తెలంగాణ

telangana

ETV Bharat / bharat

దిల్లీ దంగల్​: సోషల్​ మీడియానే రణక్షేత్రం

దిల్లీలో ఆమ్​ ఆద్మీ ప్రభుత్వాన్ని పడగొట్టడమే ధ్యేయంగా పనిచేస్తున్నాయి కాంగ్రెస్​, భాజపా. ఈసారి ఎలాగైనా దిల్లీ పీఠాన్ని దక్కించుకోవాలని శత విధాల ప్రయత్నిస్తున్నాయి. ఈ లక్ష్యసాధనలో ప్రధాన అడ్డుగా ఉన్న ముఖ్యమంత్రి అరవింద్​ కేజ్రీవాల్​పై విమర్శల బాణాలు ఎక్కుపెడుతున్నాయి. అందుకోసం ట్విట్టర్​నే ప్రధానాస్త్రంగా వినియోగించుకుంటున్నాయి.

By

Published : Feb 4, 2020, 12:32 PM IST

Updated : Feb 29, 2020, 3:18 AM IST

delhi-polls-social-media-battle-hots-up-as-bjp-cong-try-to-breach-kejri-wall
దిల్లీ దంగల్​: సోషల్​ మీడియానే రణక్షేత్రం

దిల్లీ దంగల్​కు ఎంతో సమయం లేదు. ఈ నెల 8నే 70 శాసనసభ స్థానాలకు ఎన్నికలు. మరోసారి హస్తినలో అధికారం చేజిక్కించుకోవాలని ఊవిళ్లూరుతున్న ఆమ్ ​ఆద్మీ అధినేత, దిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్​కు గట్టి సవాల్​ విసురుతున్నాయి భాజపా, కాంగ్రెస్. ఇందుకోసం ఆ పార్టీలు ఎంచుకుంటున్న ప్రధానాస్త్రం సోషల్​ మీడియానే.

హస్తిన పీఠం కోసం సామాజిక మాధ్యమాల వేదికగా రాజకీయ నేతల మధ్య ట్వీట్ల యుద్ధమే నడుస్తోంది. హ్యాష్​ట్యాగ్​లు, మీమ్స్​, పేరడీలే వారి ప్రధాన ఆయుధాలు. ఇవే ఓట్లు తెచ్చిపెడతాయని వారి విశ్వాసం. ఈ ట్వీట్​ ఫైట్...​ దిల్లీ ఎన్నికల వేడిని మరింత పెంచుతోంది.

ఇటీవలి రాష్ట్ర శాసనసభ ఎన్నికల్లో డీలాపడ్డ కాషాయ పార్టీ... దిల్లీ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. క్రితం సారి ఎన్నికల్లో ఖాతా తెరవలేకపోయిన హస్తం పార్టీ పుంజుకోవాలని భావిస్తోంది. ఇదే తడవుగా అన్ని విధాలా రాజధాని ప్రజలకు దగ్గరయ్యే ప్రయత్నం చేస్తున్నాయి రెండు పార్టీలు.

షా నేతృత్వంలో...

దిల్లీలో విస్తృతంగా ర్యాలీలు నిర్వహిస్తున్న కేంద్ర హోం మంత్రి అమిత్​ షా ట్విట్టర్​ వేదికగా ఆప్​ సర్కార్​ వైఫల్యాల్ని ఎత్తిచూపుతున్నారు. అయితే.. అంతే దీటుగా బదులిస్తున్నారు చీపురు గుర్తు పార్టీ నేత కేజ్రీవాల్​.

దిల్లీ సర్కార్​ ఉచిత వైఫై పథకంపై కేజ్రీవాల్​ను ట్విట్టర్లో ప్రశ్నించారు అమిత్​ షా.

'' కేజ్రీవాల్​ జీ.. దిల్లీ అంతా ఉచిత వైఫై అని ప్రకటించారు కదా! నేను మార్గమధ్యంలో వైఫై కోసం ప్రయత్నించా. నా బ్యాటరీ అయిపోయింది కానీ.. వైఫై మాత్రంరాలేదు.''

- ట్విట్టర్​లో అమిత్​ షా

అయితే.. షా ట్వీట్​కు తనదైన రీతిలో సమాధానమిచ్చారు ఆప్​ అధినేత.

