తెలంగాణ

telangana

ETV Bharat / bharat

డీకే శివకుమార్​ ఈడీ కస్టడీ 17 వరకు పొడిగింపు!

మనీలాండరింగ్​ కేసులో కర్ణాటక మాజీ మంత్రి డీకే శివకుమార్​ కస్టడీని ఈనెల 17వ తేదీ వరకు పొడిగించింది దిల్లీలోని రౌస్​ అవెన్యూ కోర్టు. కాంగ్రెస్​ నేత విచారణకు అసలు సహకరించట్లేదని, అందుకే కస్టడీని మరో ఐదు రోజులు పొడిగించాలన్న ఈడీ అభ్యర్థన మేరకు ఈ నిర్ణయం తీసుకుంది కోర్టు.

By

Published : Sep 13, 2019, 6:10 PM IST

Updated : Sep 30, 2019, 11:52 AM IST

డీకే శివకుమార్​ ఈడీ కస్టడీ 17 వరకు పొడిగింపు!

కర్ణాటక మాజీ మంత్రి, కాంగ్రెస్​ సీనియర్ నేత డీకే శివకుమార్​కు మరో ఎదురుదెబ్బ తగిలింది. మనీలాండరింగ్ కేసులో ఆయన కస్టడీని ఈ నెల 17 వరకు పొడిగిస్తూ దిల్లీలోని రౌస్​ అవెన్యూ కోర్టు తీర్పునిచ్చింది.

నేటితో తొమ్మిది రోజుల విచారణ గడువు పూర్తయిన నేపథ్యంలో శివకుమార్​ను కోర్టులో ప్రవేశపెట్టారు ఎన్​ఫోర్స్​మెంట్​ డైరెక్టరేట్​(ఈడీ) అధికారులు. నిజానిజాలు బయటపడాలంటే కస్టడీని మరో ఐదు రోజులు పొడిగించాలని కోర్టును కోరారు.

అధికారుల అభ్యర్థన మేరకు శివకుమార్​ను 17వ తేదీ వరకు విచారించేందుకు కోర్టు అనుమతినిచ్చింది. కాంగ్రెస్ నేత​ బెయిల్​ పిటిషన్​పై ఈ నెల 16 లోగా తమ స్పందన తెలియజేయాలని ఈడీని ఆదేశించింది న్యాయస్థానం.

నిజాన్ని దాస్తున్నారు

అంతకుముందు... కస్టడీ పొడిగింపుపై వాడీవేడి వాదనలు జరిగాయి. శివకుమార్​ నిజాలను దాచేందుకు చూస్తున్నారని, విచారణలో పొంతనలేని సమాధానాలు చెప్పారని కోర్టుకు తెలిపారు అధికారులు. ఆయనకు చెందిన రూ.800 కోట్ల ఆస్తులు బినామీల పేరిటే ఉన్నాయని, 317 బ్యాంకు ఖాతాల ద్వారా రూ.200 కోట్లకుపైగా అక్రమ లావాదేవీలు జరిపారని నివేదించారు.

"ఈ కేసుకు సంబంధించి విలువైన సాక్ష్యాధారాలను స్వాధీనం చేసుకున్నాం. అయితే ఆయన నిజాలను దాస్తూ.. విచారణకు అసలు సహకరించట్లేదు. అందుకే మరో ఐదురోజులు కస్టడీని పొడిగించాలని కోర్టును కోరుతున్నాం."
-ఈడీ అధికారులు

తర్వాతి ఐదు రోజుల్లో శివకుమార్​ కచ్చితంగా మీకు కావాల్సిన సమాధానాలు చెప్పరని.. అలాంటప్పుడు కస్టడీని ఎందుకు పొడిగించాలని కోరుతున్నారని అధికారులను ప్రశ్నించింది కోర్టు.

"ఇప్పటి వరకు సరైన సమాధానాలు చెప్పని శివకుమార్​ తర్వాతి ఐదు రోజుల్లో ఎలా చెబుతారనుకుంటున్నారు? మీ ప్రశ్నలకు సమాధానం చెప్పనప్పుడు ఆయన కస్టడీని పొడిగించమని ఎందుకు కోరుతున్నారు? "
- రౌస్​ అవెన్యూ కోర్టు

శివకుమార్​ ఆసుపత్రిలో చేరాలి

శివకుమార్​ ఆరోగ్య పరిస్థితి బాగాలేదని, ఆయన కచ్చితంగా ఆసుపత్రిలో చేరాలని కోర్టుకు తెలిపారు కాంగ్రెస్​ నేత తరఫు న్యాయవాది ఏఎం సింఘ్వీ.

వాదనలన్నీ ఆలకించిన న్యాయస్థానం... కస్టడీని ఈనెల 17వరకు పొడిగించింది.

Last Updated : Sep 30, 2019, 11:52 AM IST

ABOUT THE AUTHOR

...view details