరాజ్యమంటే ఇదే మరి!

‘అందరికోసం ఒక్కరు నిలచి, ఒక్కరికోసం అందరు కలిసి, ఉపకారమే మన ఊపిరి అయితే, సహకారమే మన వైఖరి అయితే- పేదాగొప్పా భేదమువీడి అందరూ నీదీ నాదని వాదమువీడి ఉందురు’. ఇంట్లో నుంచి అనవసరంగా కాలు బయటకు పెట్టకపోతే, ఎండలో పడి ఉద్యోగ ధర్మం నిర్వర్తిస్తున్నవారి నెత్తిన మనం పాలుపోసినట్లే! అందుకే ప్రధాని మోదీ మనందరినీ లక్ష్మణరేఖల్ని గీసుకోమన్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ చెప్పినట్లు- కరోనాకు స్వాభిమానం, స్వాతిశయం ఎక్కువ. మనం పిలిస్తే తప్ప, దానంతట అది రాదు. కాబట్టి లక్ష్మణరేఖల్ని మనం దాటవద్దు.

‘బతికుంటే బలుసాకు తిని బతకొచ్చు’. ఆరోగ్యంగా ఉంటే వచ్చే నవమినాటికి భద్రాచలం వెళ్ళి మరీ కల్యాణంలో పాల్గొందాం. ముత్యాల తలంబ్రాలు స్వీకరిద్దాం. ప్రస్తుతానికి మాత్రం ‘రాముడిలాంటి రాజు ఉంటే, హనుమంతుడి లాంటి బంటూ ఉంటాడన్నట్లు- మనమందరం రాబంటు లాంటి నికార్సయిన పౌరులమనిపించుకుందాం!

-ఎమ్‌.ఎస్‌.ఆర్‌.ఎ.శ్రీహరి

ABOUT THE AUTHOR

...view details