''సర్​, మేం ఉచిత వైఫై సేవలతో పాటు.. ఉచిత బ్యాటరీ ఛార్జింగ్​ సదుపాయాన్నీ కల్పించాం. దిల్లీలో 200 యూనిట్ల వరకు విద్యుత్తూ ఉచితమే..!''

- అరవింద్​ కేజ్రీవాల్​, ఆప్​ అధినేత

ఇవే కాదు.. దిల్లీలో పాఠశాలలు, సీసీటీవీల ఏర్పాటు, మ్యానిఫెస్టోలోని వాగ్దానాలు నెరవేర్చడం వంటివాటిపై కేజ్రీవాల్​ను ప్రశ్నిస్తూ... అమిత్​ షా సహా ఇతర కేంద్ర మంత్రులూ ట్వీట్ల వర్షం కురిపిస్తున్నారు.

ఈ సోషల్​ మీడియా రేసులో కాస్త వెనుకే ఉన్న కాంగ్రెస్ నేతలు​ కూడా అడపాదడపా.. కేజ్రీనే టార్గెట్​ చేస్తున్నారు. ఆప్​ వైఫల్యాల్ని ప్రస్తావిస్తూ పోస్టులు పెడుతున్నారు.

ఇదే ప్రధానం...

సోషల్​ మీడియా యుద్ధం అంటే పేరడీలు, ప్రకటనలు, వీడియోలు మాత్రమే కాదు. హ్యాష్​ట్యాగ్స్​, మీమ్స్​ కూడా ఈ మూడు పార్టీల ఐటీ విభాగ దళాలకు ఎంతో ప్రధానం.

ఎన్నికల కోసం ప్రజలందరికీ సుపరిచితమైన సోషల్​ మీడియా స్ట్రాటజీ ఎంతో ముఖ్యమని అంటున్నారు ఆప్​ సామాజిక మాధ్యమ వ్యూహకర్త అంకిత్​ లాల్​.

'' ముఖ్యంగా పట్టణ నియోజకవర్గమైన దిల్లీ లాంటి నగరాల్లో.. సోషల్​ మీడియా వ్యూహం ఎంతో అవసరం. ప్రజల ఆశీర్వాదాలతో ఈ ప్రచారంలో మేమే ముందున్నాం. సోషల్​ మీడియాలో ఆప్​ తరఫున ప్రచారం కోసం 200 మంది కీలక సభ్యులు పనిచేస్తున్నారు."

- అంకిత్​ లాల్​, ఆప్​ సోషల్​ మీడియా విభాగ వ్యూహకర్త

ప్రజాక్షేత్రంలో కాదు నెట్టింట్లోనే...

ప్రస్తుత రోజుల్లో ఎన్నికల ప్రచారం ప్రజల్లో నేరుగా కాకుండా... సామాజిక మాధ్యమాల్లోనే జోరుగా సాగుతోందని విశ్లేషించారు దిల్లీ కాంగ్రెస్​ సోషల్​ మీడియా విభాగ బాధ్యులు సరళ్​ పటేల్​.

'' సామాజిక మాధ్యమాల ద్వారా జరిగే ప్రచారమే పార్టీలకు ఎంతో ముఖ్యం. ఇదివరకు రెండో ప్రాధాన్యంగా ఉన్న ఈ తరహా ప్రచారం.. ఇప్పుడు ప్రాథమికంగా మారింది.''

- సరళ్​ పటేల్​, దిల్లీ కాంగ్రెస్​ సోషల్​ మీడియా విభాగ బాధ్యులు

ఫిబ్రవరి 8న పోలింగ్​...

గత ఎన్నికల్లో కేజ్రీవాల్​ నేతృత్వంలోని ఆమ్​ ఆద్మీ పార్టీ దిల్లీలోని 70 శాసనసభ నియోజకవర్గాలకు గానూ 67 స్థానాల్లో విజయకేతనం ఎగురవేసింది. భాజపా 3 చోట్ల నెగ్గగా.. కాంగ్రెస్​ ఖాతా తెరవలేకపోయింది.

దిల్లీలో ఫిబ్రవరి 8న ఎన్నికలు జరగనున్నాయి. 11న ఫలితాలు ప్రకటించనున్నారు.

Last Updated : Feb 29, 2020, 3:18 AM IST

ABOUT THE AUTHOR

...view details