తెలంగాణ

telangana

By

Published : Apr 4, 2020, 5:58 PM IST

ETV Bharat / bharat

ఒక్కరోజులో 601మందికి కరోనా.. 12మంది మృతి

కరోనా వైరస్ దేశంలో అంతకంతకూ విస్తరిస్తోంది. ఒక్కరోజులోనే 601మందికి వైరస్ సోకినట్లు వెల్లడించింది కేంద్ర ఆరోగ్య శాఖ. 24 గంటల్లో 12మంది మృతి చెందినట్లు స్పష్టం చేసింది. ఇప్పటివరకు 2902మంది వైరస్ బారిన పడ్డారని తెలిపింది. 183మందికి వ్యాధి నయమైందని.. ప్రస్తుతం దేశంలో 2650 యాక్టివ్ కేసులు ఉన్నట్లు చెప్పింది.

corona
దేశవ్యాప్తంగా కరోనా విజృంభణ

ఒక్కరోజులో 601 వైరస్ కేసులు నమోదయ్యాయని తెలిపింది కేంద్ర ఆరోగ్య శాఖ. శుక్రవారం నుంచి 12మంది కరోనా కారణంగా ప్రాణాలు కోల్పోయారని చెప్పింది. మొత్తంగా మరణాల సంఖ్య 68కి పెరిగిందని స్పష్టం చేసింది. దేశంలో ప్రస్తుతం 2650 యాక్టివ్ కేసులు ఉన్నట్లు స్పష్టం చేసింది. మొత్తం కేసులు 2902గా నమోదయ్యాయని పేర్కొంది. కేరళ, మధ్యప్రదేశ్​, దిల్లీకి చెందిన 58 మంది వైరస్ బాధితుల ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా ఉందని ప్రకటించింది.

ఒక్కరోజులో 601మందికి కరోనా.. 12మంది మృతి

ఆ వయస్సువారే అధికం..

ఎక్కువగా 41 నుంచి 60 ఏళ్ల మధ్య వయస్సువారే వైరస్ బారినపడ్డారని గణాంకాలు వెల్లడిస్తున్నాయి. మొత్తం కేసుల్లో ఈ వయస్సువారు 33 శాతం. 9 శాతంమంది 20 ఏళ్ల లోపు ఉన్నవారిలో నమోదుకాగా.. 42 శాతం కేసులు 21 నుంచి 40 ఏళ్ల మధ్య ఉన్నాయి. 17 శాతం కేసులు 61 ఏళ్లు పై వయస్సువారిలో నమోదైనట్లు పేర్కొంది కేంద్ర ఆరోగ్య శాఖ. అయితే మిగతా దేశాలతో పోల్చితే వైరస్ పెరుగుదల రేటు భారత్​లో తక్కువగా నమోదవుతోందని స్పష్టం చేసింది.

పరీక్షాకేంద్రాల సామర్థ్యం పెంపు..

పరీక్షాకేంద్రాల సామర్థ్యాన్ని క్రమంగా పెంచుతున్నట్లు వెల్లడించింది ఆరోగ్య శాఖ. వైరస్​కు భయపడాల్సిందేమీ లేదని.. కానీ ప్రజల్లో అవగాహన పెంచాల్సిన అవసరం ఉందన్నారు. కరోనా కోసం 24 గంటల కంట్రోల్ రూమ్​ సేవలందిస్తోందని తెలిపింది.

మధ్యప్రదేశ్​లో ఇద్దరి మృతి..

మధ్యప్రదేశ్​లో వైరస్ కారణంగా నేడు ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. ఒకరు చింద్వాడాకు చెందిన ప్రభుత్వ ఉద్యోగి. మరొకరు ఇండోర్​కు చెందిన వ్యక్తి. మొత్తంగా రాష్ట్రంలో మరణాల సంఖ్య పదికి చేరుకుంది.

మహారాష్ట్రలో..

మహారాష్ట్రలో కేసుల సంఖ్య 537కు పెరిగిందని సమాచారం. 50మందికి వైరస్ నయమైంది.

కర్ణాటకలో..

కర్ణాటకలో తాజాగా 16 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మొత్తంగా బాధితుల సంఖ్య 144కు చేరింది. వైరస్ కారణంగా ఇప్పటివరకు నలుగురు ప్రాణాలు కోల్పోయారు. పదకొండుమందికి వ్యాధి నయమైంది.

ఇదీ చూడండి:'30 శాతం కేసులకు తబ్లీగీనే కారణం.. 17 రాష్ట్రాల్లో ప్రభావం'

ABOUT THE AUTHOR

...view details